Monday, April 6, 2026

హిమ శిఖరాల్లో నా ఆత్మాన్వేషణ (2వ భాగం) ....


 హిమ శిఖరాల్లో నా ఆత్మాన్వేషణ (2వ భాగం)

*********************************
వారణాసిలో అడుగుపెట్టిన ఆ మొదటి రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అప్పటికే ఎన్నో ప్రదేశాలు తిరగడం వల్లనో లేక దారులు దాటిన అలసటో తెలియదు కానీ , నా ఫోన్ అక్కడికి వచ్చేసరికి డెడ్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేయించుకోవడానికి దేవస్థానానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ షాపుకి వెళ్లి ఫోన్ ఇచ్చి, తిరిగి మా రూమ్‌కి ఆటోలో వస్తున్నాను. అప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన ఆ నగరాన్ని నేను ఎలా చూడబోతున్నానో ముందుగానే చెప్పినట్లుగా అనిపించింది. ఆటోలో ప్రయాణికులు కూర్చునే వెనకనున్న ఖాళీ ప్రదేశంలో ఓ రెండు మృతదేహాలను ఎత్తి పెట్టారు. తెల్లటి వస్త్రాలతో పూర్తిగా చుట్టి ఉండటంవల్ల అవి శవాలే అన్న సంగతి తప్ప ఇంకేమీ ఆనవాళ్ళు కనిపించలేదు. నాతో వచ్చిన వ్యక్తి మాత్రం దాన్ని చాలా ఇబ్బందికరంగా భావించాడు. కానీ నాకేమో ఆశ్చర్యంకంటే జిజ్ఞాస ఎక్కువగా కలిగింది. వాళ్లు ఎవరై ఉంటారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆడా? లేక మగా? ఎలా చనిపోయారు? వాళ్ల జీవితాల్లో ఏమి జరిగి చివరికి ఈ కాశీ గర్భంలోకి చేరుకున్నారు? అన్న ప్రశ్నలే నాలో తిరిగాయి. మాతోపాటే ప్రయాణిస్తున్న మిగతావాళ్లు వారిని మృతదేహాల్లా కాకుండా, ఏవో కొన్ని కూరగాయల బస్తాల్లా చాలా సాధారణంగా చూసారు. అప్పుడు నాకు అనిపించింది. వారణాసిలో మరణం, మృతదేహం కూడా అక్కడివారి సాధారణ జీవితంలో ఎంతగా భాగమైందో అని.

ఆ ఒక్క సంఘటనతోనే ఆ నగరం నా కళ్లకి మరో కోణంలో కనిపించింది. నేను కాశీకి వెళ్లింది దేవాలయ దర్శనం కోసం, గంగాస్నానం కోసం, విశ్వనాథుని కటాక్షం కోసం అనుకున్న నా ఆలోచనలన్నిటినీ పూర్తిగా మార్చేసింది. ఇది మామూలు నగరం కాదు.. కాలం ఒడిసిపట్టుకున్న ఒక ప్రాచీన శ్వాస. ఇరుకు దారులు, గోడలమీద పేరుకున్న పాతదనం, ఒక్కసారిగా చెవుల్లో పడే దేవాలయ గంటలు, మధ్యలో గోవులు, పూల దుకాణాలు, చందనం వాసన, కచోరీల వాసన, ఎక్కడో దూరంగా వినిపించే సంస్కృత శ్లోకాల మృదుస్వరాలు ఇవన్నీ కలిపి ఆ నగరాన్ని ఒక శ్వాసిస్తున్న ప్రాణంలా చూపించాయి. నా కాళ్లు నేల మీద నడుస్తున్నా, మనసు మాత్రం ఏదో కనిపించని కాలపుటల్లో తిరుగుతున్నట్టుండేది. కాశీలో ప్రతి మూల ఒక కథ చెబుతుంది. ప్రతి గల్లీ ఒక ఆరంభానికి స్వాగతిస్తుంది. ప్రతి గుమ్మం వెనక ఏదో ఒక జపం, ఏదో ఒక నిరీక్షణ, ఏదో ఒక వేదన, ఏదో ఒక విముక్తి దాగి ఉంటుంది.
అక్కడ ఉన్నన్నిరోజులలో నేను ఎక్కువగా గంగనే చూస్తూ గడిపాను. పగలు గంగా ఒకలా కనిపిస్తుంది. కానీ హారతి అయ్యాక రాత్రి గంగా మరోలా మారిపోతుంది. పగలు ఆమె ఒక మహా ప్రవాహంలా ఉంటుంది.. కాలం తన పాదాలు కడుక్కుంటున్నట్టు. రాత్రి చంద్రకాంతి పడినప్పుడు మాత్రం గంగ నెలవంక కరిగి జలరూపం దాల్చినట్టుంటుంది. నీటిమీద పడే ఆ వెండి తళుకులు, నెమ్మదిగా కదిలే పడవలు, ఘాట్‌ మెట్లమీద కూర్చున్న యాత్రికులు, అప్పుడప్పుడూ గాలి తాకి కదిలే దీపాల మంటలు ఇవన్నీ చూస్తుంటే ఆ నది కేవలం జలం మాత్రమే కాదని, జ్ఞాపకాలు, ప్రార్థన, దుఃఖం, విముక్తి అన్నింటినీ ఓపిగ్గా మోసే ఒక మహాశక్తి అని అనిపించేది.

మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్‌ల దగ్గర గడిపిన క్షణాలు అయితే చాలానే ఉన్నాయి.. మొదటిసారి అక్కడి చితిమంటలను చూస్తే గుండె ఒక విచిత్రమైన బరువుని మోస్తుంది. కానీ కొద్దిసేపటికి ఆ మంటలు భయంగా కాకుండా సత్యంగా కనిపించటం మొదలవుతాయి. మనం దూరంగా ఉంచుకోవాలనుకునే మరణం అక్కడ బహిరంగంగా చందన కట్టెల క్రింద రగులుతూ బ్రతుకుతుంది. చనిపోయిన వారి దేహాలు తీసుకొస్తారు. పేర్లు, బంధాలు, కీర్తి, సంపాదన అన్నీ అక్కడికి వచ్చేసరికి ఒక తెల్లటి వస్త్రంలో ముడుచుకుపోతాయి. తరువాత అగ్నిలో కలిసి బూడిదైపోతాయి. మనం జీవితమంతా పట్టుకున్న చాలా విషయాలు నిజానికి మాయ గాలిగోపురాలే. చివరికి మిగిలేది మనం చేసిన సాధన, మోసిన భావం, పలికిన ప్రార్థన మాత్రమే. ఆ చితిమంటల ముందు నిలబడి ఉంటే మనిషి తన అసలు పరిమాణం తెలుస్తుంది. ఎంతటి అహంకారమున్నా, ఎంతటి ఆశలున్నా, ఎంతటి బాధలున్నా, ఆ చితి మంట ముందు అన్నీ ఒకే రంగులో కరిగిపోతాయి.

కాశీలో నా కళ్ళు పదే పదే వెతికింది నిజమైన అఘోరాలతో కాసేపైనా మాట్లాడాలని.. నిజమైన అని ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా అనాల్సి వచ్చిందో చెప్తాను.. అక్కడ అఘోరాలమని డబ్బులకోసం చెప్పుకొని తిరిగేవారు చాలా ఎక్కువ. అందుచేత సరైన వారిని కనుగొనడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు.. వారు మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ లో చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తారు. కనిపించినా ఎవరితోనూ మాట్లాడరు .. స్నానమాచరించి నేరుగా వెళ్ళిపోతారు. నాకేమో హిందీ అంతగా రాకపాయే.. అందుకే మా బృందంలోని హిందీ బాగా తెలిసిన ఒక అతని సాయంతో అక్కడి స్థానికులైన కొందరిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. వారు చెప్పిన సమయాల్లో నిద్ర మానుకొని మరీ వెతికాను. అప్పటికే అయిదు రోజులు మెల్లిగా గడిచిపోయాయి.

