Wednesday, January 22, 2020

హంసయాన


SOCOTRA కథ వల్ల చాలా రోజులైందబ్బా ఓ ఘాటైన కవిత్వం వ్రాసి.. ఇక అది అయిపోయిందిగా.. గాండీవమువల్లె నడుమును వంచి, అక్షరములను మన్మధ శరములుగా మలిచి, సంధిస్తున్నానిదిగో “హంసయాన” ను. అభిప్రాయాలు వెలిబుచ్చాలి మరి.. 
తన ప్రేయసి ఎంత రమణీయమైనదో, ఎంతటి సాత్వికగుణవిలక్షిణి యో వర్ణిస్తూ మనకు తెల్పే ప్రయత్నం ఎలా చేస్తున్నాడో చూడండి ఆ భావకుడు..

హంసయాన 
*********

ఓ రమణీ
నీ కాంతి తీరాల కలల వెంబడి నిత్యం 
నిశీధములోకి పయనించే చైత్రసారథిని నేను..!!


నిశ్శబ్దంలో ఆరిపోయిన వేవేల గొంతుకలు
క్షణకాల నీ సమ్మోహన వీక్షణముతో 
వసంత కోయిలలై సప్తగమకములు పలికెనే.. !!

ఓ ప్రేయసీ ..!!
ఏమాట కామాటేనే
నీలోని సాత్విక సౌష్టవములు జూచి 
నా మానస ప్రవృత్తి 
కందళ తాళ ఆనంద నాదములతో మున్గి తేలుతూ 
చతుర్ధావస్థతో ప్రతిధ్వనులు గావిస్తున్నాయి.. !!

ఏమా సొబగులు !
ఏమా చెలువులు !
పురివిప్పిన మధుమాస చైతన్యం 
నీలో దాగున్న నవ యౌవనం,
ఆ లేలేత బాహువులే తామరతూళ్ళు, 
లక్ష్మికళ ఉట్టిపడే ఆ పసిడి మోమే విలువైన కమల సంపదలు 
నీలోని ఆ యౌవనపు కాంతులే 
శృంగార లీలా విలాసాల శీతల జలపాతాలు
చంచలాలైన సోగ కన్నులే బేడిస చేప కైంకర్యములు 
వట్రువలైన స్తనాలే రథాంగ చక్రవాకములు.
ముచ్చటగొలిపే నీ వాలు జడ అందాల శైవాలము..!!

లావణ్య విలాసాలు గల సచేతనమైన పరిపూర్ణ స్త్రీ తత్వాన్ని 
అయిదే ఐదు అడుగులలో అణువణువున రూపొందించాడా బ్రహ్మ.. 
మతుండే చేసాడంటావా..!!
లేక మత్తెక్కి చేసాడంటావా..!!
వేళాకోళమాడే మరదలు పిల్ల వలె 
గాఢ నిద్రలో వున్న నా చెవిదగ్గరకొచ్చి 
కొక్కొరోకోయి మంటూ చిలిపిగా పిలిచి పోతుంటావు .. 
కన్నులముందుకొచ్చి ఓ సారి కనువిందు చేయవే..
కన్నులు మూసేవరకు పదిలపరుచుకుంటాను.. !!

Written by: Bobby Nani

Saturday, January 11, 2020

JOURNEY OF SOCOTRA




SOCOTRA (The Mysterious Island) ఇది కథ లా నేను రాయలేదు.. ఒక హృదయం నుంచి మరో హృదయానికి చేరే అనుభూతిని, భావాలను కలిపి కుట్టే దారపు కండె లా ప్రతీ అక్షరాన్ని ఆస్వాదిస్తూ నేను ఈ కథను వ్రాయడం జరిగింది.. కొందరు మిత్రుల ప్రోద్బలము, ప్రోత్సాహము వెలకట్టలేనిది. వారికి నేనెంతో రుణపడివున్నాను.. అసంపూర్తిగా సగం లోనే ఈ గ్రంధం నిర్జీవమైపోయిన తరుణంలో నా సోదరి శ్రీమతి రూపసాహిత్య గారు పట్టువిడువక ప్రతీ సందర్భములో నను అడుగుతూ నన్ను వ్రాయమని ప్రోత్సహించే వారు. వారి అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇది.. నిజంగా మీకు కృతజ్ఞతలు సోదరి.. 
ఈ కథకు నాకు అవినాభావసంబంధము అందరికీ తెలిసి ఐదు ఏళ్ళు.. కానీ దానికి మునుపు మరో సంవత్సరము నుంచే నేను SOCOTRA దీవిపై అధ్యయనం చేస్తున్నాను... ఎందుకని మీకు 139 పేజీలు రాయడానికి ఇన్ని సంవత్సరముల సమయం పట్టింది అని అడిగే కొందరు మిత్రులకు నా చిరు వివరణ : “క్రిప్టోగ్రఫీ – గూఢలిపి” శాస్త్రం ఇందులో నాకు ఇష్టమైన అతిముఖ్యమైన సన్నివేశం.. ఈ కోడింగ్ నేర్చుకోవడానికి నాకు పట్టిన సమయం షుమారుగా ఒక సంవత్సరము .. youtube లోని కొన్ని సలహాల రూపంలోనూ, కొన్ని వెబ్ పేజీలలోని సూచనలను నేర్చుకున్నాను... అన్నిటికన్నా ముఖ్యంగా నా శ్రీమతి తన పేరుకు తగ్గట్లే తానో “ప్రత్యూష”ము తను M.tech., చేస్తున్నప్పుడు క్రిప్టోగ్రఫీ బేసిక్ సిలబస్ బుక్ లో చూసాను.. అది నన్ను చాలా ఆకట్టుకుంది.. ఇక ఇద్దరం కలిసి బాగా నేర్చుకున్నాం. తను నాకు ఎంతో నేర్పించింది.. క్రిప్టోగ్రఫీ ద్వారా ఒక తాళం, ఆ తాళానికి తాళంచెవిని మేమే సృష్టించాము.. రెండిటినీ ఆ వీలునామాలోనే అత్యంత రహస్యంగా నేను ఏర్పరిచాను.. 
ఇక చిన్మయానంద్ భాటియా గారు వ్రాసిన ఆ సీల్డు కవర్ వీలునామా ఆధారంగా SOCOTRA ప్రయాణం మొదలౌతుంది.. సీల్డు కవర్ వీలునామాలోని ఇంగ్లీషు అక్షరాల ద్వారా వాటి వెనుకన దాగివున్న అదృశ్య సిరా వ్రాతల ద్వారా ఒక తాళంచెవి వంటి కొన్ని ఇంగ్లీషు అక్షరాలు దొరుకుతాయి.. ఆ అక్షరాలను ఎన్నో విధాలుగా మార్చి మార్చి ప్రయత్నిస్తాడు ప్రసన్నకుమార్ భాటియా.. ప్రయోజనం ఉండకపోవడంతో పెద్దోడైన ఆకాష్ తన సీనియర్ మ్యాడం ద్వారా ఆ అక్షరాల మర్మాన్ని కనుగొనమని అడుగుతాడు.. ఆమె ఆ అక్షరాల మర్మాన్ని కనుగొని “ISLAND OF SOCOTRA” అనే దీవి గురించి వారి తాత గారు ఎందుకు అంత గోప్యంగా మర్మంగా వ్రాసారో అనే సందేహముపై అన్వేషించడానికి వీరు నలుగురూ సముద్ర ప్రయాణమౌతారు.. 


వారు వెళ్తున్న లాంచీ 82 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా హటాత్తుగా వాతావరణం అంతా ప్రళయావేశంతో నిండిపోయి వారిని, వారు ప్రయాణిస్తున్న లాంచీ ని అల్లకల్లోలం చేసి కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న ఒక చిన్న దీవిలో విసిరికొడుతుంది.. అదృష్టవశాత్తు అందరూ స్వల్ప గాయాలతో బయటపడుతారు.. ఆ దీవి నుంచి బయటపడే క్రమంలో అందరూ ఒకచోట చేరి మాట్లాడుకుంటూ వుండగా.. ప్రసన్నకుమార్ భాటియా 3 అడుగుల చిన్నని రాతి మీద ఎక్కి తనగురించి, తన జీవితం గురించి ప్రసంగించి.. మిగతా వారిని కూడా వారి జీవితాల గురించి ప్రసంగించమని కోరుతారు.. 


మొదటగా ఓ పెద్దాయన తన జీవితంలో జరిగిన సంగతులను ప్రసంగిస్తాడు.. అందరికీ కళ్ళు చమర్చుతాయి.. తరువాత 15 ఏళ్ళ యువకుడు ముందుకు వచ్చి తన జీవితంలో జరిగిన అత్యంత దుర్భరమైన సంగతులను వివరించి అందరి హృదయాలను కదిలించేస్తాడు .. తరువాత ముంబై నగరంలో ఓ పెద్ద ఐ.టి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే మోహన్ అనే వ్యక్తి తన జీవితంలో జరిగిన విచిత్రమైన నమ్మశక్యం కాని విషయాలను వివరిస్తాడు.. తనను ఒక కల పదే పదే వెంటాడుతూ వుందని అది అత్యంత భయంకరమైనదిగా వుందని దానిగురించి తను ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయించినా ఫలితం లేదని.. తన దగ్గర పనిచేసే ఓ పిల్లాడి సలహా మేరకు ఎవ్వరూ ఉండని అస్తమయపురం అనే చిత్రమైన గ్రామానికి వెళ్తే అక్కడకు ప్రతీ అమావాస్య తరువాత చంద్రుని నుంచి వెలువడే మొదటి రోజు (నెలపొడుపు) యవ్వన చంద్రకాంతులు ప్రసరించే ఆ రాత్రి వేళ ఒక అఘోరా వస్తాడని, తన మాటలు శూలాళ్ళలా ఉంటాయని, ఎన్నో సమస్యలను తను తీరుస్తాడని ఆ పిల్లాడు చెప్పడంతో మోహన్ అక్కడకు వెళ్ళగా.. అఘోరా భూత. భవిష్యత్, వర్తమానం అనే మూడు గుంటలను ఏర్పరిచి భూత కాలంలో మోహన్ ఏం కోల్పోయాడో చూపిస్తూ, వర్తమానంలో తనేం చేస్తున్నాడో తన ప్రవర్తన ఎలా వుందో చూపిస్తూ, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని హెచ్చరిస్తూ తనని తాను తెలుసుకునేలా తను మారేలా ఆ అఘోరా మోహన్ సమస్యను పరిష్కరిస్తాడు.. 

82 మంది ప్రయాణీకులు ఇరుక్కున్న ఆ దీవిలో బయటపడే మార్గాల కొరకు ఎనిమిది బృందాలుగా (ఒక బృందానికి పదిమంది చొప్పున) మారి తలో ఒక దిక్కున అందరూ వెతుకుతున్నారు అప్పుడే పెద్ద శబ్దం చేస్తూ ఒక హెలికాప్టర్ కూలి ఆ దీవిలో పడుతుంది.. పేరాచూట్ నుంచి దిగిన ఓ వ్యక్తి తన శాటిలైట్ ఫోన్ ద్వారా తన పై అధికారులకు తెలిపి తనతోపాటు ఈ దీవినుంచి బయటపడే మార్గం కూడా తను చూపిస్తాడు.. తరువాత రోజు ఆ దీవిదగ్గరకు ఓ నౌక వస్తుందనగా ఆ రోజు రాత్రి అందరూ మంట వేసుకొని ముచ్చట్లు ఆడుతున్న సమయంలో చెట్టు గుబురుల మధ్యన ఓ వికృత ఆకారంలో వున్న మనిషి ఆకారాన్ని చూస్తాడు ప్రసన్న కుమార్ భాటియా మొదటి కుమారుడు అయిన ఆకాష్.. 


