హిమ శిఖరాల్లో నా ఆత్మాన్వేషణ (2వ భాగం) *********************************వారణాసిలో అడుగుపెట్టిన ఆ మొదటి రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అప్పటికే ఎన్నో ప్రదేశాలు తిరగడం వల్లనో లేక దారులు దాటిన అలసటో తెలియదు కానీ , నా ఫోన్ అక్కడికి వచ్చేసరికి డెడ్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేయించుకోవడానికి దేవస్థానానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ షాపుకి వెళ్లి ఫోన్ ఇచ్చి, తిరిగి మా రూమ్కి ఆటోలో వస్తున్నాను. అప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన ఆ నగరాన్ని నేను ఎలా చూడబోతున్నానో ముందుగానే చెప్పినట్లుగా అనిపించింది. ఆటోలో ప్రయాణికులు కూర్చునే వెనకనున్న ఖాళీ ప్రదేశంలో ఓ రెండు మృతదేహాలను ఎత్తి పెట్టారు. తెల్లటి వస్త్రాలతో పూర్తిగా చుట్టి ఉండటంవల్ల అవి శవాలే అన్న సంగతి తప్ప ఇంకేమీ ఆనవాళ్ళు కనిపించలేదు. నాతో వచ్చిన వ్యక్తి మాత్రం దాన్ని చాలా ఇబ్బందికరంగా భావించాడు. కానీ నాకేమో ఆశ్చర్యంకంటే జిజ్ఞాస ఎక్కువగా కలిగింది. వాళ్లు ఎవరై ఉంటారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆడా? లేక మగా? ఎలా చనిపోయారు? వాళ్ల జీవితాల్లో ఏమి జరిగి చివరికి ఈ కాశీ గర్భంలోకి చేరుకున్నారు? అన్న ప్రశ్నలే నాలో తిరిగాయి. మాతోపాటే ప్రయాణిస్తున్న మిగతావాళ్లు వారిని మృతదేహాల్లా కాకుండా, ఏవో కొన్ని కూరగాయల బస్తాల్లా చాలా సాధారణంగా చూసారు. అప్పుడు నాకు అనిపించింది. వారణాసిలో మరణం, మృతదేహం కూడా అక్కడివారి సాధారణ జీవితంలో ఎంతగా భాగమైందో అని.
ఆ ఒక్క సంఘటనతోనే ఆ నగరం నా కళ్లకి మరో కోణంలో కనిపించింది. నేను కాశీకి వెళ్లింది దేవాలయ దర్శనం కోసం, గంగాస్నానం కోసం, విశ్వనాథుని కటాక్షం కోసం అనుకున్న నా ఆలోచనలన్నిటినీ పూర్తిగా మార్చేసింది. ఇది మామూలు నగరం కాదు.. కాలం ఒడిసిపట్టుకున్న ఒక ప్రాచీన శ్వాస. ఇరుకు దారులు, గోడలమీద పేరుకున్న పాతదనం, ఒక్కసారిగా చెవుల్లో పడే దేవాలయ గంటలు, మధ్యలో గోవులు, పూల దుకాణాలు, చందనం వాసన, కచోరీల వాసన, ఎక్కడో దూరంగా వినిపించే సంస్కృత శ్లోకాల మృదుస్వరాలు ఇవన్నీ కలిపి ఆ నగరాన్ని ఒక శ్వాసిస్తున్న ప్రాణంలా చూపించాయి. నా కాళ్లు నేల మీద నడుస్తున్నా, మనసు మాత్రం ఏదో కనిపించని కాలపుటల్లో తిరుగుతున్నట్టుండేది. కాశీలో ప్రతి మూల ఒక కథ చెబుతుంది. ప్రతి గల్లీ ఒక ఆరంభానికి స్వాగతిస్తుంది. ప్రతి గుమ్మం వెనక ఏదో ఒక జపం, ఏదో ఒక నిరీక్షణ, ఏదో ఒక వేదన, ఏదో ఒక విముక్తి దాగి ఉంటుంది.