అది ఏడవ రోజు అనుకుంటా... ఆ రోజు సాయంత్రం ఎందుకో వారణాసి నా కంటికి కొత్తగా కనిపించింది. గంగాహారతి ప్రారంభమయ్యే సమయానికి ఆ నగరం మీద ఒక గమ్మత్తైన అందం కమ్ముకుంది. క్రమంగా వెలుతురు తగ్గిపోతుంది. ఘాట్ మీద జనమంతా చేరిపోయారు. గంగ ఒడ్డున దీపాలు సిద్ధమవుతున్నాయి. దూరంగా గంటలు వినిపిస్తున్నాయి.. ఆ తర్వాత గంగాహారతి మొదలవుతుంది. దాన్ని కేవలం కళ్ళతో చూడడం అనే మాటతో సరిపెట్టడం చాలా చిన్నదనిపిస్తుంది. అది ఒక మహానాదం. ఒక మహా క్రమం. ఒక మహా సమర్పణ. పూజారులు ఒకే లయలో దీపాల్ని పైకెత్తినప్పుడు, మంట గాల్లో వలయాల్లా తిరిగినప్పుడు, శంఖం ఒక్కసారిగా మార్మోగినప్పుడు, గంగ మీద ఆ వెలుగు ప్రతిబింబించినప్పుడు... ఆ క్షణంలో మానవుని ప్రార్థన అగ్నిరూపం దాల్చి జలానికి సమర్పించబడుతున్నట్టనిపించింది. అక్కడి జనసందోహం కూడా ఆ క్షణం నిశ్శబ్దంగా అనిపిస్తుంది.. అందరూ ఒకే ఊపిరిగా, ఒకే చూపుగా, ఒకే వినికిడిగా మారిపోతారు. నాకు ఆ గంగాహారతి కేవలం ఒక వైభవ కర్మకాండలా అనిపించలేదు. అది మనిషి తన లోపల మిగిలి ఉన్న నమ్మకాన్ని వెలుగుగా మార్చి సమర్పించే క్షణంలా అనిపించింది.

ఆ రోజు గంగాహారతిని నేను నదిమీద పడవలో నుంచే చూసాను. అందుకేనేమో ఆ సాయంత్రం నాకు మరింత కొత్తగా, మరింత అందంగా కనిపించింది. గంగ మీద ఆ వెలుగుల చలనాలు, నీటిమీద దీపాల ప్రతిబింబాలు, ఆకాశం మసక నీలిరంగులోకి జారిపోయిన తీరు, ఇవన్నీ కలిపి ఆ సంధ్యను ఒక వింత పారవశ్యంగా మార్చేశాయి. హారతి అయిపోయాక కూడా నా మనసు చాలా సేపు ఆ వెలుగుల మధ్యే ఎక్కడో నిలిచిపోయినట్టుండిపోయింది. పడవ నెమ్మదిగా కదులుతోంది. ఘాట్ మీద జనాలు కదలిక క్రమంగా తగ్గుతోంది. గంగ మాత్రం తన మౌన ప్రవాహంలో మళ్ళి ముందుకు సాగుతోంది.

అప్పుడే నా చూపు నది అవతలి ఒడ్డువైపు మళ్ళింది. గంగానది ఆవల, చీకటి ముసురుకుంటున్న ఇసుక మడుగుల దగ్గర, దూరంగా పద్మాసనంగా కూర్చున్న కొన్ని నీడల్లా ఏవో కనిపించాయి. మొదట అవి సాధారణ మనుషులా అనిపించలేదు. మసక చీకటి, మంటలేని వెలుగు, దూరపు నిశ్శబ్దం ఇవన్నీ కలిసి ఆ ఆకృతులను మరింత రహస్యంగా చూపించాయి. కాస్త జాగ్రత్తగా చూసినపుడు అవి అఘోరాలే అని నాకు అర్థమైంది. గంగా ఈ వైపున గోల, ఘంటానాదం, హారతి, భక్తుల సందడి.. ఆ వైపున మాత్రం చీకటి, నిశ్చలత, బూడిద రంగు మౌనం. నాకు ఒక్కసారిగా అనిపించింది. వారణాసి తన రెండు ముఖాల్ని ఈ రోజు ఒకే సాయంత్రంలో నా ముందుంచుతోంది. ఒకటి వెలుగులో పూజించబడే కాశీ, మరొకటి చీకటిలో ధ్యానించే కాశీ అని అనుకున్నాను.