ఆ విషయాన్ని మోహన్ తో మాట్లాడుతూ వుండగా చకచకమని చాలా వేగంగా వారి వెనుక ఎవరో పరిగెత్తిన చప్పుడు వినిపిస్తుంది.. వెనక్కి తిరిగి చూడగా.. దూరాన ఆ వికృత ఆకారం వెళ్ళడం గమనిస్తారు ఇద్దరూ.. ఆ కారాన్ని వెంబడిస్తూ నిప్పుకు స్పందించే రాయి ద్వారా నేలమాళిగ లోనికి వెళ్ళి తనతో మాట్లాడి వీరు వెళ్ళబోతున్న దీవిలో ఏవో కొన్ని అసాంఘికకార్యక్రమాలు జరుతున్నట్లు వారు భావిస్తారు.. ఆ తరువాత అక్కడనుంచి మరో నౌకద్వార వారి ప్రయాణం సాగిస్తూ వుండగా ఓ గదికి సంబంధించిన తలుపు మీద “నేత్రం నుంచి జాలువారే కన్నీరు” ఆకారంలో ఓ గుర్తును చూస్తాడు ఆకాష్.. అదే గుర్తు కలిగిన ఒక మ్యాప్ ని ఆ విచిత్ర ఆకారం ఆకాష్ చేతికి ఇచ్చి వుండటం చేత ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటాడు ఆకాష్. దానికి మోహన్ కూడా సాయం అందించగా ఆకాష్ ఎలాగోలా ఆ గదిలోపలకు వెళ్తాడు.. రోదిస్తున్న ఓ అందమైన అమ్మాయిని చూస్తాడు ఆకాష్.. చూసిన వెంటనే తనపై మనసు పారేసుకుంటాడు. తనకోసం ఏదైనా చెయ్యాలని తపించిపోతాడు.. 

తనతో మాట్లాడి తన గతం గురించి తెలుసుకుంటాడు.. అప్పుడు తను చంద్రిక కొలను అనే రహస్య నీటి కొలను గురించి చెప్తూ జలకూన అనే సాగర పుత్రికను కలుసుకున్నట్లు, తన ప్రాణం కాపాడినట్లు తదితర విషయాలను ఆ అమ్మాయి చెప్తుంది.. అన్ని విన్న ఆకాష్, మోహన్ లు తనను ఆ గది నుంచి విడిపించి వారు వున్న గదిలోకి తీసుకొచ్చి ప్రసన్నకుమార్ భాటియాకు పరిచయం చేస్తారు.. అందరూ ఆ నౌకలోని వారిని ఏమార్చి ఓ చిన్న పడవ సాయంతో “SOCOTRA (The Mysterious Island)” కు వెళ్తారు.. 

“SOCOTRA” దీవిలో దారి పొడవునా వింత వింత ఆకారంగల జీవులు, విచిత్రమైన వృక్షాలు దూరాన కనిపిస్తున్న ఎన్నో ఏళ్ళ సంవత్సరాలనుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కాపలా కాస్తున్న పెద్ద పెద్ద వృద్ద పర్వతాలు… నిజంగా భూమి పైనే వున్నామా ?? లేక ఏదైనా గ్రహం మీదకు వచ్చిపడ్డామా … అనేంతలా ఉన్నటువంటి ఈ దీవిని కళ్ళు, నోరు రెండూ పెద్దవిగా చేసి చూస్తూ ముందుకు కదులుతున్నారు.. 20 మిలియన్ సంవత్సరముల వంటి చరిత్ర కలిగిన “డ్రాగన్ వృక్షాల” మధ్యన నడుచుకుంటూ వెళ్తున్నారు.. భానుడి వేడి కిరణాలను వారిపై పడకుండా ఉండేందుకు ఛత్రము వలె తెరిచి వారి తలపై పెట్టినట్లుగా కనపడుతున్నాయి ఆ వృక్షాలు.. 
ఇప్పటివరకు వారు చుసిన జీవరాసి ఒక్కటి కూడా ఇక్కడ కనిపించట్లేదు …. ప్రతీ జీవి అక్కడ ప్రత్యేకమైనదిగా, భయంకరమైనదిగా కనపడుతోంది వారికి.. దాని గురించి మాట్లాడుకుంటూ ముందుకు కదిలారు.. అక్కడ సున్నపురాయితో కలిగిన ఓ రాతి గుట్ట ను గమనించి అందులోకి వెళ్తారు అందరూ.. అక్కడ గోడలపై వున్న 9వ, 10వ శతాబ్దం మధ్యలోని అతిపురాతన కళాఖండాలను చూస్తూ, ఆ గోడలపై భారతదేశం యొక్క బ్రహ్మలిపి చెక్కబడి వుండటం చేత అది ఒక కోవెల అని నిర్ధారించుకొని విశ్రాంతి తీసుకుంటారు అందరూ.. రాత్రి వేళ మంట వెలుగులలో పసిడి కాంతులతో చుట్టూ వున్న గోడలపై ఏవో కొన్ని దృశ్యాలను చూసి రెండు పెద్ద పెద్ద కొండల మధ్యన సన్నని ద్వారము ఆ రెండు కొండలను చీలుస్తూ భూమి లోపలకు వెళ్ళినట్లుగా ఒక రాతిబింబం ద్వారా మార్గాన్ని కనుగొంటారు.. 

అందరూ అక్కడనుంచి బయలుదేరి ముందుకు కదులుతూ వుండగా.. మార్గ మధ్యలో యక్షామి అనే మనిషికి తినే ఆటవికుల గుంపు వారిని అడ్డగించి వారితో తీసుకెళ్తుంది.. ఆ గుంపుకు నాయకురాలైన ఉవిధ అనే ఆమె తానో మంత్రముగ్ధ అంటూ వారికి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తెల్పుతుంది.. ప్రసన్నకుమార్ భాటియా తాత గారైన చిన్మయానంద్ భాటియా ఇదివరకే ఇక్కడకు వచ్చినట్లు కొందరు ఈ ప్రాంతానికి రాబోతున్నట్లు ఆమెకు చెప్పి హెచ్చరించినట్లు ఉవిధ చెప్తుంది.. తన మాటలు పట్టించుకోకుండా వున్నందుకు దాని పర్యవసానమే మా జాతిలో నేనొక్కదాన్నే మిగిలానని బాధపడుతుంది.. ఇక్కడ జరిగే విషయాలన్నీ రహస్యంగానే వున్నాయి.. అందుకే ఇన్ని రహస్యాలను ఒకేసారి చెప్పలేక మీకు ఒక ఆచూకి లా వీలునామాను పొందుపరిచి దాని ద్వారా మీరు ఈ దీవిని కనుగొనేటట్లు చేసి చివరికి మిమ్మల్ని ఇక్కడదాకా రప్పించారు మీ తాత గారు అంటూ చెప్తుంది ఉవిధ.. 

తరువాత వారిని అస్తమయ పురంలో కనిపించిన అఘోరా వద్దకు తీసుకెళ్తుంది.. ఆ అఘోరా వారందరికీ క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దం నాటి కొన్ని నిజాలను చెప్తాడు.. అవి ఓ సముద్రపు ఒడ్డున వాసుర నక్షత్ అనే ఇద్దరు పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవారని.. ఒకరోజు ప్రమాదవశాత్తు వాసుర ఆ సముద్రం లో పడిపోతుందని, తరువాత ఆ వాసుర అనే అమ్మాయిని “ఆత్మాశి” అనే సముద్ర మత్స్యక కాపాడుతుందని, వాసుర నక్షత్ లను ఆమె చంద్రిక కొలను దగ్గరకు తీసుకెళ్ళి వారిని పెంచుకుంటుందని. వారికి అన్ని నేర్పుతుందని, తరువాత వారు పెద్ద అయ్యాక చంద్రిక కొలనులో అత్యంత రహస్యమైన సృష్టికి సంబంధించిన రెండు శ్వేతవర్ణపు మీనాల గురించి వాటి మనుగడ గురించి చెప్పి ఏదో ఉపద్రవం రాబోతుందని గ్రహించి వారికి రెండు వేరు వేరు పనులు కేటాయిస్తుంది ఆత్మాశి.. 
1. ఆత్మాశి కి జన్మించబోయే జలకూన రక్షణా బాధ్యతను వాసుర అప్పగిస్తుంది తనను ఒక దిక్కుకు పొమ్మని సూచిస్తుంది.. అలానే 
2. “SOCOTRA” దీవిలోకి నక్షత్ ను పంపించి తనని బ్రహ్మలిపి లో చంద్రిక కొలను గురించి దాని విశిష్టత గురించి, ఆత్మాశి గురించి రాయమని పంపుతుంది.. అలా వారి ఇద్దరినీ, వారి ప్రేమను దూరం చేస్తుంది ఆత్మాశి.. 

కొన్ని సంవత్సరముల తరువాత ఆ గ్రంధాన్ని పూర్తి చేసి “SOCOTRA” దీవిలో భద్రపరిచి వాసురను వెతుక్కుంటూ తనకోసం వెళ్తాడు నక్షత్.. అప్పటికే సమయం చేయిదాటి వుంటుంది.. జలకూన కోసం వచ్చిన సముద్రపు దొంగలు వదిలిన బాణం వాసురకు తగిలి తను కొనప్రాణంతో వుండగా నక్షత్ అక్కడకు వచ్చి తనను ఒడిలో పెట్టుకొని ఆకాశం వైపు తలయెత్తి బిగ్గరగా రోదిస్తూ తను ప్రాణం వదుల్తాడు.. జలకూన అక్కడనుంచి తప్పించుకొని సముద్రగర్భంలోకి వెళ్ళిపోతుంది.. తన బాధ్యత కోసం ఆత్మాశి కూడా ఆ స్వేతవర్ణపు మీనాలకోసం తన ప్రాణాలు విడుస్తుంది అని చెప్తాడు ఆఘోరా.. 

అప్పుడే యక్షామీ (ఉవిధ) జలకూనను అక్కడకు తీసుకొస్తుంది.. తరువాత అఘోరా చెప్పిన ప్రణాళిక ప్రకారం మూడు బృందాలుగా విడిపోయి మూడువైపులుగా వెళ్తారు.. మొదటి బృందంలో కన్నీళ్ళను సేకరించే ప్రదేశాన్ని కనుగొంటారు.. రెండవ బృందంలో లోకేష్ ప్రాణాలు కోల్పోయి అక్కడ బంధించిన స్త్రీ లను కాపాడి సురక్షిత ప్రాంతానికి తీసుకొస్తారు.. మూడవ బృందంలో చంద్రిక కొలను దగ్గరకు వెళ్ళిన జలకూన భయంతో సాయం చెయ్యకుండా లోపలకు వెళ్తుంది.. అక్కడ కాలరంధ్రముల ద్వారా పయనించి తన భయాన్ని జయించి తన పెదమ్మను కలుసుకొని తన ప్రోద్భలంతో తనలో దాగిన అతీత శక్తిని పుంజుకొని వేగంగా కొలనులోకి ప్రవేశించి అత్యంత భయంకరమైన సుడిగుండాన్ని ఏర్పరిచి ఆ మీనాలను రక్షిస్తుంది.. వారి యంత్రాలను, వారి పరివారాన్ని చెల్లాచెదురు చేసి తాను సంపూర్ణ మత్స్యక లా మార్పు చెందుతుంది.. 

