Wednesday, July 20, 2016

పెళ్లినాటి ప్రమాణాలు ...


పెళ్ళినాడు మీరు అన్నిటికి ఒప్పుకొని చేసిన ప్రమాణాలను ఎలా మరుస్తారు ?? 

'ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి' అని వరుడు ప్రమాణం చేస్తాడు. అంటే 'ధర్మమునందు గాని, సంపదల విషయములందు గాని, శారీరక సుఖ విషయములందు గాని, దాన ధర్మములవల్ల లభించు మోక్ష విషయములందు గాని నిన్ను విడిచి నడువను.' అని వధువును పరిగ్రహించే ముందు వరునిచేత ప్రమాణం చేయిస్తారు. తరువాత మాంగళ్యధారణ సమయం లో కూడ ప్రమాణం లాంటి మంత్రాన్నే ఈ విధం గా చెబుతాడు వరుడు. 



'మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా.
కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదశ్శతం '

అనగా : ఓ మాంగళ్యమా! నా జీవనానికి కారణ భూతురాలైన ఈ సౌభాగ్యవతి కంఠానికి నిన్ను అలంకరిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఈమె కంఠము నందే వుందువు గాక!. ' అని చెప్పి మాంగళ్యాన్ని వధువు మెడలో మూడు ముళ్ళు వేసి కడతాడు.... త్రిమాతలైన లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవి లకు అంకితం గా మూడు ముళ్ళుగా వాటి యొక్క పవిత్ర చిహ్నంగా అవి పేర్కొనబడతాయి ...

సప్తపది లో కూడా ... ' ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు' అనే మంత్రాలతో ఏడడుగులు వేయిస్తారు.... 

మొదటి అడుగు శక్తి కోసం, రెండవ అడుగు బలం కోసం, మూడవ అడుగు వ్రతం కోసం, నాల్గవ అడుగు ఆనందం కోసం, ఐదవ అడుగు ఇంద్రియ బలం కోసం, ఆరవ అడుగు రుతువుల కోసం, ఏడవ అడుగు గృహ ధర్మాల కోసం.. ఇద్దరమూ జీవితాంతం ఇలాగే కలసి నడుస్తాము అని అగ్ని సాక్షి గా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపది తో వధువు యింటి పేరు మారిపోతుంది. వివాహానికి ఈ కార్యక్రమమే చాలా ముఖ్యమైనది.... పెళ్లి నాటి ప్రమాణాలు అంటే ఇవి... వీటిని పురుషుడు తప్పనిసరిగా అనుసరించి ఆచరించిన నాడే.. పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకుంటుంది. భర్తకు భార్య.... భార్య కు భర్త ..... అన్యోన్యంగా తోడు, నీడగా .. అరమరికలు లేకుండా అర్ధ నారీశ్వర తత్వం తో బ్రతికినప్పుడే ఈ ప్రమాణాలకు అర్ధం, విలువ వుంటుంది. 

కీచులాటలతో, వివాదాలతో, నిత్య సమస్యలతో... నిండు జీవితాలను బండల పాలు చేసుకోకూడదు. ప్రతి ఒక్కరు వివాహ ప్రయోజనాలను అర్ధం చేసుకోవాలి, వాటి గురించి తెలుసుకోవాలి.... 

ఆరు పదులు దాటినా కూడా మీ అర్ధాంగిని మల్లె పందిరి పక్కన నులకమంచం మీద ఒయ్యారంగా కూర్చున్నట్లుగా భావించాలి.. అప్పుడే సంసారం రసవత్తరం అవుతుంది.. రెండు రోజుల క్రితం ఒక ఆర్టికల్ చదివాను అందులో ఒక ముసలి అతను ఇలా అంటున్నాడు.. నా ఇరవై అయిదు ఏళ్ళ వయస్సులో నాకు పెళ్లి చేసారు ... చాలా పేద స్థితిలో వుండే వాడిని అప్పుడు చిన్న పట్టమంచం వుండేది ఆ మంచం ఒకరికి ఎక్కువ ఇద్దరికి తక్కువలా వుండేది .. నేను నా అర్ధాంగి ఇద్దరం ఇరుక్కొని మరీ పడుకునే వాళ్ళం .. చాలా గమ్మత్తుగా వుండేది లే ఆ రోజులు.. ఆ సమయ ఆనందం నేను ఉదయం నుంచి కష్టపడ్డ శ్రమను పక్కకు నేట్టేసేది వెచ్చని ఒకరి శ్వాసలో మరొకరం మిళితమై పడుకొనే వాళ్ళం.. ఇప్పుడేమో చూడు ఖరీదైన ఏ.సి. గదుల్లో విశాలమైన మంచాలలో పడుకుంటున్నాం కాని నా పక్కన ఇప్పుడు వున్నది ఓ 50 ఏళ్ళ ముసల్ది... అప్పుడేమో ఓ 22 ఏళ్ళ చిన్నది.. అంటూ చెప్పుకొచ్చాడు.. అంటే ఈన పక్కన వున్న భార్య ముసలిది అయిపోయింది.. ఈన మాత్రం ఇంకా సుఖ పురుషుడే అన్నట్లుగా వున్నాడు.. చాలా నవ్వుకున్నాను ఆయన మాటలు విని యెంత అన్యోన్య దాంపత్యమో కదా.. 

ఇలాంటి అర్ధాంగినుల మీద చిరు కవితాసత్కారం ... 

మల్లెలు విరబూసిన సొగసే నీది... 
సన్నజాజి సంధ్య వెలుగుల సౌందర్యమే నీది... 
సంపెంగెల వలపుల సోయగమే నీది... 
మందారపు చిరుమంద హాసముతో ..
పారిజాతపు పరిమళ పరువా పారవశ్యముతో ...
పెండ్లి పీటలపై, కనకాంబరాల కన్య జ్ఞాన నేత్రాన ...
పసిడి తలంబ్రాల తన్మయత్మంతో ... సింధూరపు సిగ్గులోలకంగా ...
మంగళకరమైన మాంగల్యం నీ మనోరంజిత కంఠముపై మెరవంగ ...
చూచెడి జనులెల్లరు కనులకు కనులారవిందు గావించగా ...
మెరిసే ఆకాశపు నక్షత్రములనే అక్షింతలుగా మలచి ...
నిత్య, నూతన వధూవరులను ఆశీర్వదించగన్ ...

స్వస్తి __/\__

Bobby Nani​

No comments:

Post a Comment