నాకు వారివద్దకు వెళ్లాలి అనిపించింది. ఎన్నో ఏళ్ళ జిజ్ఞాసా కావచ్చు. మరణానికీ, శ్మశానానికీ, బూడిదకీ, మౌనానికీ అంత దగ్గరగా బ్రతికే మనుషులను దగ్గరగా చూడాలనే బలమైన కోరిక కావచ్చు. లేక కాశీ ఆ రోజు నన్ను అక్కడికే తీసుకెళ్లాలనుకుందేమో. నాతోపాటే వచ్చిన నా బృందంలోని హిందీ తెలిసిన వ్యక్తికి చెప్పాను పడవను నడిపిస్తున్న వ్యక్తిని వాళ్ల దగ్గరకు తీసుకెళ్లమని. మొదట ఆ పడవ నడిపే అతను వెంటనే లేదండి అన్నట్టుగా తలూపాడు. అతని ముఖంలో అసహజ సంకోచం కనిపించింది. బహుశా అతనికి అది ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లాలి? అన్న భావన ఉండొచ్చు. మళ్లీ చెప్పాను. అతను మళ్లీ నిరాకరించాడు. కొద్దిసేపు నేను కూడా మౌనంగా ఉన్నాను. వాళ్లు ఎలా ఉంటారు? తెలుసుకోవాలి... ఏమి ఆలోచిస్తారు? ఈ చీకటిలో గంగ అవతల ఎందుకు కూర్చుంటారు? ఒకసారి దగ్గరగా చూడాలి అన్నట్టుగా. నా మాటల్లోని earnestness అతనికి అర్థమైందో ఏమో, మొదట్లో మొక్కుబడిగా కనిపించినా, చివరికి సరేనన్నట్టు పడవను ఆ వైపుకు మళ్లించాడు.

నాతోపాటు వచ్చిన ఆ వ్యక్తి కూడా దిగాడు. పడవ ఇసుక మడుగుకి దగ్గరగా ఆగినప్పుడు ఒక వింత నిశ్శబ్దం మమ్మల్ని చుట్టుకుంది. ఈ వైపు కాశీ ఘాట్‌లలో ఇంకా కొద్దిగా గంటల ప్రతిధ్వని వినిపిస్తూనే ఉంది. కానీ ఇక్కడికి రాగానే ఆ శబ్దం కూడా చాలా దూరంగా మిగిలిపోయినట్టనిపించింది. ఇసుక మీద కాలు పెట్టగానే గంగ చల్లదనం పాదాలకే కాదు, మనసుకి కూడా తాకినట్టనిపించింది. మేము నెమ్మదిగా వారి వైపు నడిచాం.

దగ్గరకి వెళ్లినప్పుడు వాళ్లు స్పష్టంగా కనిపించారు. బూడిద రాసుకున్న శరీరాలు, చిక్కుకున్న జటాలు, గంగవైపు చూస్తూ మౌనంగా కూర్చున్న దేహాలు, పక్కనే ఒక చిన్న దీపం మసక వెలుతురు. ఆ వెలుతురు వాళ్ల ముఖాలను పూర్తిగా చూపించలేదు; కానీ వాళ్ల కళ్లలోని నిశ్చలత మాత్రం నాకు స్పష్టంగా కనిపించింది. మేము దగ్గరికి వచ్చామనే విషయం వాళ్లకు ముందే తెలిసినట్టుంది. ఒకరు మెల్లగా తలెత్తి మమ్మల్ని చూశాడు. ఆ చూపులో ఆశ్చర్యం లేదు. కోపం లేదు. ఆహ్వానం లేదు. నిరాకరణ కూడా లేదు. అది ఒక విచిత్రమైన సమ్మతి వచ్చావా? సరే, మమ్ము చూడు అన్నట్టు అనిపించింది.