అంతలో యక్షామీల సమూహం వచ్చి మిగతావారినంతా బంధించి సముద్రము మధ్యలో వారి చేతులు కాళ్ళు కట్టి వారిని ముంచేస్తారు.. ప్రాణాలు పోయిన లోకేష్ కు జలకూన (మీననేత్రి) సప్తధాతువులచే ప్రాణాలు పోస్తుంది. సముద్రపు దొంగలు కొల్లగొట్టి అత్యంత గోప్యంగా దాచిన నిధిని ప్రసన్నకుమార్ భాటియాకు అందజేస్తుంది యక్షామీ (ఉవిధ).. 


ఆకాష్, ఆ అమ్మాయి ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని అమ్మాయి వాళ్ళ పెదనాన్నకు చెప్పి ఒప్పించి వారు ఇద్దరూ చంద్రిక కొలను దగ్గరకు వచ్చి ఇప్పటికైనా నీ పేరు చెప్తావా అనే ఆకాష్ ప్రశ్నకు ఆ అమ్మాయి సమాధానముగా నా పేరు “లేక్షణ” అని చెప్పి తన పెదవులపై ముద్దులు కురిపిస్తూ తనని లతలా అల్లుకుపోతూ అక్కడితో ఈ కథ సంపూర్ణం అవుతుంది.. !!

కథలోని ముఖ్యమైన అంశములు 
*************************
ఆ దీవి అందాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. 
అక్కడి అనుభూతుల్ని ఆస్వాదించడానికి సమయం చాలదు ..
అందం ఉన్నచోటే ఆపదకూడా పొంచి వుంటుంది.. 
అంత అందమైన దీవిలో అడుగడుగునా ఆపదే... 
ఆ అపాయాలను అడ్డుకుంటూ ఓ సాహస యాత్ర ను ఉద్దేశించి, ప్రతీ భావాలను కళ్ళకు కట్టినట్లు చూపడమే నా ముఖ్య ఉద్దేశం.. ముఖ్యంగా ఈ కథలో ఓ కుటుంబం చేసే అత్యంత సాహస ప్రయాణాన్ని.. ఆ ప్రయాణంలో వారికి కలిగిన అనుభవాలను, సంభవించిన పరిణామాలను కూలంకషంగా రాస్తూ వున్నాను.. 

కథలో కొన్ని పెర్లుకు, వాటి ప్రాముఖ్యతలకు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు... 
వాటిల్లో కొన్ని మరలా మీ ముందుకు..

"సీల్డు కవర్ వీలునామా" 
"క్రిప్టోగ్రఫీ - గూఢలిపి శాస్త్రం" 
"అదృశ్య సిరా" 
"లాంచీ ప్రయాణం" 
"సముద్ర ప్రళయ ఘాబీర్యం" 
"వెంటాడే కల" 
"నెలపొడుపు" 
"అస్తమయ పురం" 
"మూడు గుంటలు" 
"అగ్నిలో అభ్యంగన స్నానం" 
"అఘోరా" 
"భూత, భవిష్యత్తు, వర్తమానం" 
"అడవిలో వికృత ఆకారం" 
"నేల మాలిగ" 
"నిప్పుకు స్పందించే రాయి" 
"కన్నీటి బిందువులు" 
"రహస్య నౌక" 
"చంద్రిక కొలను" 
"జల కూన " 
"శతాబ్దాలనాటి రెండు శ్వేతవర్ణపు చేపలు" 
"తాబేలు హారం" 
"అపురూప సౌందర్యవతి"
“యక్షామీలు” 
“వాసుర – నక్షత్”
“స్త్రీ ఆక్రందన” 
“మంత్రదములు”
“ప్రణవతాండవం” 
“ఆత్మాశి”
“మీననేత్రి”
“శకులి”
“లేక్షణ”

పిల్లలు సరే, హేతు బద్ధతిని కోల్పోతున్న యిప్పటి యువకులు కూడా యిలాంటివి చదివితే సమాజానికి ఎంతో కొంత మంచిదని నా ఉద్దేశం.. ఇందులో ముఖ్యంగా ఒక కొత్త సబ్జెక్టు “Cryptography”(గూడలిపి శాస్త్రం) గురించి మరియు “లా” కు సంబంధించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలను కూలంకషంగా వివరించడం జరిగింది..

ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో.. మొదటి నుంచి చివరి వరకు “తరువాత ఏం జరుగుతుందా ?”
అనే ప్రశ్నను పదే పదే మీ ముందు ఉంచుతూ నరాలు తెగేంత ఉత్కంఠభరితముగా ఉంటుందని చెప్పగలను.. బుద్ధిని, తర్కాన్ని పెంచే రచనలు ఈ రోజుల్లో చాలా అరుదు.. ఎందుకంటె అందరూ ఈ మధ్య వినోదం మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు... వినోదంతోపాటు బుద్ధిని, తర్కాన్ని పెంచాలనే సంకల్పంతో ప్రతీ అక్షరాన్ని మనసుపెట్టి రాసాను... అందువల్ల అవి శాస్త్రీయం గా ఆలోచించేందుకు ఉపయోగపడతాయి.

స్వస్తి __/\__

Written by: BOBBY

SOCOTRA (The Mysterious Island) from Bobby... 35th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

అఘోరాకి కూడా అంతుపట్టక ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు.. 

కాసేపు ఆ ప్రాంతం అంతా నిశబ్దంతో భారంగా మారిపోయింది.. 


తరువాత ఏంటో చూద్దాం పదండి..
35th Part
మీననేత్రి దూరంగా వెళ్ళి కళ్ళు మూసుకొని తన తల్లి (ఆత్మాశి) ని తలుచుకుంది.. కొన్ని క్షణాలు అలా వుండిపోయి.. మీరంతా దూరంగా వెళ్ళండి అంటూ లోకేష్ దగ్గరకు వేగంగా వస్తుంది.. తన శక్తినంతా కళ్ళలోకి చేర్చి.. పెద్దగా రోధిస్తుంది మీననేత్రిని.. 

ఆ రోధన ఎలా వుందంటే ఆకాశమే బాధతో కరిగి వర్షించేలా వుంది.. నాలుగు దిక్కులు పిక్కటిల్లేలా తను రోధిస్తోంది .. తన రోధనకు సాగరంలోని జీవాలన్నీ తీరానికి వచ్చి చూస్తున్నాయి.. ఒక్క జీవం కూడా జీవించని చంద్రిక కొలను మొత్తం రకరకాల సముద్రపు జీవాలతో నిండిపోయింది.. ఆ దృశ్యాన్ని చూస్తున్న అందరి హృదయాలు బరువెక్కిపోయాయి .. అప్పుడే తన నేత్రాలనుంచి రాలుతోంది.. ఆ రాలుతున్న కన్నీటి బిందువులను సరిగ్గా లోకేష్ కళ్ళలో పడేలా తన కనురెప్పలు తెరుస్తుంది.. రెండు కళ్ళలో రెండు బిందువులు తన కన్నీటిని వేసి మరో కొన్ని బిందువులను చంద్రిక కొలనులో వేస్తుంది మీననేత్రి..

లోకేష్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.. 

చంద్రిక కొలను మునుపటిలా నిర్మలంగా నీలవర్ణంగా మారిపోయింది.. తనకోసం వచ్చిన జీవాలన్నిటికీ నోటితో ఓ రకమైన సైగ చేసి తిరిగి పంపేస్తుంది మీననేత్రి..!!


ఇది అత్యద్భుతమైన సంఘటన.. మత్స్యక కన్నీరు కార్చడం నేనెప్పుడు వినలేదు, కనలేదు, ఎక్కడా చదవలేదు.. అంటాడు అఘోరా.. 

అవును మాకు కన్నీరు రావు..మా బాధలను మేము నియంత్రించగలము. అంతే కాదు మేము కన్నీరు చిందిస్తే మా యౌవనాన్ని మేము కోల్పోవాల్సి వస్తుంది.. విపత్కర పరిస్థితుల్లో తప్ప ఇలా ఎప్పటికీ చెయ్యము.. కానీ నా అక్క తన మెట్టినింట సంతోషంగా ఉండాలంటే లోకేష్ బ్రతకాలి.. నా అక్కకోసం ఇది చేసాను.. తను నా ప్రాణాలనే కాపాడింది.. తను నాకు చేసిన దానిముందు.. తనకు నేను చేసిన ఈ చిన్నపాటి సాయం ఏపాటిది.. అని మీననేత్రి అనగానే ఆ అమ్మాయి అమాంతం తనని హత్తుకుంది.. 

నొప్పిగా ఉందా..!!

అంటూ ఆ అమ్మాయి వీపును తడుముతూ అడుగుతుంది మీననేత్రి.. 

నొప్పికన్నా సంతోషమే ఎక్కువగా వుంది .. మరేం పర్వాలేదు అంటుంది ఆ అమ్మాయి.. 

నువ్వు కోరుకున్న వ్యక్తితో నీవు జీవితాంతం సంతోషంగా వుండాలి.. ఇదిగో ఇది తీసుకో అంటూ ఆ తాబేలు హారాన్ని చేతికిస్తుంది.. 

ఎందుకు మళ్ళి ఇస్తున్నావ్.. అని అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ఇది నాది కాదు .. నీదే అంటూ తన మెడలో వేస్తుంది మీననేత్రి.. 

సరే మరి నేను వుంటాను ఇక.. ఈ మీనాలను నిద్రలేపి వాటిని యధాస్థానంలో ఏర్పాటు చెయ్యాలి అంటుంది మీననేత్రి.. 

నిన్ను చూడాలనిపిస్తే ఎలా ? అని అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ఈ చంద్రిక కొలను దగ్గరకు వచ్చి నన్ను పిలిస్తే క్షణాల వ్యవధిలో నీ ముందు ఉంటాను అంటుంది మీననేత్రి.. !

సరే.. అంటూ నవ్వుతూ తన నుదిటిపై ఓ ముద్దు పెట్టి .. తన చెవి దగ్గరకు వచ్చి జాగ్రత్తగా వుండు.. అని చెప్తుంది ఆ అమ్మాయి.. 

అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా వుండు.. అంటూ అందరినీ నవ్వుతూ పలకరించి కొలనులోకి వెళ్ళిపోయింది మీననేత్రి..!!

మీ సాహసం, మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేము.. మమ్మల్ని, మా ప్రాంతాన్ని మళ్ళి మాకు తిరిగి ఇచ్చారు.. మీకు మీ కుటుంబానికి ఎంతో రుణపడిఉన్నాము. ముఖ్యంగా మీ తాత గారు చిన్మయానంద్ భాటియా గారికి అంటూ ఉవిధ..తనతోపాటు వున్న యక్షామీలు అందరూ వారి తలలు వంచి మోకాళ్ళపై మ్రోకరిల్లి ధన్యవాదములు తెలుపుతారు.. ప్రసన్నకుమార్ భాటియా కుటుంబానికి.. 