అక్కడ ఉన్నన్నిరోజులలో నేను ఎక్కువగా గంగనే చూస్తూ గడిపాను. పగలు గంగా ఒకలా కనిపిస్తుంది. కానీ హారతి అయ్యాక రాత్రి గంగా మరోలా మారిపోతుంది. పగలు ఆమె ఒక మహా ప్రవాహంలా ఉంటుంది.. కాలం తన పాదాలు కడుక్కుంటున్నట్టు. రాత్రి చంద్రకాంతి పడినప్పుడు మాత్రం గంగ నెలవంక కరిగి జలరూపం దాల్చినట్టుంటుంది. నీటిమీద పడే ఆ వెండి తళుకులు, నెమ్మదిగా కదిలే పడవలు, ఘాట్ మెట్లమీద కూర్చున్న యాత్రికులు, అప్పుడప్పుడూ గాలి తాకి కదిలే దీపాల మంటలు ఇవన్నీ చూస్తుంటే ఆ నది కేవలం జలం మాత్రమే కాదని, జ్ఞాపకాలు, ప్రార్థన, దుఃఖం, విముక్తి అన్నింటినీ ఓపిగ్గా మోసే ఒక మహాశక్తి అని అనిపించేది.
మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ల దగ్గర గడిపిన క్షణాలు అయితే చాలానే ఉన్నాయి.. మొదటిసారి అక్కడి చితిమంటలను చూస్తే గుండె ఒక విచిత్రమైన బరువుని మోస్తుంది. కానీ కొద్దిసేపటికి ఆ మంటలు భయంగా కాకుండా సత్యంగా కనిపించటం మొదలవుతాయి. మనం దూరంగా ఉంచుకోవాలనుకునే మరణం అక్కడ బహిరంగంగా చందన కట్టెల క్రింద రగులుతూ బ్రతుకుతుంది. చనిపోయిన వారి దేహాలు తీసుకొస్తారు. పేర్లు, బంధాలు, కీర్తి, సంపాదన అన్నీ అక్కడికి వచ్చేసరికి ఒక తెల్లటి వస్త్రంలో ముడుచుకుపోతాయి. తరువాత అగ్నిలో కలిసి బూడిదైపోతాయి. మనం జీవితమంతా పట్టుకున్న చాలా విషయాలు నిజానికి మాయ గాలిగోపురాలే. చివరికి మిగిలేది మనం చేసిన సాధన, మోసిన భావం, పలికిన ప్రార్థన మాత్రమే. ఆ చితిమంటల ముందు నిలబడి ఉంటే మనిషి తన అసలు పరిమాణం తెలుస్తుంది. ఎంతటి అహంకారమున్నా, ఎంతటి ఆశలున్నా, ఎంతటి బాధలున్నా, ఆ చితి మంట ముందు అన్నీ ఒకే రంగులో కరిగిపోతాయి.
కాశీలో నా కళ్ళు పదే పదే వెతికింది నిజమైన అఘోరాలతో కాసేపైనా మాట్లాడాలని.. నిజమైన అని ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా అనాల్సి వచ్చిందో చెప్తాను.. అక్కడ అఘోరాలమని డబ్బులకోసం చెప్పుకొని తిరిగేవారు చాలా ఎక్కువ. అందుచేత సరైన వారిని కనుగొనడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు.. వారు మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ లో చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తారు. కనిపించినా ఎవరితోనూ మాట్లాడరు .. స్నానమాచరించి నేరుగా వెళ్ళిపోతారు. నాకేమో హిందీ అంతగా రాకపాయే.. అందుకే మా బృందంలోని హిందీ బాగా తెలిసిన ఒక అతని సాయంతో అక్కడి స్థానికులైన కొందరిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. వారు చెప్పిన సమయాల్లో నిద్ర మానుకొని మరీ వెతికాను. అప్పటికే అయిదు రోజులు మెల్లిగా గడిచిపోయాయి.