మేము దగ్గరగా వెళ్లి నమస్కరించాము. నాతో వచ్చిన వ్యక్తి హిందీలో వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట వారు మౌనంగా వున్నారు.. చాలాసేపటి తరువాత వారిలో ఒకరు బయటివాళ్లా? అని అడిగారు. అతని స్వరం మృదువుగా లేదు, కానీ ఖటినంగా అయితే ఉంది. మేము దక్షిణం నుంచి వచ్చామని చెప్పాము. కాశీ దర్శనానికి వచ్చామని, గంగాహారతి చూసి తిరుగుతుండగా మిమ్మల్ని చూసి కలవాలని అనిపించిందని చెప్పాము. వారు మళ్లీ పరస్పరం ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో మాటలకందని ఏదో తత్త్వం దాగి ఉంది. తర్వాత వారిలో వయసులో పెద్దగా కనిపించిన ఒక అఘోరి కాస్త కదిలి కూర్చున్నాడు. మమ్మల్ని కూడా కూర్చోమన్నట్టుగా చేతితో సంకేతం చేశాడు.

ఇసుక మీద వాళ్లకు ఎదురుగా కూర్చున్న ఆ క్షణం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను ఎవరి ముందున్నాను? సమాజం భయపడే ఈ మనుషుల ముందా? లేక మనం దూరంగా ఉంచుకునే ఒక సత్యం ముందా? నా మనసులో ఎన్నో ప్రశ్నలు ఒక్కసారిగా కదిలాయి.

మొదట నేను వాళ్లని అడిగింది చాలా సాధారణమైన ప్రశ్నే మీరు ఇక్కడ ఇలా ఎందుకు కూర్చుంటారు?
అది హిందీలో మా వ్యక్తి అడిగాడు. వారు జవాబు చెప్పడానికి తొందరపడలేదు. కొద్దిసేపు గంగ ప్రవాహం వైపు చూస్తూనే ఉన్నారు. తర్వాత వారిలో పెద్దవారు అయినా ఒకరు అన్నారు ... అక్కడ అంటూ ఘాట్‌ల వైపు చూపిస్తూ, జనం దేవుణ్ని వెలుగులో వెతుకుతారు. మేము ఇక్కడ చీకటిలోనే చూస్తాము.
ఆ మాట విన్న క్షణం నాలో తెలియని మౌనం. గంగాహారతి చూసి వచ్చిన వెంటనే ఆ వాక్యం వినడం నాకు ఒక అంతర్గత భావనలా అనిపించింది. నిజమే కదా.. ఘాట్‌లపైనేమో వెలుగులు, శంఖనాదం, పూజ, అలంకారం. ఇక్కడేమో చీకటి, ఇసుక, బూడిద, మౌనం. కానీ రెండు విభిన్నమైన మనుషులు వెతుకుతున్నది మాత్రం ఒకటే సత్యాన్ని.

అఘోరాలతో గడిపిన ఆ కొన్ని గంటలు నాకు ఎప్పటికీ మరచిపోలేని అనుభవాలు. వారిని గురించి చాలా కథలు విన్నాను. భయం కలిగించేలా విన్నాను. విచిత్రంగా విన్నాను. కానీ దగ్గరగా చూసినపుడు నాకు వాళ్లలో మొదట కనిపించింది భయం కాదు నిర్లిప్తత. మనం దూరం పెట్టే మరణాన్ని వాళ్లు దగ్గరగా కౌగిలించుకుంటారు. మనం అపశకునంగా చూసే బూడిదను వాళ్లు పుణ్యరేఖగా మోస్తారు. మనం వదలలేని మాయలన్నింటినీ వాళ్లు ముందుగానే దహనం చేసేసినట్టుంటారు. వారిలో ఒకరు నాకు చెప్పిన ఓ మాట ఇప్పటికీ ఎప్పటికీ మిగిలిపోయింది. “మనిషి మరణాన్ని కాదు, తనదనుకున్నదాన్ని వదులుకోవడానికే ఎక్కువగా భయపడతాడని” ఆ మాట వారణాసి మొత్తాన్ని ఒక్క వాక్యంలో నాకు చెప్పినట్లు అనిపించింది. ఆ క్షణమే నాకు ఒకటి అర్థమైంది. అఘోరాలు శ్మశానంలో ఉండటం వింతకాదు. మనం మరణసత్యం నుంచి పారిపోతూ బ్రతుకుతాం కాబట్టి వాళ్ళను మనం వింతగా భావిస్తాము అని.