మా దీవిలో స్త్రీ ఆక్రందన నేటితో ముగిసింది అంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు యక్షామీలు .. 

అఘోరా, మోహన్, నౌకలోని పిల్లాడు అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయారు.. 

ఆ నౌకలోని వారినంతా ఏం చేస్తారు అంటాడు.. ఆకాష్.. 


వారు చేసిన తప్పు క్షమించరానిది.. అందుకని వారి చేతులు, కాళ్ళు కట్టి నడిసముద్రంలో ముంచి చేపలకు ఆహారంగా వేస్తాము అంటారు యక్షామీలు.. 

మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టాలో చెప్పండి ఆ నౌకలో మిమ్మల్ని క్షేమంగా వదిలి వస్తారు మా వారు అంటుంది ఉవిధ (యక్షామీ).. 

మరో విషయం.. మీరు నౌకలోకి ఎక్కిన తరువాత మీకు ఒక కానుక వుంది అది మీరు తీసుకునే బయలు దేరాలి అంటుంది ఉవిధ.. 

ఏమిటది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అదేంటో మీ చిన్న అబ్బాయిని అడగండి అంటుంది ఉవిధ.. 

సంతోష్ నీకు తెలుసా.. ?? ఏంటది అని అడుగుతారు మిగతా వారు.. 

అన్నయ్య వాళ్ళు నన్ను ఒక దగ్గర ఉండమని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు.. నాకు అక్కడ నేల అడుగు భాగాన మట్టిలో కనిపించి కనిపించని ఒక కాగితంవంటి ముక్క కనిపించింది... నేను అక్కడ కూర్చుని ఏమి తోచక దాన్ని నా గోరుతో లాగగానే కాస్త బయటకు వచ్చింది.. అది అత్యంత పురాతనమైనదిలా అనిపించి జాగ్రత్తగా లాగాను.. మరికాస్త బయటకు వచ్చింది.. అది ఒక మ్యాప్ లా నాకు అనిపించింది.. ఇంకాస్త బలంగా లాగాను.. మొత్తం చేతిలోకి వచ్చింది.. అది నేను అనుకున్నట్లుగా మ్యాప్.. అందులో ఏదో మార్గం వుంది.. ఇక్కడివారైన ఉవిధ కు ఇస్తే ఆమెకు తెలుస్తుందేమో ఆమెకు ఉపయోగపడుతుందేమో అని తనకు ఇచ్చాను.. అంత వరకే నాకు తెలుసు..

అది ఏం మార్గం ఉవిధను అడుగుతాడు సంతోష్.. 

తను ఆకాష్ వైపు తిరిగి .. నేను నీకు చెప్పాను కదా సముద్రపు దొంగలు నవ నిధులు దాచి పెట్టి ఉంచారని.. ఆ నవ నిధులకు మార్గమే సంతోష్ నాకు ఇచ్చిన మ్యాప్.. ఈ మ్యాప్ కోసం ఎన్నో తిరుగుబాట్లు, మరెన్నో యుద్దాలు జరిగాయి.. ఎందరివో ప్రాణాలు పోయాయి.. విదేశీయులు ఎందరో ఎన్నో విధాలుగా వెతికారు.. కానీ ఎవ్వరికీ దొరకలేదు.. నిష్కల్మషమైన మనస్సు కలిగి ఏమీ ఆశించకుండా ఇంతసాయం చేసారు అందుకే మీకు ఇది దక్కి తీరాలి అంటుంది ఉవిధ.. 


అది మీరే తీసుకోండి.. నాకు నా కుటుంబం క్షేమంగా దక్కింది.. నాకు మంచి కోడలు పిల్ల దొరికింది ఇవి చాలు నాకు.. మరేమీ వద్దు అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అదేం కుదరదు.. అయినా ఆ నిధిని ఆభరణాలను మేమేం చేసుకుంటాం.. ఇది మీ భారతీయ సంపద.. మీకే దక్కాలి.. అంటుంది ఉవిధ.. 

అలాగే దీన్ని తీసుకెళ్ళి మా ప్రభుత్వానికి అందజేస్తాము అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

సరే అని అందరూ అక్కడనుంచి బయలుదేరగా.. 

ఆ అమ్మాయి మాత్రం ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకొని మనం రెండు రోజులు ఆగివెల్దామా .. పెదనాన్నను కలిసి ఇదంతా చెప్పి అప్పుడు నేను నీతో వస్తాను .. అదీకాక రేపు పౌర్ణిమ.. రేపు రాత్రి ఈ చంద్రిక కొలను అందాలను చూడాలని వుంది అని తన పెదవులను దగ్గరగా చేసి చంటిపాప లా గోముగా అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ఇలా అడిగితే రెండు రోజులేం ఖర్మ.. ఇక్కడే దుకాణం పెట్టేస్తాడు అన్నయ్య అంటూ రెండోవాడైన లోకేష్ చమత్కరిస్తాడు.. 

ఆ మాటకు అందరూ నవ్వుకొని.. 

నిదానంగానే రండి లేకపోతే నేను వచ్చి మాట్లాడమంటే మాట్లాడుతాను అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

మీరు తరువాత వద్దురు మామయ్య గారు.. ముందు మేము వెళ్ళి మాట్లాడి వస్తాము అని చెప్తుంది ఆ అమ్మాయి.. 

అలాగే అంటూ ప్రసన్నకుమార్ భాటియా మిగిలిన ఇద్దరు కుమారులు ఆ నౌక ఎక్కి ఇల్లు చేరుతారు.. ఆ సంపదను భారతీయ ప్రభుత్వానికి అందజేయ్యగానే..వారి సాహసాన్ని, వారి కుటుంబాన్ని ప్రశంసిస్తూ, వారికి ప్రభుత్వం తరపు నుంచి పెద్ద మొత్తంలో బహుమతి దొరుకుతుంది.. చిన్మయానంద్ భాటియా గారి జ్ఞాపక గౌరవ చిహ్నంగా వారి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రముఖులు సత్కరించారు.. 

ఆ అమ్మాయి వారి పెదనాన్నకు జరిగినదంతా చెప్పి ఆకాష్ తో తన పెళ్ళికి ఒప్పించింది.. 

ఇద్దరూ ఆరోజు రాత్రి ఆ చంద్రిక కొలను దగ్గరకు చేరుకున్నారు.. 



ఆకాశంలో చంద్రుడు పళ్ళికిలించి నవ్వుతున్నట్లుగా, పిండారబోసినట్లుగా పండు వెన్నెల కాస్తుంది.. ఆ వెన్నెల్లో చంద్రిక కొలను కన్నా ఆ అమ్మాయి మోము మరింత శోభాయమానంగా వెలిగిపోతుంది.. అది గమనించిన ఆకాష్ .. తనను దగ్గరకు లాక్కొని తన రెండు చేతుల్లోకి ఆమె ముఖమును తీసుకొని.. నీ కన్నా అందంగా ఉందంటావా ?? ఈ చంద్రిక కొలను .. అంటాడు.. 

సిగ్గులొలుకుతూ.. తన కనురెప్పలు రెండూ కిందకు దించుతుంది ఆ అమ్మాయి… 

తన గవుదమును పట్టి మెల్లిగా పైకి లేపి.. తనకు ఇంకాస్త దగ్గరగా వచ్చి తన కళ్ళలోకి చూస్తూ.. 

ఇప్పటికైనా నీ పేరు చెప్తావా ? అంటాడు ఆకాష్.. !!


ఆ అమ్మాయి నేత్రాలు ఆనంద భాష్పాలతో నిండిపోయి ఆకాష్ ని హత్తుకొని .. నా పేరు “లేక్షణ” అని చెప్పి తన పెదవులపై ముద్దులు కురిపిస్తూ తనని లతలా అల్లుకుపోయింది.. !!

***సమాప్తము***
Written by : BOBBY
Place : Nellore.
All Copyrights Reserved Text

Friday, January 10, 2020

SOCOTRA (The Mysterious Island) from Bobby... 34th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

తనని గట్టిగా హత్తుకొని మళ్ళి నేను తిరిగి వస్తాను అని చెప్పి మెరుపువేగంతో అక్కడనుంచి చంద్రిక కొలనులోకి వెళ్తుంది మీననేత్రి.. అప్పటికే ఆ కన్నీరు కొలను మొత్తం విస్తరించి ఆ రెండు మీనాలు కూడా స్పృహ కోల్పోయి పడివున్నాయి.. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అనుకొని ఆ చంద్రిక కొలను అడుగుభాగానా చాలా వేగంగా వృత్తాకారంలో తిరుగుతుంది మీననేత్రి.. 

ఆ వేగానికి చంద్రిక కొలనులో భయంకరమైన సుడిగుండం ఒకటి ఏర్పడుతుంది..


తరువాత ఏంటో చూద్దాం పదండి..
34th Part
కన్నీళ్ళు పంపే యంత్రపు గొలుసు తెగిపోయి తునాతునకలు అయిపోయింది.. ముందుగానే పసిగట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు కొన్ని క్షణాలముందే కొలను నుంచి బయటకు వెళ్ళిపోయారు.. స్వేతవర్ణపు రెండు మీనాలు స్పృహ కోల్పోయి చంద్రిక కొలను చుట్టూ వేగంగా తిరుగుతున్నాయి.. బయట వున్న అందరూ భయపడిపోతూ ఏమిటి ఇదంతా అని ఎవరికివారు ఏదేదో ఊహించుకుంటూ మాట్లాడుకుంటున్నారు..


అంతలో కొలను చుట్టూ ఆ సుడిగుండం అంతకు అంత మరింత పెరిగిపోయి చాలా లోతు వరకు సుడి ప్రస్పుటంగా కనిపిస్తుంది.. అలా కనిపించడం వల్ల .. ఆ కనిపించేంత వరకు చంద్రిక కొలను లోతు ఎంత వుందో ఒక అవగాహన వస్తుంది.. దాదాపుగా పొడవైన ముప్పై తాటి చెట్లు లోతు ప్రస్తుతానికి వున్నట్లు కనిపిస్తుంది.. దానికి కింద ఇంకెంత లోతు ఉంటుందో అని అక్కడివారు అనుకుంటూనే కళ్ళు తిరిగినట్లు అనిపించి దూరంగా వచ్చేస్తారు.. 

ఇక్కడ పెను ప్రమాదమేదో జరగబోతున్నట్లు వుంది.. మనం ఇక్కడ వుండటం మంచిది కాదు అంటూ ఆ బృందంలోని ఒక వ్యక్తి బిగ్గరగా అరుస్తాడు.. అంతలో మరో వ్యక్తి మాట్లాడుతూ .. మరేం పర్వాలేదు.. అన్నిటికీ సిద్దపడే ఇక్కడకు వచ్చాముగా.. ఎన్నో ఏళ్ళ కల ఇది .. ఇప్పుడు చేజారితే ఇక మనకు ఎప్పటికీ సాధ్యం కాదు.. మీరెవ్వరూ భయపడొద్దు.. దీన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అంటూ.. ఆకాష్ ప్రేయసిని ఆ ప్రక్కన పడివున్న కొరడాతో కొట్టడం మొదలు పెట్టాడు.. 

ఎందుకు తనని బాధిస్తున్నారు.. తనేం చేసింది అని ఆకాష్ అడుగుతాడు.. 