అది ఏడవ రోజు అనుకుంటా... ఆ రోజు సాయంత్రం ఎందుకో వారణాసి నా కంటికి కొత్తగా కనిపించింది. గంగాహారతి ప్రారంభమయ్యే సమయానికి ఆ నగరం మీద ఒక గమ్మత్తైన అందం కమ్ముకుంది. క్రమంగా వెలుతురు తగ్గిపోతుంది. ఘాట్ మీద జనమంతా చేరిపోయారు. గంగ ఒడ్డున దీపాలు సిద్ధమవుతున్నాయి. దూరంగా గంటలు వినిపిస్తున్నాయి.. ఆ తర్వాత గంగాహారతి మొదలవుతుంది. దాన్ని కేవలం కళ్ళతో చూడడం అనే మాటతో సరిపెట్టడం చాలా చిన్నదనిపిస్తుంది. అది ఒక మహానాదం. ఒక మహా క్రమం. ఒక మహా సమర్పణ. పూజారులు ఒకే లయలో దీపాల్ని పైకెత్తినప్పుడు, మంట గాల్లో వలయాల్లా తిరిగినప్పుడు, శంఖం ఒక్కసారిగా మార్మోగినప్పుడు, గంగ మీద ఆ వెలుగు ప్రతిబింబించినప్పుడు... ఆ క్షణంలో మానవుని ప్రార్థన అగ్నిరూపం దాల్చి జలానికి సమర్పించబడుతున్నట్టనిపించింది. అక్కడి జనసందోహం కూడా ఆ క్షణం నిశ్శబ్దంగా అనిపిస్తుంది.. అందరూ ఒకే ఊపిరిగా, ఒకే చూపుగా, ఒకే వినికిడిగా మారిపోతారు. నాకు ఆ గంగాహారతి కేవలం ఒక వైభవ కర్మకాండలా అనిపించలేదు. అది మనిషి తన లోపల మిగిలి ఉన్న నమ్మకాన్ని వెలుగుగా మార్చి సమర్పించే క్షణంలా అనిపించింది.
ఆ రోజు గంగాహారతిని నేను నదిమీద పడవలో నుంచే చూసాను. అందుకేనేమో ఆ సాయంత్రం నాకు మరింత కొత్తగా, మరింత అందంగా కనిపించింది. గంగ మీద ఆ వెలుగుల చలనాలు, నీటిమీద దీపాల ప్రతిబింబాలు, ఆకాశం మసక నీలిరంగులోకి జారిపోయిన తీరు, ఇవన్నీ కలిపి ఆ సంధ్యను ఒక వింత పారవశ్యంగా మార్చేశాయి. హారతి అయిపోయాక కూడా నా మనసు చాలా సేపు ఆ వెలుగుల మధ్యే ఎక్కడో నిలిచిపోయినట్టుండిపోయింది. పడవ నెమ్మదిగా కదులుతోంది. ఘాట్ మీద జనాలు కదలిక క్రమంగా తగ్గుతోంది. గంగ మాత్రం తన మౌన ప్రవాహంలో మళ్ళి ముందుకు సాగుతోంది.
అప్పుడే నా చూపు నది అవతలి ఒడ్డువైపు మళ్ళింది. గంగానది ఆవల, చీకటి ముసురుకుంటున్న ఇసుక మడుగుల దగ్గర, దూరంగా పద్మాసనంగా కూర్చున్న కొన్ని నీడల్లా ఏవో కనిపించాయి. మొదట అవి సాధారణ మనుషులా అనిపించలేదు. మసక చీకటి, మంటలేని వెలుగు, దూరపు నిశ్శబ్దం ఇవన్నీ కలిసి ఆ ఆకృతులను మరింత రహస్యంగా చూపించాయి. కాస్త జాగ్రత్తగా చూసినపుడు అవి అఘోరాలే అని నాకు అర్థమైంది. గంగా ఈ వైపున గోల, ఘంటానాదం, హారతి, భక్తుల సందడి.. ఆ వైపున మాత్రం చీకటి, నిశ్చలత, బూడిద రంగు మౌనం. నాకు ఒక్కసారిగా అనిపించింది. వారణాసి తన రెండు ముఖాల్ని ఈ రోజు ఒకే సాయంత్రంలో నా ముందుంచుతోంది. ఒకటి వెలుగులో పూజించబడే కాశీ, మరొకటి చీకటిలో ధ్యానించే కాశీ అని అనుకున్నాను.
