మౌన హత్యలు.. **************
నిన్న మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన ఒక చేదు నిజం నా మనసును తీవ్రంగా గాయపరిచింది. ఒక 18 ఏళ్ల చిరుప్రాయపు అమ్మాయి, కేవలం ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి తాను అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో, ప్రకృతి ధర్మాన్ని (ఋతుక్రమాన్ని) బలవంతంగా ఆపడానికి మెడిసిన్స్ వాడి తన ప్రాణాలు కోల్పోయింది.
ఈ వార్త చదివినప్పటి నుండి నా గుండె భారమైంది. మనం ఎంత ఆధునిక కాలంలో ఉన్నా, పూర్తిగా తెలుసుకోకుండా సగం సగం తెలుసుకున్న మన ఆచారాల పేరిట, పద్ధతుల పేరిట ప్రాణాలను పణంగా పెట్టే స్థితిలో ఉండటం ఎంతో బాధాకరం. ఆ ఆవేదన నుండే, సమాజాన్ని ప్రశ్నించాలని నా కలం నుండి వెలువడిన అక్షర రూపమే ఈ వ్యాసం.
ఇది కేవలం రచన మాత్రమే కాదు, మరెందరో ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటూ చేస్తున్న ఒక ఆర్తనాదం.
ముందుగా ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఒక 18 ఏళ్ల అమ్మాయి తన ఇంట్లో శుభకార్యం ఉందన్న ఉద్దేశంతో, పీరియడ్స్ రాకుండా ఉండటం కోసం ఆమె హార్మోన్ టాబ్లెట్లు వాడింది. కేవలం మూడు రోజులు ఆ టాబ్లెట్లు వాడిన తర్వాత, ఆమె కాళ్లలో విపరీతమైన వాపు మరియు నొప్పి మొదలయ్యాయి. కొద్దిసేపటికే ఆమె కుప్పకూలిపోయి మరణించింది.
తన మరణానికి కారణం ఏమిటి?
వైద్యులు వివరించిన దాని ప్రకారం, ఆ అమ్మాయి మరణానికి కారణం Deep Vein Thrombosis (DVT).
పీరియడ్స్ ఆలస్యం చేయడానికి వాడే హార్మోన్ టాబ్లెట్లలో ప్రొజెస్టిరాన్ లేదా ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టేలా చేస్తాయి.
కాళ్లలోని నరాల్లో రక్తం గడ్డకట్టి, ఆ గడ్డ రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు లేదా మెదడుకు చేరుకున్నప్పుడు (Pulmonary Embolism), ఊపిరి అందక మనిషి తక్షణమే మరణించే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం..
సాధారణంగా ఈ టాబ్లెట్లు అందరికీ ప్రాణాపాయం కలిగించవు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇవి రిస్క్ అవుతాయి డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాపుల్లో నేరుగా కొని వాడటం ఎంతో ప్రమాదకరం. వాటివల్ల వచ్చే సమస్యలు తెలియకుండానే అంతర్లీనంగా రక్తపోటు (High BP) లేదా రక్తం గడ్డకట్టే సమస్యలు ఉండటం. సరైన డోసేజ్ తెలియకపోవడం ముఖ్య కారకాలు.
ఇక పోతే హిందూ ధర్మశాస్త్రాల పరంగా దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాం..
శాస్త్రాల ప్రకారం ఋతుక్రమం సమయంలో పూజలు చేయకూడదు అనడానికి ప్రధానంగా రెండు రకాల కారణాలు కనిపిస్తాయి.
మనుస్మృతి 5వ అధ్యాయం లోనూ, ప్రాచీన గృహ్యసూత్రాలలోనూ రజస్వల స్త్రీ గురించి చెప్పింది ఒకటే
శారీరక స్పర్శ తగ్గించాలి , కొన్ని ఆచారాలలో పాల్గొనకూడదు, యజ్ఞకర్మలకు దూరంగా ఉండాలి
అలానే ప్రాచీన గ్రంథాల్లో చాలాచోట్ల “విశ్రాంతి” భావన వచ్చేలా ఉదాహరించి వున్నారు.
కానీ మనం వీటిని చూడగానే అమ్మో అది తప్పు, మహా పాపం లా అనుకుంటాం. కానీ నిజానికి దీనివెనుక ఉన్న ముఖ్య కారణం శాస్త్రం చెప్పిన ఆచార పరిమితిని సమాజం ఎప్పుడో తప్పుద్రోవ పట్టించింది.
ఆధ్యాత్మిక కోణంలో పూజ లేదా ధ్యానం చేసేటప్పుడు ప్రాణశక్తి 'ఊర్ధ్వముఖంగా' (పైకి) ప్రవహిస్తుంది. కానీ ఋతుక్రమం సమయంలో మహిళా శరీరంలోని ప్రక్రియ 'అధోముఖంగా' (క్రిందికి) ఉంటుంది. ఈ విరుద్ధ ప్రవాహాల వల్ల మహిళా ఆరోగ్యానికి, గర్భాశయ శక్తికి విఘాతం కలుగుతుందని శాస్త్రం చెప్పింది. ఇదే నిజం..
అలాగే పూర్వ కాలంలో గృహిణులు శారీరకంగా చాలా కష్టపడేవారు. బావుల నుండి నీళ్లు తోడటం, రాతి బండల్లో దంచడం వంటి ఎన్నో కఠినమైన శారీరక పనులు ఉండేవి. కనీసం ఆ మూడు రోజులు అయినా ఆ మహిళకు పూర్తి విశ్రాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతో 'మడి' అనే పేరుతో పక్కన కూర్చోబెట్టేవారు.
రానురాను సమాజం దాన్ని ఎలా మార్చింది అంటే.. ఆమెకు విశ్రాంతి, గౌరవం ఇవ్వాల్సిన చోట అవమానించడం, అంటరానితనం లా మార్చేసారు.. ధర్మం అంటే జీవన సమతుల్యత. ప్రకృతిని అర్థం చేసుకోవడం. ఒక సహజ జీవ ప్రక్రియను “అపవిత్రం” అని చెప్పే ఈ సమాజం పైకి చెప్పలేని భయం మరియు అజ్ఞానంతో బ్రతుకుతోంది.
ఆడవారే కాదు.. దీనికి ముఖ్య కారకులు మగవారు కూడా..
తల్లిని గౌరవించని పూజలెందుకు?
శుభకార్యం లో నువ్వు పక్కన కూర్చోకపోతే ఇల్లు అపవిత్రం అవుతుంది. అని ఆమె నరనరాల్లోకి ఎక్కించి ఈ సమాజం చేసిన చేస్తున్న ఎవరికీ తెలియని మౌన హత్యలు ఇవి.
చివరగా ఒక్క మాట.. ముహూర్తాలు మళ్లీ వస్తాయి…కానీ పోయినవారు తిరిగి రారు. దయచేసి మీ ఇంట్లో వారిని ఇలా శుభకార్యాల పేరుతో వారిని బలి చెయ్యకండి.
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==