తన మెడలో ఏదో తాబేలు హారం ఉందంట కదా.. దాన్ని తీసి మాకు ఇవ్వు లేకపోతే తనని ఇంకా బాధించాల్సి వుంటుంది.. 

నేను తీసి ఇస్తాను తనను బాధించకండి అంటూ వేడుకుంటాడు ఆకాష్.. 

మోకాళ్ళపై భారంగా నడవలేక నడుస్తూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి .. నన్ను క్షమించు.. ఈ హారాన్ని వారికి ఇవ్వాల్సి వస్తోంది.. అంటూ తన మెడలోని హారాన్ని తీయగానే అప్పుడు తన చేతిలో తళుక్కున మెరుస్తుంది ఆ తాబేలు హారం అందరికీ కనిపిస్తూ… 

అది చూచిన వెంటనే ఆ కొరడాతో బాధించిన అతను.. దాన్ని అమాంతం లాక్కుంటాడు ఆకాష్ చేతుల్లోంచి.. ఆ హారాన్ని చంద్రిక కొలనులో విసురుతాడు.. 

ఆ హారాన్ని చూసిన మీననేత్రి భీకర సుడిగుండాన్ని ఆపేస్తుంది.. చేతిలోకి ఆ హారాన్ని తీసుకొని బాధగా అలా ఉండిపోయింది..

త్వరగా.. వెళ్ళండి.. సుడిగుండం ఆగిపోయింది.. వెళ్ళి ఆ స్పృహ కోల్పోయిన రెండు శ్వేత మీనాలను తీసుకురండి.. అంటూ గదమాయిస్తాడు కొరడా చేతబూనిన వ్యక్తి.. 

ఈ మాటలన్నీ వింటున్న మీననేత్రి ఒక్కసారిగా నీళ్ళలోంచి మెరుపువేగంతో పైకి దూసుకొచ్చి పది అడుగుల ఎత్తులో నిల్చుంటుంది.. 

నడుమునుంచి తోక భాగం వరకు శ్వేత వర్ణంతో ధగధగ మెరిసిపోతూ ఎంతో కాంతివంతముగా వుంది.. నడుము పైభాగం నుంచి బంగారు వర్ణంతో స్వర్ణశోభాయమానంగా చాలా అందంగా వుంది.. అందరూ ఆశ్చర్యంతో తనను అలానే చూస్తూ వున్నారు.. తన చేతిలో ఆ రెండు శ్వేత మీనాలు కూడా వున్నాయి.. కోపంతో తన రెండు నేత్రాలు చిక్కటి నీలంరంగులో మెరిసిపోతున్నాయి.. 


అదృష్టం అంటే మనదే.. ఒకదానికోసం వస్తే మరొకరి తారసపడింది.. ఈ మత్స్యక మామూలు మత్స్యక కాదు.. ముందు దాన్ని బంధించండి.. అంటూ అరుస్తాడు కొరడా పట్టుకున్న వ్యక్తి.. 

ఆ మాటలకు మరింత కోపం పెరిగిపోతుంది మీననేత్రి కి.. 

తన నోటితో వృత్తం వంటి వలయాన్ని నీటితో ఏర్పరిచి ఆ కొరడా పట్టుకున్న అతనిపై వేగంగా వదిలింది.. తను ఆ నీటి వృత్తంలో చిక్కుకొని క్షణాల వ్యవధిలోనే వికృత ఆకారానికి మారి ఇదివరకు స్త్రీ లు చనిపోయిన విధంగా తను చనిపోయాడు.. 

మీననేత్రి చేసిన ఆ చర్యను చూసి భయంతో అందరూ తలోదిక్కుకు పరిగెడతారు.. 

అప్పుడే యక్షామీల సమూహం అక్కడకు చేరుకోని పారిపోతున్న అందరినీ చిత్రవధ చేసి బంధించారు.. అఘోరా, యక్షామీ (ఉవిధ) వారందరినీ ఆ నౌకలోనికి ఎక్కించమని యక్షామీలను ఆదేశించారు..!!

అఘోరా ఇద్దరి యక్షామీలకు సైగ చేస్తాడు.. వారు వెళ్ళి లోకేష్ ని జాగ్రత్తగా మోసుకొచ్చి చంద్రిక కొలను దగ్గర పడుకోబెడతారు.. ఇతని మరణం అసందర్భసంభవము.. ఇతనికి ఇంకా ఆయుష్షు వుంది.. నీలో వున్న సప్తధాతువులను ఇతనిలోకి ప్రవేశపెట్టు.. జీవాన్ని ఇతనికి పుణికరించు.. ఇది ధర్మమే.. అనాలోచితముకాదు అని అంటాడు ఆ అఘోరా.. 

మీననేత్రి కాసేపు ఆలోచించి.. ఆకాష్ ప్రేయసి వైపు చూసి తల సరే అన్నట్లుగా ఊపుతుంది..

సప్తధాతువులను తన శక్తిచే చేతుల్లోకి తీసుకొని లోకేష్ నుదిటిపై చేతులను ఉంచుతుంది.. 

తనలో ఎలాంటి కదలిక లేదు.. 

మరోసారి ప్రయత్నించు అంటాడు అఘోరా.. 


అక్కడ వున్న అందరిలో ఒత్తిడి తారాస్థాయికి చేరుకుంది.. ప్రసన్నకుమార్ భాటియా ముఖముపై స్వేద జలము జారుతూ గవుదము దగ్గరకొచ్చి ఒక్కొక్కటిగా నేల రాలుతూ వుంది.. 

మీననేత్రి మరోసారి ప్రయత్నించింది.. మళ్ళి అదే వైఫల్యం ఎదురైంది.. 

అలా మళ్ళి మళ్ళి ప్రయత్నిస్తూనే వుంది.. కానీ లోకేష్ ఎంతకీ కళ్ళు తెరవట్లేదు.. తనలో జీవం ఊపిరి పోసుకోవట్లేదు.. 

ఇక నావల్ల కాదు..

తనలోని జీవ ధాతువులను మేల్కొలిపేందుకు ఆలస్యం అయిందేమో అంటుంది బాధగా మీననేత్రి..


అఘోరాకి కూడా అంతుపట్టక ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు.. 

కాసేపు ఆ ప్రాంతం అంతా నిశబ్దంతో భారంగా మారిపోయింది.. 


To be continued …
Written by : BOBBY

Thursday, January 9, 2020

SOCOTRA (The Mysterious Island) from Bobby... 33rd Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఏదో ఒకటి చెయ్యాలి .. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటూ తనలో తానె అనుకుంటూ తీవ్రమైన ఒత్తిడికి లోనై మదనపడుతూ గట్టిగా కళ్ళు మూసుకుని తలపైకి పెట్టి తన చేతులు రెండూ చాచి అలానే ఉండిపోయింది మీననేత్రి (జలకూన).. 

నా శక్తి ఏంటి? దాన్ని నేనెలా తెలుసుకోవాలి ? 

ఎలా ఎలా ఎలా మార్గం ఎలా అంటూ తనలో తానె పదే పదే అనుకుంటూ వుండగా..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
33rd Part
ఇదివరకు నేను వచ్చినప్పుడు ఆ మీనాల దగ్గరవరకు కూడా రాలేక ఊపిరి తీసుకోవడం కష్టం అయింది.. ఇప్పుడేమో ఆ మీనాలను దాటుకొని మరి ఇంతలోతులో వున్నాను.. అంటే దానర్ధం నా భయమే నన్ను ఆపుతోందన్నమాట అని తనలో తాను అనుకుంటూ .. కిందకు చూసింది.. 

కాలానికి మరో ప్రక్కకు వెళ్ళే మార్గాలు (కాలరంధ్రములు- Black Holes) అవి ఈ చంద్రిక కొలను అడుగుభాగంలో ఉన్నాయన్న విషయం తనకు గుర్తుకు వస్తుంది.. శరవేగంగా ఆ రంద్రాలవైపు వెళ్ళింది మీననేత్రి (జలకూన)..



నల్లని చీకటితో ఊపిరి ఆగేంత ఒత్తిడి తో మెలికవంటి మార్గం కలిగిన దారిలో తన భయాన్ని అధిగమించి తను మెల్లిగా ముందుకు వెళ్తుంది.. కొన్ని నిమిషాలు అలా వెళ్ళగా వెళ్ళగా నీలం వర్ణము గల వెలుగు ఒకటి కనిపించింది.. కళ్ళు పెద్దవి చేస్తూ ఆ నీలం వర్ణము గల వెలుగులోనికి తను ప్రవేశించింది.. అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తూ ఆశ్చర్యం తో అలానే స్తబ్ధముగా ఉండిపోయింది.. 

తనకు కొన్ని గజాల ఎత్తులో .. పదుల సంఖ్యలో సాగర కన్యలు తిరుగుతున్నాయి.. 

నేనే ఆఖరి మత్స్యక అనుకుంటే ఇక్కడేంటి ఇంతమంది వున్నారు ? అని అనుకుంటూ వారి వైపుగా వెళ్ళింది మీననేత్రి (జలకూన).. వారంతా తనవైపే ఆశ్చర్యంగా చూస్తూ తనని ముట్టుకుంటూ మళ్ళి భయంతో వెనక్కు వెళ్తూ వున్నారు..వారందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళగానే ఓ అందమైన మత్స్యక తననే చూస్తూ తన దగ్గరకు రమ్మని పిలుస్తుంది…


సందేహంగా, కాస్త ఇబ్బందిగా తన ముందుకు వెళ్ళి నిల్చుంది .. ఇది కాల రంద్రములలోని ఒక అందమైన అంతర్భాగము.. ఇక్కడకు ఎవ్వరూ రాలేరు.. ఇక్కడ కాలముతో పనిలేదు.. ఎప్పుడూ ఒకేలా వుంటుంది.. నా పేరు శకులి .. మీ అమ్మ ఆత్మాశి నా సోదరీ.. కొన్ని శతాబ్దాల నాటి సంగతి ఒకటి చెప్పాలి నీకు.. అంటూ ఇలా మొదలు పెడుతుంది.. 

మా వంశంలో నేను, మీ తల్లి ఆత్మాశి మాత్రమే మిగిలాము.. ఆ శ్వేత మీనాలకు రక్షణగా నన్ను బాధ్యత తీసుకోమన్నారు.. కానీ నాకు అది ఇష్టం లేదు.. నా జీవితాన్ని నేను ఆనందంగా గడపాలని అనుకున్నాను.. నాకన్నా వయస్సులో చిన్నదైన ఆత్మాశి ఆ కార్యానికి ముందుకు వచ్చింది.. నేను తనని ఎంతో వారించాను.. వాటికి రక్షణగా వుండటం అంటే ఆత్మాహుతి తో సమానమని హెచ్చరించాను.. అయినా నా మాట వినలేదు.. దాన్ని తను ఓ బాధ్యత అనుకుంది.. ఇక నేను అక్కడ నుంచి ఈ కాల రంద్రంలో ప్రయాణించి నా శక్తిచే అందమైన ఈ అంతర్భాగమును ఎర్పరుచుకున్నాను.. ఈ పన్నెండు మంది కన్యలు నా పిల్లలు.. మీ అమ్మ ఆత్మాశి నా మాట విని వుంటే ఇవాళ నువ్వు ఇలా భయంతో, గమ్యమెరుగని ఆలోచనలతో సతమతమవుతూ పిచ్చిదానిలా ఎటు వెళ్ళాలో మార్గాన్ని అన్వేషిస్తూ వుండేదానివి కాదు.. అలానే మీ అమ్మ మరణించేది కూడా కాదు అని అంటుంది శకులి.. 