నాకు వారివద్దకు వెళ్లాలి అనిపించింది. ఎన్నో ఏళ్ళ జిజ్ఞాసా కావచ్చు. మరణానికీ, శ్మశానానికీ, బూడిదకీ, మౌనానికీ అంత దగ్గరగా బ్రతికే మనుషులను దగ్గరగా చూడాలనే బలమైన కోరిక కావచ్చు. లేక కాశీ ఆ రోజు నన్ను అక్కడికే తీసుకెళ్లాలనుకుందేమో. నాతోపాటే వచ్చిన నా బృందంలోని హిందీ తెలిసిన వ్యక్తికి చెప్పాను పడవను నడిపిస్తున్న వ్యక్తిని వాళ్ల దగ్గరకు తీసుకెళ్లమని. మొదట ఆ పడవ నడిపే అతను వెంటనే లేదండి అన్నట్టుగా తలూపాడు. అతని ముఖంలో అసహజ సంకోచం కనిపించింది. బహుశా అతనికి అది ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లాలి? అన్న భావన ఉండొచ్చు. మళ్లీ చెప్పాను. అతను మళ్లీ నిరాకరించాడు. కొద్దిసేపు నేను కూడా మౌనంగా ఉన్నాను. వాళ్లు ఎలా ఉంటారు? తెలుసుకోవాలి... ఏమి ఆలోచిస్తారు? ఈ చీకటిలో గంగ అవతల ఎందుకు కూర్చుంటారు? ఒకసారి దగ్గరగా చూడాలి అన్నట్టుగా. నా మాటల్లోని earnestness అతనికి అర్థమైందో ఏమో, మొదట్లో మొక్కుబడిగా కనిపించినా, చివరికి సరేనన్నట్టు పడవను ఆ వైపుకు మళ్లించాడు.
నాతోపాటు వచ్చిన ఆ వ్యక్తి కూడా దిగాడు. పడవ ఇసుక మడుగుకి దగ్గరగా ఆగినప్పుడు ఒక వింత నిశ్శబ్దం మమ్మల్ని చుట్టుకుంది. ఈ వైపు కాశీ ఘాట్లలో ఇంకా కొద్దిగా గంటల ప్రతిధ్వని వినిపిస్తూనే ఉంది. కానీ ఇక్కడికి రాగానే ఆ శబ్దం కూడా చాలా దూరంగా మిగిలిపోయినట్టనిపించింది. ఇసుక మీద కాలు పెట్టగానే గంగ చల్లదనం పాదాలకే కాదు, మనసుకి కూడా తాకినట్టనిపించింది. మేము నెమ్మదిగా వారి వైపు నడిచాం.
దగ్గరకి వెళ్లినప్పుడు వాళ్లు స్పష్టంగా కనిపించారు. బూడిద రాసుకున్న శరీరాలు, చిక్కుకున్న జటాలు, గంగవైపు చూస్తూ మౌనంగా కూర్చున్న దేహాలు, పక్కనే ఒక చిన్న దీపం మసక వెలుతురు. ఆ వెలుతురు వాళ్ల ముఖాలను పూర్తిగా చూపించలేదు; కానీ వాళ్ల కళ్లలోని నిశ్చలత మాత్రం నాకు స్పష్టంగా కనిపించింది. మేము దగ్గరికి వచ్చామనే విషయం వాళ్లకు ముందే తెలిసినట్టుంది. ఒకరు మెల్లగా తలెత్తి మమ్మల్ని చూశాడు. ఆ చూపులో ఆశ్చర్యం లేదు. కోపం లేదు. ఆహ్వానం లేదు. నిరాకరణ కూడా లేదు. అది ఒక విచిత్రమైన సమ్మతి వచ్చావా? సరే, మమ్ము చూడు అన్నట్టు అనిపించింది.
మేము దగ్గరగా వెళ్లి నమస్కరించాము. నాతో వచ్చిన వ్యక్తి హిందీలో వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట వారు మౌనంగా వున్నారు.. చాలాసేపటి తరువాత వారిలో ఒకరు బయటివాళ్లా? అని అడిగారు. అతని స్వరం మృదువుగా లేదు, కానీ ఖటినంగా అయితే ఉంది. మేము దక్షిణం నుంచి వచ్చామని చెప్పాము. కాశీ దర్శనానికి వచ్చామని, గంగాహారతి చూసి తిరుగుతుండగా మిమ్మల్ని చూసి కలవాలని అనిపించిందని చెప్పాము. వారు మళ్లీ పరస్పరం ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో మాటలకందని ఏదో తత్త్వం దాగి ఉంది. తర్వాత వారిలో వయసులో పెద్దగా కనిపించిన ఒక అఘోరి కాస్త కదిలి కూర్చున్నాడు. మమ్మల్ని కూడా కూర్చోమన్నట్టుగా చేతితో సంకేతం చేశాడు.