To be Continued…

మరి మీ జీవితంలో మిమ్మల్ని ఆలోచింపజేసిన మరణ సత్యం ఏది?
మీకు ఇష్టమైతే పంచుకోండి..


~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

#KashiDiaries #teluguwriterscommunity #teluguwriters #spiritualjourney

fb.com/stars

Friday, April 3, 2026

ఓ సారి గమనించొచ్చు గా ....


 

ఓ సారి గమనించొచ్చు గా
*******************

నీకు నేను..
కేవలం వంటగదిలోని ఓ పనిమనిషినేనా?
మూడు పూటలా వడ్డించే యంత్రాన్నేనా?
ఇల్లుని అందంగా సర్దే..
ఒక ప్రాణం లేని అలంకరణ వస్తువు నేనా?

మంచి బట్టలు ఉన్నాయి
వేసుకోవడానికి నగలు ఉన్నాయి
తినడానికి తిండి ఉంది
ఉండటానికి నీడ ఉంది!
కానీ..
నా చేయి పట్టుకొని
చొరవగా మట్టిగాజులు ఏనాడైనా తొడిగావా?
నా కళ్లలోని భావాన్ని ఎప్పుడైనా చదివావా?
అసలు చదవాలని ప్రయత్నించావా?
నా పెదవుల చాటున దాగున్న మౌనాన్ని
ఏనాడైనా తెలుసుకోవాలని అనుకున్నావా?
నాకంటూ ఓ మనసు ఉంటుందని..
ఆ మనసుకి కూడా కొన్ని భావాలు ఉంటాయని
ఎందుకు తెలుసుకోలేక పోతున్నావ్?

బయట ప్రపంచం నాకు అక్కర్లేదు..
నీ చూపుల్లో చిన్న ఆత్మీయత చాలు నాకు!
వందల మాటలు అవసరం లేదు..
ఏమైంది? అని అడిగే నీ ఒక్క పలకరింపు చాలు!
నువ్వు తెచ్చే ఖరీదైన బహుమతుల కంటే..
నా అలసటను గుర్తించే నీ మాటలు కొన్ని చాలు!

కానీ నీకు..
నేను పడక గదిలో ఓ బొమ్మను కదా..
నాకూ భావాలు ఉంటాయబ్బా..
నాకూ కన్నీళ్లు వస్తాయబ్బా..
అవి కూడా గమనించలేనంత
యాంత్రికంగా ఎలా మారిపోయావు!
నువ్వు నింపిన ఈ భౌతిక సుఖాల మధ్య..
నా ప్రాణం ఒక ఎడారి లా మారిపోయింది!

వంట బాగా చేశావు అనకపోయినా పర్వాలేదు,
కానీ ... ఈ రోజు నువ్వు తిన్నావా?
అని ఏనాడైనా అడిగావా?
బయటి ప్రపంచంతో నువ్వు అలసిపోయి వచ్చావని నాకు తెలుసు
కానీ.. ఇంటి ప్రపంచం నన్నూ అలసట పెడుతుందని
నీకెప్పుడైనా అనిపించిందా?

నేను ఏడిస్తే
అది చిన్న విషయం కోసం కాదు..
చాలాసార్లు.. చాలాకాలంగా ఎవరూ వినని
నా మనసు నలిగిపోయిన ఓ ఆక్రందన!
నేను మౌనంగా ఉన్నానంటే
అది కోపం కాదు ...
ఎప్పుడు ఏమి చెప్పినా వినరని తెలిసిన
ఒక నిస్సహాయత!