నా తల్లి మరణాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను.. అలానే తన బాధ్యతను కూడా నేనే తీసుకుంటాను. నిజానికి భయపడేది నేను కాదు.. బాధ్యతను ఆత్మాహుతి అని భయంతో ఇక్కడకు చేరుకున్న మీరే భయపడుతున్నారు.. ఆ రోజు మీకన్నా చిన్నదైన నా తల్లి భయపడలేదు.. ఈరోజు మీ పిల్లల వయస్సు వున్న నేను భయపడలేదు.. అయినా నేను భయపడేది నా మరణం కోసం కాదు.. ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించలేకుంటే ఎందరో అమాయకులు మరణిస్తారు.. సృష్టి తారుమారు అవుతుంది.. ఆ తప్పు నా వల్ల జరగకూడదు అని నిరంతరం భయపడుతున్నాను.. ఆనందంగా వుండటం అంటే దేహాన్ని అందంగా చూసుకోవడం కాదు..హృదయాన్ని జ్యోతిలా వెలిగించడం..అది మరొకరికి ఉపయోగపడేలా జీవించడం .. వెలుగుతున్న జ్యోతి మాత్రమే మరెన్నో జ్యోతులను వెలిగించగలదు .. ఈ సత్యాన్ని మీరు అర్ధం చేసుకోలేకపోవడం నిజంగా మీ మూర్ఖత్వం.. అయినా ఇన్ని శతాబ్దాలనుంచి ఇక్కడ జీవిస్తున్నారు ఏం సాధించారు.. ?? అని అడుగుతుంది మీననేత్రి (జలకూన)..

శకులి కి నోట మాట రాలేదు.. మౌనంగా ఉండిపోయింది.. సరే ఇక ఇక్కడ నుంచి నేను వెళ్ళాలి.. అంటూ వెనక్కు తిరిగి వెళ్తుండగా.. ఒక్క మాట.. అంటూ ఆపుతుంది.. 

నీలో నా సోదరి కనిపించింది.. తను ఇంకా సజీవంగా వుంది నీలో.. 

నీ మాటలు నాకు చాలా చాలా నచ్చాయి.. నీ శక్తిని నీవు తెలుసుకునేందుకు నీకు నేను సాయ పడతాను.. . ఇలా రా అంటూ తన చేయి పట్టి తీసుకెళ్తుంది శకులి.. 

ఓ దట్టమైన చీకటి ప్రదేశానికి తీసుకెళ్ళింది.. 

నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు నమ్మాలి.. అంటూ శకులి తన తోక భాగాన్నిఇలా చూడు అని చూపిస్తుంది.. 

మన బలం, బలహీనత అంతా ఇక్కడే వుంటుంది..ఎంతటి ప్రమాదం ఎదురైనా ఈ తోక భాగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.. మన శక్తులన్నీ దానిలోనే ఉంటాయి .. ఆ తోక భాగాన్ని చూస్తేనే అర్ధం అవుతుంది.. తాను ఎంత శక్తివంతమైనదో.. నీ తోక భాగం నాకన్నా రెండు రెట్లు అధికంగా వుంది..నీ శక్తి ఏంటో ఇక వేరే చెప్పనక్కర్లేదు.. ఈ తోక భాగంలోనే మన శక్తులు ఉంటాయన్న విషయం అత్యంత రహస్యమైనది .. అది నీలోనే వుండాలి.. జాగ్రత్తగా గుర్తుంచుకో .. అంటూ.. ఓ మూడు అడుగులు ఎత్తున నిలబడి కళ్ళకు మిరిమిట్లు గొలిపేంత బంగారు వర్ణంలోకి మారి పోతుంది శకులి.. తన కళ్ళు కూడా నీలం రంగులో మారిపోయి వున్నాయి.. తన తోకనుంచి శరీరమంతా ఒక వెలుగును చిందే పొరలా సృష్టించి నువ్వు ఇలా చెయ్ అంటూ మీననేత్రి (జలకూన)ని ప్రోత్సహిస్తుంది.. తను కొన్ని అడుగులు ఎత్తున లేచి తన తోకను ఆడిస్తూ ప్రయత్నించగానే రెండు మీనాల దగ్గర ప్రకాశించిన తెల్లని వెలుగు కన్నా పదిరెట్లు నవనీతపు వెలుగు ఆ ప్రదేశమంతా విస్తరించింది.. 

నిజంగా అద్బుతం చేసావు.. చంద్రిక కొలను శక్తి మొత్తం నీలోనే ఇమిడి వున్నట్లు వుంది.. మీ అమ్మను మించిపోయావు అంటుంది శకులి.. 

వారికి కాస్త దూరంగా వెళ్తున్న ఓ పెద్ద చేపను శకులి తన శక్తితో చంపేస్తుంది.. దాన్ని అలానే తీసుకొచ్చి దీన్ని బ్రతికించు అంటుంది.. 

మీననేత్రి (జలకూన) ఆశ్చర్యంగా చూస్తూ, అది నేనెలా చెయ్యగలను.. 

నీలో సప్తధాతువులు ఉన్నాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావా ? అని అడుగుతుంది శకులి 

వున్నాయని తెలుసు కానీ నా వల్ల అయ్యే పనేనా.. అంటుంది మీననేత్రి

ముందు నిన్ను నువ్వు నమ్మాలి అని చెప్పాను కదా.. 

సరే నాలోవున్న సప్తధాతువులను నేను ఎలా ప్రేరేపించాలి అంటుంది మీననేత్రి.. 

నీ శక్తిని నీ చేతుల్లోని తెచ్చుకో .. మనసులో బలంగా తన ప్రాణం పొందాలని కోరుకుంటూ దానిపైనే లగ్నంచెయ్యి.. నీ దృష్టిని ఆ చేప పై కేంద్రీకరించు..తరువాత నీ చేతిని దాని తలపై పెట్టు అనగానే .. చెప్పినట్లే చేస్తుంది మీననేత్రి.. ఉలిక్కిపడినట్లుగా ఆ చేప ఒక్కసారిగా కదిలి చాలా వేగంగా వెళ్ళిపోయింది.. నిజానికి ఇలా నేను చెయ్యలేను… నాకు అంత శక్తి లేదు.. నాశనం చెయ్యడం వరకే నా శక్తి ఉండిపోయింది.. కానీ నీది అలా కాదు.. నాశనం అయిన దాన్ని తిరిగి పునరుద్ధరణ చెయ్యగలిగే అతీత శక్తి నీలో వుంది.. నువ్వు చాలా ప్రత్యేకమైనదానివి.. మొట్ట మొదటిసారిగా నీలాంటి మత్స్యకను చూస్తున్నాను అంటుంది శకులి..


నువ్వు శక్తిని ఉపయోగించేటప్పుడు ఒకటి గమనించాను.. నీ తోకభాగం ఉన్నదానికన్నా ఆ సమయంలో చాలా వెడల్పుగా మారుతూ, తగ్గుతుంది.. దాని అర్ధం నువ్వు త్వరగా అలసిపోవు.. వెంటనే తిరిగి శక్తిని పొందుతావు.. ఇలా నీలో ఎన్నో అతీత శక్తులు దాగున్నాయి.. మన పూర్వీకులందరి శక్తులు ఒక్కొక్కటిగా నీకు సంక్రమించినట్లు ఉన్నాయనిపిస్తుంది అంటుంది శకులి.. 

ఇక లే..!! 

త్వరగా వెళ్ళు..

నీ వాళ్ళను..ఆ చంద్రిక కొలనును రక్షించుకో అంటుంది శకులి.. 

తనని గట్టిగా హత్తుకొని మళ్ళి నేను తిరిగి వస్తాను అని చెప్పి మెరుపువేగంతో అక్కడనుంచి చంద్రిక కొలనులోకి వెళ్తుంది మీననేత్రి.. అప్పటికే ఆ కన్నీరు కొలను మొత్తం విస్తరించి ఆ రెండు మీనాలు కూడా స్పృహ కోల్పోయి పడివున్నాయి.. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అనుకొని ఆ చంద్రిక కొలను అడుగుభాగానా చాలా వేగంగా వృత్తాకారంలో తిరుగుతుంది మీననేత్రి.. 

ఆ వేగానికి చంద్రిక కొలనులో భయంకరమైన సుడిగుండం ఒకటి ఏర్పడుతుంది..


To be continued …
Written by : BOBBY

Wednesday, January 8, 2020

SOCOTRA (The Mysterious Island) from Bobby... 32nd Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఈ  ఏడు  ధాతువులను మేము నియంత్రించగలము..కానీ ఎవరికీ తెలియని అత్యంత రహస్యాన్ని ఇప్పుడు మేము నీకు చెప్తున్నాము ఆలకించు అంటాయి ఆ రెండు మీనాలు..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
32nd Part
ఇందాక చెప్పిన ఆ ఏడు ధాతువులు స్వతహాగా నీలోనే వున్నాయి.. ఆ శక్తి నీలోనే ఇమిడీకృతమై వుంది.. 

నువ్వు గమనించావా ?? నీ తల్లి చనిపోయిందని తెలిసినా, నిను పెంచి పెద్ద చేసిన వాసుర నీ కళ్ళముందు మరణించినా నీ కంటినుంచి ఒకే ఒక్క కన్నీటి బిందువు కూడా రాలేదు.. ఆ కన్నీరు నీలో కలిగే భావాలకు బయటకు రావు.. నువ్వు వాటిని అదుపు చెయ్యగలవు.. నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే అవి బయటకు వస్తాయి.. ఈ ప్రపంచాన్ని ముంచేంత శక్తి నీ కన్నీళ్ళకు వుంది.. ఇప్పటికైనా నువ్వేంటో తెలుసుకో .. ఈ సముద్రానికి శక్తివీ నీవే.. అశక్తివీ నీవే ఎటు వెళ్ళాలి అనేది నీ చేతుల్లోనే వుంది .. అంటాయి ఆ రెండు మీనాలు.. !! 


ఆ రెండు మీనాలు చెప్పిన మాటలు విన్నాక తనలో ఎన్నో ప్రకంపనలు మనసులో ఎన్నెన్నో అలజడులు.. 

అలా ఆలోచిస్తూనే మెల్లగా పైకి చేరుకుంది.. 

ఆ అమ్మాయి మరియు పిల్లాడు తనని చూచి ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.. దానికి కారణం ఆ మీననేత్రి (జలకూన) ముఖములో, శరీరంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.. కళ్ళు నీలంగా మారిపోయాయి.. శరీరం వెన్నెలలా పొలుసులు పొలుసులుగా మెరిసిపోతోంది.. తన కేశాలు తనకన్నా చాలా పొడవుగా, వొత్తుగా పెరిగిపోయాయి.. 



ఏమైంది ? ఎందుకిలా అయిపోయావు ? అని అడిగింది ఆ అమ్మాయి.. 

కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది మీననేత్రి.. 

నిన్నే అడిగేది .. ఏం జరిగింది ?? సమాధానం చెప్పు .. అని గదమాయించి అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ముందు ఈ హారం తీసుకో అంటూ ఆ తాబేలు హారాన్ని తన చేతికి ఇచ్చి .. 