ఇసుక మీద వాళ్లకు ఎదురుగా కూర్చున్న ఆ క్షణం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను ఎవరి ముందున్నాను? సమాజం భయపడే ఈ మనుషుల ముందా? లేక మనం దూరంగా ఉంచుకునే ఒక సత్యం ముందా? నా మనసులో ఎన్నో ప్రశ్నలు ఒక్కసారిగా కదిలాయి.
మొదట నేను వాళ్లని అడిగింది చాలా సాధారణమైన ప్రశ్నే మీరు ఇక్కడ ఇలా ఎందుకు కూర్చుంటారు?
అది హిందీలో మా వ్యక్తి అడిగాడు. వారు జవాబు చెప్పడానికి తొందరపడలేదు. కొద్దిసేపు గంగ ప్రవాహం వైపు చూస్తూనే ఉన్నారు. తర్వాత వారిలో పెద్దవారు అయినా ఒకరు అన్నారు ... అక్కడ అంటూ ఘాట్ల వైపు చూపిస్తూ, జనం దేవుణ్ని వెలుగులో వెతుకుతారు. మేము ఇక్కడ చీకటిలోనే చూస్తాము.
ఆ మాట విన్న క్షణం నాలో తెలియని మౌనం. గంగాహారతి చూసి వచ్చిన వెంటనే ఆ వాక్యం వినడం నాకు ఒక అంతర్గత భావనలా అనిపించింది. నిజమే కదా.. ఘాట్లపైనేమో వెలుగులు, శంఖనాదం, పూజ, అలంకారం. ఇక్కడేమో చీకటి, ఇసుక, బూడిద, మౌనం. కానీ రెండు విభిన్నమైన మనుషులు వెతుకుతున్నది మాత్రం ఒకటే సత్యాన్ని.
అఘోరాలతో గడిపిన ఆ కొన్ని గంటలు నాకు ఎప్పటికీ మరచిపోలేని అనుభవాలు. వారిని గురించి చాలా కథలు విన్నాను. భయం కలిగించేలా విన్నాను. విచిత్రంగా విన్నాను. కానీ దగ్గరగా చూసినపుడు నాకు వాళ్లలో మొదట కనిపించింది భయం కాదు నిర్లిప్తత. మనం దూరం పెట్టే మరణాన్ని వాళ్లు దగ్గరగా కౌగిలించుకుంటారు. మనం అపశకునంగా చూసే బూడిదను వాళ్లు పుణ్యరేఖగా మోస్తారు. మనం వదలలేని మాయలన్నింటినీ వాళ్లు ముందుగానే దహనం చేసేసినట్టుంటారు. వారిలో ఒకరు నాకు చెప్పిన ఓ మాట ఇప్పటికీ ఎప్పటికీ మిగిలిపోయింది. “మనిషి మరణాన్ని కాదు, తనదనుకున్నదాన్ని వదులుకోవడానికే ఎక్కువగా భయపడతాడని” ఆ మాట వారణాసి మొత్తాన్ని ఒక్క వాక్యంలో నాకు చెప్పినట్లు అనిపించింది. ఆ క్షణమే నాకు ఒకటి అర్థమైంది. అఘోరాలు శ్మశానంలో ఉండటం వింతకాదు. మనం మరణసత్యం నుంచి పారిపోతూ బ్రతుకుతాం కాబట్టి వాళ్ళను మనం వింతగా భావిస్తాము అని.
To be Continued… మరి మీ జీవితంలో మిమ్మల్ని ఆలోచింపజేసిన మరణ సత్యం ఏది? మీకు ఇష్టమైతే పంచుకోండి.. ~~ త్రిశూల్ ~~Written by: Bobby AniboyinaEmail: baburajendhra@gmail.comBlog: http://bobbynani.blogspot.com/Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==#KashiDiaries #teluguwriterscommunity #teluguwriters #spiritualjourneyfb.com/stars