నువ్వు బయట ప్రపంచంతో యుద్ధం చేసి వస్తావు,
కానీ..
నేను కూడా ఈ ఇంటి నిశ్శబ్దాలతో
ప్రతి రోజూ ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తాను!

నన్ను
భార్యగా చూశావు,
పిల్లల తల్లిగా చూశావు,
ఇంటి పనులు చూసుకునే మనిషిగా చూశావు
ఒక్కసారి
మనసున్న స్త్రీగా కూడా చూడొచ్చు కదబ్బా!

నాలోనూ కలలు ఉన్నాయి.
నాలోనూ మాటలు ఉన్నాయి.
నాలోనూ గాయాలున్న చోట్లున్నాయి.
నాలోనూ ఎవరితో పంచుకోలేని
వేవేల భావాలున్నాయి!
ఇప్పటికీ నీ ఒడిలో తలపెట్టి
నీ కోసం ఎదురు చూసే
నాలోని ఆ చిన్న పాప ఇంకా మిగిలే ఉంది..
కాస్త గమనించొచ్చు కదా..!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Thursday, April 2, 2026

జీతం ముచ్చట్లు.. జీతగాడి 'గాలి' గోపురం..!


 నిజాలు ఒప్పుకోవాలి మరి.. ఆయ్!

ఒక కవికి అసలైన పరీక్ష 'హాస్యం'. ఎందుకంటే కన్నీళ్లు తెప్పించడం సులభం కానీ, పెదవులపై నవ్వు పూయించడం మహా కష్టం. హాస్యం నేను రాసి ఎన్నో సంవత్సరాలు అయింది.. ఒక మిత్రుని కోరిక మేరకు ఇవాళ రాయాల్సి వచ్చింది.
ఓ మిత్రమా! మీ కోసం నాలోని హాస్య కోణాన్ని కూసంత బూజు దులిపి ఝుళిపించాను.. ఎలా ఉందో చెప్పాలి మరి..

జీతం ముచ్చట్లు.. జీతగాడి 'గాలి' గోపురం..!
*******************************
అమ్మో... ఒకటో తారీఖు
అని ఎల్.బి. శ్రీరాం గారు గావుకేక ఎందుకు పెట్టారో
బాగా అర్ధం అవుతోంది!

జీతం రాగానే ఓ మహారాజులా
ఫీలవుతాము కానీ,
మరుసటి రోజే ఆ డబ్బులన్నీ..
'మాయాజాలం' లా మాయమవ్వడం చూసి
దడుచుకు చస్తాము!

జేబులో 'క్రెడిట్ కార్డు' ఉంటే..
అదొక 'అల్లావుద్దీన్ అద్భుత దీపం'
అనుకుంటాం బయ్యా..
తీరా బిల్లు చూశాక గానీ తెలియదు..
అది మనల్ని మింగేసే 'రాకాసి దీపం' అని!
"ఇప్పుడు వాడండి.. నిదానంగా కట్టండి"
అనే ఆ వల ఏదైతే ఉందో ..
మత్స్యకారుడు వేసే వల కంటే యమడేంజర్ బయ్యో!

సరుకుల లిస్టు చూస్తే..
మహాభారతం లా ఉంటుంది,
బియ్యం బస్తా రేటు పెరిగినప్పుడల్లా..
గుండె వేగం 'బుల్లెట్ ట్రైన్' కంటే
స్పీడుగా పెరుగుతుంది!
నూనె డబ్బా అయిపోతుంటే..
ప్రాణం పోతున్నంత 'వైరాగ్యం' వచ్చేస్తుంది!

ఇక ఈ EMIల గోల చెప్పనవసరం లేదు..
కారుకి ఒక కిస్తీ..
ఇల్లుకి ఒక కిస్తీ..
ఫోనుకి ఒక కిస్తీ..
ఆఖరికి కొన్న ఫ్రిజ్ కి కూడా కిస్తీ!
మనం బ్రతుకుతున్నది మన కోసం కానే కాదు..
బ్యాంకు వాడి 'లాభాల' కోసం అని అర్థమవ్వడానికి..
పెద్ద సమయమేమి పట్టదు బయ్యా!
కేవలం నెల పదో తారీఖు దాకా సరిపోతుంది!