నా పేరు మీననేత్రి అంటూ నీళ్ళ లోపల జరిగిన వారి సంభాషణలన్నీ చెప్తుంది… 

మరి నీ శక్తిని నువ్వు గ్రహించడం ఎలా ? అని అడుగుతుంది ఆ అమ్మాయి.. 

అదే నాకు అర్ధం కావట్లేదు అంటుంది మీననేత్రి.. 

నాకు తెలియకుండానే నాలో చాలా మార్పులు వచ్చాయి.. అదేనేమో నా శక్తిని నేను గ్రహించడం అంటే అంటుంది మీననేత్రి.. 

మరి ఇంతకుముందు నీలో కలిగిన అవే భావాలను నువ్వు మళ్ళి గుర్తుచేసుకుని ప్రయత్నించు .. మళ్ళి నీకు ఏమన్నా తెలుస్తాయేమో అంటుంది ఆ అమ్మాయి.. 

అవును మంచి ఆలోచన … అని అనుకునే లోపే దూరంనుంచి సముద్రంలో ఓ పెద్ద నౌక హారన్ వినపడుతూ వుంది.. 


ఆ అమ్మాయి, పిల్లాడు ఆ చంద్రిక కొలను నుంచి దట్టమైన అడవిని దాటుకొని, పరిగెత్తుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్ళి చూడగానే దూరాన సముద్రంలో కన్నీటి బిందువు ఆకారం గల జెండా రెపరెప లాడుతూ పెద్ద నౌక ఒకటి వీరి వైపుగా రావడం గమనిస్తారు ఇద్దరూ .. 

వెంటనే వెనక్కు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయాన్ని మీననేత్రి (జలకూన) కి చెప్పారు.. 

నాకు భయంగా వుంది.. నేను ఏమీ చెయ్యలేను.. దయచేసి నన్ను క్షమించండి అంటూ .. తను నీళ్ళ లోపలకు వెళ్ళిపోయింది.. 

ఆ అమ్మాయికి పిల్లాడికి ఏమి అర్ధం కాక దిగులుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.. 

కాసేపటికి నౌక దగ్గరకు వచ్చిన చప్పుడు వినపడింది.. 

ఆకాశం అంతా ఆ నౌక వదిలిన నల్లని పొగతో కారుమబ్బులా మారిపోయింది.. 


ఇద్దరికీ భయంతో గుండెలు జారిపోయాయి.. ఆ నౌక ఆగినా కూడా పదే పదే ఆ హారన్ మోగిస్తూ వుంది… 

అది వినపడ్డ ప్రతీసారి ఇద్దరూ ఉలిక్కి, ఉలిక్కిపడుతూ వణికిపోతున్నారు.. 

గుండెలను గుప్పిట పెట్టుకొని ఆ చంద్రిక కొలనుకు కాస్త దూరంగా భయం భయంగా పొదలమాటున దాక్కొని వున్నారు.. 

ఆ నౌక ఒక మైలు దూరంలోనే ఆగివుంది..అందులోనుంచి పడవల ద్వారా కొందరు చంద్రిక కొలను దగ్గరకు చేరుకున్నారు.. వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది.. వారి అందరి చేతుల్లో కన్నీటి గాజు సీసాలు వున్నాయి.. ఒక్కొక్కరుగా వెళ్ళి అన్నింటినీ మోసుకొచ్చి ఆ చంద్రిక కొలను చుట్టూ పెడుతున్నారు.. 

ఇంతలో కొందరు విదేశీయులు వచ్చి నిల్చున్నారు.. వారిలో ఆడవారు కూడా ఇద్దరు వున్నారు.. మరో ఇద్దరు డోలీ వంటి పరికరములో ఓ వృద్ధ విదేశీయున్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు.. ఆ వెనుకగానే కొందరు శాస్త్రవేత్తలు, మరికొంతమంది వ్యక్తులు వచ్చారు.. వారి చేతిలో గాజుతో చేసిన డబ్బావంటి పరికరము వుంది.. మరో పడవలో చేతులను వెనుకగా పెట్టి కొందరిని కట్టేసి వున్నారు.. వారందరినీ ఆ కొలను దగ్గరకు తీసుకొచ్చారు.. వారిని చూడగానే ఆ పొదలమాటున దాక్కొని వున్న ఆ అమ్మాయి బిగ్గరగా ఏడుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చింది.. 

వారిలో ఆకాష్, సంతోష్, లు కూడా వున్నారు.. ఆకాష్ కి వీపు భాగాన కొరడా గుర్తులతో దేహం చిట్లి నెత్తురు కారుతూ వుంది.. సంతోష్ కి మాత్రం చిన్న చిన్న గాయాలు కలిగి వున్నాయి.. వెంటనే ఆ అమ్మాయిని కూడా బంధించి చేతులు కట్టేశారు.. 

ఇక మొదలు పెట్టండి అంటూ ఇంగ్లీష్ లో అరుస్తాడు ఆ విదేశీయులలో ఒకరు.. 

ఆ విదేశీయుడు చెప్పి చెప్పగానే బలమైన అయిదుగురు మనుషులు ఒక ఉక్కు యంత్రాన్ని భారంగా నెట్టుకుంటూ వస్తున్నారు.. ఆ యంత్రానికి చాలా పొడవాటి గొలుసు వుంది.. ఆ గొలుసుకు ముందుభాగంలో ఒక మనిషి మునిగేంత పాత్ర వంటి ఆకారం వుంది.. 

ఇద్దరు ఇద్దరుగా వెళ్ళి రెండు వేరు వేరు రకాల కన్నీళ్ళను ఆ పాత్రలో నిండా నింపారు.. మరో ఇద్దరు ఆక్సిజన్ దుస్తులు వేసుకొని చంద్రిక కొలనులో దిగి సిద్దంగా వున్నారు.. తదుపరి ఆ పాత్రలో ఒక రసాయనం వెయ్యగానే అవి చిక్కగా రంగు మారిపోయాయి.... వెంటనే వాటిని ఆ యంత్రం, గొలుసు సాయంతో మెల్లిగా చంద్రిక కొలనులోకి దించుతారు.. ఆ పాత్రతోటి ఆక్సిజన్ దుస్తులు వేసుకున్న యువకులు ఇద్దరూ రెండు మీనాలవైపుగా ఆ పాత్రను తీసుకువెళ్ళారు…!!

ఆ రసాయనం వెయ్యడం మూలంగా కన్నీళ్ళు నీళ్ళలో కలవకుండా కొంతసేపు ఆపేందుకు అది దోహదపదుతుంది.. ఆ మీనాలకు సమీపమునకు చేరుకున్నాక ఆ కన్నీళ్ళు మళ్ళి యధాస్థానానికి వచ్చి మీనాలు వున్న నీటిలో కలిసిపోతాయి.. అవి ఎంత ఎక్కువ కలిస్తే అంతలా ఆ ఆకుపచ్చని వలయం నిర్వీర్యం కాబడి ఆ రెండు మీనాలు బయటకు వచ్చి స్పృహ కోల్పోగలవు.. అప్పుడు వాటిని సునాయాసంగా వీరు బంధించి తమకు అనుగుణంగా మార్చుకోవాలనే పధకం వారిది.. 

ఆ తొట్టి వంటి పాత్ర వేగంగా కిందకు వెళ్తూ వుంది.. మెల్లి మెల్లిగా ఆ చంద్రిక కొలను తన నీలం వర్ణాన్ని కోల్పోతూ వుంది.. 

త్వరగా అంటూ ఆ విదేశీయులు అరుస్తూ వున్నారు.. 

వారి పరిమితి లోతు వరకు ఆ ఇద్దరు యువకులు వెళ్ళి ఆగి చూస్తూ వున్నారు.. ఆ పాత్ర లోని రసాయనం వల్ల వారికి లోపల ఏమి కనిపించకుండా ఆ నీటి అడుగు భాగం మొత్తం లేత ఆకుపచ్చ వర్ణంగా మారిపోయింది.. వారు అనుకున్న కొలతలు ప్రకారం పాత్రను దించి మరో గొలుసు సాయంతో దాన్ని బోర్లించుతారు.. అప్పుడా కన్నీరు మీనాలకు సమీపాన నీళ్ళలో కలిసిపోతుంది.. అలా మొత్తం అన్ని కన్నీళ్ళను వారు ఆ కొలనులో వదిలేసారు.. 

అవి లేత ఆకుపచ్చని ద్రవంలా చిక్కగా మారి కొంచం కొంచంగా ఆ కొలను మొత్తం ఆక్రమిస్తూ వున్నాయి.. 

సముద్రంలోకి వెళ్ళకుండా ఆ మీననేత్రి (జలకూన) నీటి అడుగు భాగాన వుండి పైన జరిగే వీరి చర్యలను భయంతో చూస్తూ వుంది.. తన ప్రాణాలను కాపాడిన ఆ అమ్మాయి ఏడుపును తను వింటూ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో భయంతో వణికిపోతూ వుంది.. 

ఏదో ఒకటి చెయ్యాలి .. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటూ తనలో తానె అనుకుంటూ తీవ్రమైన ఒత్తిడికి లోనై మదనపడుతూ గట్టిగా కళ్ళు మూసుకుని తలపైకి పెట్టి తన చేతులు రెండూ చాచి అలానే ఉండిపోయింది మీననేత్రి (జలకూన).. 

నా శక్తి ఏంటి? దాన్ని నేనెలా తెలుసుకోవాలి ? 

ఎలా ఎలా ఎలా మార్గం ఎలా అంటూ తనలో తానె పదే పదే అనుకుంటూ వుండగా..


To be continued …
Written by : BOBBY

Tuesday, January 7, 2020

SOCOTRA (The Mysterious Island) from Bobby... 31st Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

మీరంతా ఇటు వెళ్ళండి.. నేను వచ్చిన దారిలోనే వెళ్ళి నా తమ్ముడిని తీసుకొని బయటకు వస్తాను అని చెప్తాడు ఆకాష్.. 

అది నువ్వు అనుకున్నంత సులువైన పని కాదు .. వచ్చిన మార్గం చాలా కష్టమైన మార్గం మరలా వెళ్ళడం అనేది బుద్దితక్కువ ప..ని దానివల్ల ప్రాణాలు పోతాయి అంటూ హెచ్చరిస్తుంది ఉవిధ.. 

నా తమ్మునికి నేను మాట ఇచ్చాను .. తిరిగి వస్తాను అని.. వెళ్ళాలి.. ఇప్పటికే ఒకరిని కోల్పోయాను అంటాడు ఆకాష్.. 

తనని వదిలెయ్యమని చెప్పట్లేదు.. మరో మార్గం గుండా వెళ్దాం అని చెప్తున్నాను .. లోకేష్ ని ఇలా భుజాన వేసుకొని ఒంటరిగా నువ్వు ఆ దారిలో వెళ్ళడం అసాధ్యమే కాదు ప్రమాదం కూడా అని వారిస్తుంది ఉవిధ… 

దానికి ఆకాష్ మౌనంగా లోకేష్ ని భుజానికి ఎత్తుకొని వారివెనుకనే నడవడం మొదలు పెట్టాడు..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
31st Part
ఎలాగోలా అందరూ క్షేమంగా బయటకు వెళ్ళి చేరుకుంటారు.. అందరినీ ఆ అఘోరా ఉన్నటువంటి నేలమాళిగకు తీసుకొచ్చారు.. ఆకాష్ కూడా అక్కడకు వచ్చి తన భుజాలపై వున్న లోకేష్ ని కింద పడుకోబెట్టి తను మళ్ళి వెనక్కు వెళ్తుండగా.. 

నేనూ నీతో వస్తాను అంటుంది ఉవిధ.. 

లేదు మీరు ఇక్కడ వుండాలి.. వీరందరికీ ఆహారం అందించి మీరు వీరిని జాగ్రత్తగా చూసుకోండి.. నేను వెళ్ళి నా తమ్ముడను తీసుకొస్తాను అంటూ వెళ్ళాడు ఆకాష్.. 

చాలా వేగంగా వెళ్ళి సంతోష్ ని కలుసుకుంటాడు.. జరిగిన విషయాన్ని సంతోష్ కి వివరిస్తాడు ఆకాష్.. 

తను అక్కడే కుప్పకూలి గుండెలు అలిసేలా ఏడుస్తాడు..

ఆ శబ్దానికి అక్కడ పనిచేసే సిబ్బంది కొందరు వచ్చి ఇద్దరినీ బంధించి ఆ కన్నీళ్ళ గదివద్దకు తీసుకువెళ్ళారు ..

ఆ ప్రక్కన గదిలోనే ప్రసన్నకుమార్ భాటియా, మోహన్ లు దాక్కొని వున్నారు..!!

తరువాత మూడవ బృందమైన అమ్మాయి, జలకూన, నౌకలోని చిన్న పిల్లాడు.. అందరూ కలిసి ఆ చీకటి వేళ జలకూన సాయంతో చంద్రిక కొలను దగ్గరకు చేరుకున్నారు…

అక్కా ఇదేనా అందరూ అంటున్న ఆ చంద్రిక కొలను అంటాడు ఆ పిల్లాడు.. 


అవును ఇదే అని సమాధానమిస్తుంది ఆ అమ్మాయి.. 

మీరు అందరూ చెప్పినదానికన్నా ఈ ప్రదేశం ఎంతో అద్బుతంగా వుంది.. ముఖ్యంగా ఆ నీరు లేత నీలం రంగులో ఇంకా ఇంకా అద్బుతంగా వుంది.. అంటాడు ఆ పిల్లాడు.. 

సరే మీరు మాట్లాడుకుంటూ చుట్టూ గమనిస్తూ వుండండి నేను లోపలకు వెళ్ళి వస్తాను అని చెప్తుంది జలకూన.. 

అలాగే అంటారు ఇద్దరూ.. !

తన తల్లి ఆత్మాశి (మత్స్యక) ప్రాణాలు విడిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ కోపంగా, బాధగా చాలా వేగంగా లోపలకు వెళ్తుంది జలకూన .. లోపలకు వెళ్ళే కొద్ది తనలో ఎన్నో ఆలోచనలు, మరెన్నో భయాలు..మెదుల్తూ.. ప్రళయానికిముందు ఏర్పడే భీకర సముద్ర కెరటాల్లా నిలకడ లేకుండా వుంది తన మానసికస్థితి.. 

లోపలకు వెళ్ళేకొద్దీ తన గుండె భారమైపోతుంది.. ఎందుకిలా నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నాను అని తనలో తానే అనుకుంటూ..ముందుకు కదలసాగింది.. ఈ చంద్రిక కొలను లోని నీరు నాలోని భావాలను, జ్ఞాపకాలను ప్రేరేపిస్తున్నాయి..నాలోని శక్తిని హరిస్తున్నాయి… నా వల్ల కావట్లేదు.. ముందుకు వెళ్ళలేకపోతున్నాను… అని అనుకుంటూ తాను అక్కడే ఆగిపోయింది.. 

కొన్ని క్షణాలు తనలో మౌనం..భయం వల్ల గట్టిగా కళ్ళుమూసుకుంది.. 


అంతా నిశ్శబ్దం ఆవరించిన వేళ తన చేతులు రెండూ చాచి తన తల్లిని తలుచుకుంది..

కొన్ని నిమిషాలు అలానే ఉండిపోయి కళ్ళు తెరిచింది.. తన కళ్ళు నీలం రంగులో మారిపోయాయి.. తనలోకి ఏదో నూతన శక్తి ప్రవహించినట్లు తాను గ్రహిస్తుంది.. తన చేతులు ప్రకాశవంతముగా మెరుస్తున్నాయి..తనలోని ఆలోచనలు, భయాలు అన్నీ తొలగిపోయాయి.. తన కాళ్ళ దగ్గర గల తోక భాగం చాలా దృఢంగా పెద్దదిగా మారింది.. తనని తాను జయించింది.. తానో పరిపూర్ణ మత్స్యకలా మారింది.. ఇక అక్కడ నుంచి శబ్దం కన్నా వేగంగా ఆ రెండు శ్వేత మీనాల వద్దకు వెళ్ళి ధైర్యంగా నిల్చుంది.. చంద్రిక కొలను లోకి రాబోయేముందు ఆ అమ్మాయి దగ్గర తీసుకున్న తాబేలు హారాన్ని ఆ ప్రకాశవంతమైన ఆకుపచ్చని వలయంలో అమర్చగానే తన తల్లి జ్ఞాపకాలు, తన పూర్వీకుల జ్ఞాపకాలు వారి శక్తి, సామర్ధ్యాలు, అన్నీ తనలోకి ప్రవేశించాయి.. తాను ఒక్కసారిగా గగుర్పాటుకు గురై తన్మయత్వంతో కనురెప్పలు రెండూ మూసివేసి కొన్ని క్షణాలు అలానే ఉండిపోతుంది.. తన తల్లి ఎలా చనిపోయిందో, తన పూర్వీకులు ఎలా చనిపోయారో తదితర విషయాలన్నీ తనకు ఓ దృశ్య రూపంగా కనిపిస్తాయి.. అలానే తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను తనకు తెలియజేస్తాయి..!!

ఇక ఆ వలయం లోపలకు వెళ్ళి ఆ శ్వేత మీనాలకు సాదరంగా తన రెండు చేతులను అందిస్తుంది.. తాను చంద్రుని వెలుగులతో ఇంకా ఇంకా ప్రకాశించిపోయింది.. ఆ దృశ్యం చూడటానికి అత్యంత సుందరభరితముగ, మనోరంజనముగా వుంది.. !! 

నిన్ను చూడటం చాలా ఆనందంగా వుంది అన్నట్లు ఆ రెండు మీనాలు తనతో మాట్లాడటం తాను గ్రహిస్తుంది… 

ఆశ్చర్యముగా తాను ఆ రెండు మీనాలనే చూస్తూ ఉండగా.. 


నువ్వు గ్రహించింది నిజమే మేము నీతోనే మాట్లాడుతున్నాము.. నువ్వు మాకు ప్రతిస్పందనగా నీ మనస్సులోని భావాన్ని తలుచుకుంటే చాలు మాకు అర్థమవుతుందని అంటాయి ఆ రెండు మీనాలు.. మన ఈ కరబంధము ద్వారా ముగ్గురి ఆలోచనా విధానము ఏకమౌతుంది.. తద్వారా మనలో ఎవరి మనస్సు అయినా తెరిచిన పుస్తకములా మారుతుందని అంటాయి ఆ రెండు మీనాలు… 

ఇకపోతే నీ తల్లి నీకు కొన్ని విషయాలను చెప్పాలనుకుంది… వాటిని వినే స్థాయి నీకు వచ్చింది... చెప్పే సమయమూ ప్రస్తుతము ఆసన్నమైంది. అంటాయి ఆ రెండు మీనాలు…

నీ తల్లి నీకు ఎంతో ఇష్టంగా పెట్టాలనుకున్న పేరు "మీననేత్రి" …!! 

అంతే కాదు.. తాను నీకు ఎన్నో చెప్పాలనుకుంది..మరెన్నో నేర్పాలనుకుంది .. కానీ తాను ఒకటి తలిస్తే కాలం మరోటి తలచింది.. దాని పర్యవసానమే నువ్వు ఇంత ఆలస్యంగా ఇక్కడకు రావడం.. నీ బాధ్యత ఏంటో ఇప్పుడు నీకు తెలిసింది కదా..

చెప్పు.. ఎవరి ప్రమేయము లేకుండా ఏ బాధ్యత మీద ఇక్కడకు వచ్చావు ? అడుగుతాయి ఆ రెండు మీనాలు.. 

మిమ్మల్ని లోబరుచుకోవడానికి కొందరు ఇక్కడకు వస్తున్నారు.. వారిదగ్గర రెండు జాతుల స్త్రీ ల కన్నీరు కూడా వుంది.. అది కూడా చాలా అధిక మొత్తంలో.. ఆ కన్నీళ్ళు మిమ్మల్ని తాకగానే మీరు వారికి లొంగిపోతారు .. 

మీరు లొంగితే ఈ ప్రపంచపు స్వరూపాలనే మార్చేయ్యగలరు.. దాన్ని మనం ఎలా అయినా ఆపాలి … నాకు సహాయం చెయ్యండి.. అడుగుతుంది మీననేత్రి.. !!

నీ శక్తి ఏంటో నీకు తెలియట్లేదు.. నిన్ను దాటి ఎవరూ రాలేరు.. ముందు నీ శక్తిని నీవు గ్రహించు అంటాయి రెండు మీనాలు.. 

ఈ సముద్రాలను నియంత్రించి వాటిపై ఆదిపత్యం సాధించాలని ఎన్నో శతాబ్దాల నుంచి ఎందరో ప్రయత్నించారు.. ప్రయత్నిస్తూనే వున్నారు.. మీ సంతతి వారే ఆది నుంచి నేటి వరకు మమ్మల్ని సంరక్షిస్తూ వస్తున్నారు.. దానివల్ల మాకు ఎలాంటి చింత లేదు.. ప్రస్తుతం నీవు పరిపూర్ణమైన మత్స్యక లా మారావు.. అంటాయి రెండు మీనాలు.. 

మీ సహాయం కోసం నేను వస్తే.. మీరేమో నన్నే మీ ధైర్యంగా చెప్తున్నారు ఏంటి ? అడుగుతుంది మీననేత్రి.. 

మేమే కాదు సముద్రాన్ని నియంత్రించే శక్తి నీలోను వుంది.. దానివల్లనే ప్రతీ జీవి నీ మాటకు కట్టుబడివుంటుంది.. నువ్వేం చెప్పినా అవి చేస్తాయి.. నీవు సాయం చెయ్యమని పిలిస్తే సముద్రమే నీ వెనుక నిలుస్తుంది.. జీవం ఏర్పడాలంటే ఏడు ధాతువులు చాలా ముఖ్యంగా వుండాలి…అవి 

1. రసము, 
2. రక్తము, 
3. మాంసము, 
4. మేదస్సు, 
5. అస్థి, 
6. మజ్జ,
7. శుక్రము 

ఈ  ఏడు  ధాతువులను మేము నియంత్రించగలము..కానీ ఎవరికీ తెలియని అత్యంత రహస్యాన్ని ఇప్పుడు మేము నీకు చెప్తున్నాము ఆలకించు అంటాయి ఆ రెండు మీనాలు..


To be continued …
Written by : BOBBY