సరే ఇవన్ని కిందా మీద పడి ఎలాగో సెట్ చేసి
హమ్మయ్యా.. అనుకుంటూ సాయంత్రం అయినా ప్రశాంతత
దొరుకుతుందనుకుంటే అది మన భ్రమే బయ్యా!
"స్కూల్ ఫీజు, రెంటు, గ్యాస్ సిలిండర్.."
ఇవే మనల్ని పలకరించే 'మధుర భోషాణాలు'!

ఆదివారం వస్తే చాలు..
హాయిగా నిద్రపోదామనుకుంటే,
"చుట్టాలు వస్తున్నారు.. అది తీసుకురండి!
ఇది తీసుకురండి" అని ఆర్డర్స్!
జేబులో ఉన్న 'గాంధీ తాత' గిలగిలలాడిపోతున్నాడు బయ్యా!

కరెంటు బిల్లు చూస్తే..
'షాక్' కొట్టిన కాకిలా ముందు మన గుండె ఆగుతుంది,
గ్యాస్ సిలిండర్ రేటు వింటే..
'మంట' పొయ్యిలో కంటే గుండెల్లోనే ఎక్కువ పుడుతుంది!

రాత్రికి పడుకుందామని కళ్లు మూస్తే..
రేపటి 'బాకీలు' కలలోకి వచ్చి కత్రినలా డాన్సు చేస్తాయి బయ్యా!
జీవితం అంతా ఒక 'ఇన్-స్టాల్-మెంట్' మయం..
కాసేపు అన్ని మర్చి పల్లికిలిద్దామనుకున్నా దానికి కూడా
'ట్యాక్స్' పడుతుందేమోనన్న భయం!

జీవితం అంతా ఒక 'ముక్కల ఆట' అయిపోయింది బయ్యా..
ఎంత కలిపినా చివరకి మిగిలేది..
'బ్యాలెన్స్ సున్నా' అనే పెద్ద కొటేషన్!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Wednesday, April 1, 2026

హిమ శిఖరాల్లో నా ఆత్మాన్వేషణ ....

నాకు ట్రావెలింగ్ అంటే అమితమైన ఇష్టం.. ముఖ్యంగా హిల్ స్టేషన్స్ అంటే ఇంకా పిచ్చి.. ఇప్పుడంటే హిమగదుల్లో సిస్టం ముందు కూర్చుని కుదురుగా ఉన్నాను కానీ.. ఒకప్పుడు తిన్నగా ఒకచోట అసలు ఉండేవాడినే కాదు.. ఎన్నో ప్రయాణాలు చేసాను ఎన్నో ప్రదేశాలు చూసాను.. వాటిల్లో నేను చేసిన కొన్ని ప్రయాణాలు మాత్రం ఓ అద్భుతమనే చెప్పాలి. ఒక్క అమర్నాథ్ తప్పితే మిగతా కన్యాకుమారి నుంచి కేదార్నాథ్ వరకు మాక్స్ అన్ని కవర్ చేసేసాను. వాటిల్లో ఒక ఆద్యాత్మిక ప్రయాణం గురించి మీతో పంచుకుంటున్నాను.

జీవితం అంటే మనల్ని మనం వెతుక్కునే ఒక నిరంతర అన్వేషణ అని నేను బలంగా నమ్ముతాను. కొన్ని ఏళ్ల క్రితం అనుకోని ఓ ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది.. అది కూడా దాదాపుగా రెండు నెలలు.. కేవలం రెండు రోజులు ముందు నాకు తెలియడం చేత నేను ముందుగా ప్రిపేర్ కాలేకపోయాను అంతా హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది.. ఆ ప్రయాణం నన్ను ఉత్తర దిశగా, ఆ హిమగిరి శిఖరాల వైపు నడిపించింది. అది కేవలం ఒక ప్రయాణం కాదు.. నా జీవితంలో నేనెప్పటికీ మర్చిపోలేని ఒక 'అలౌకిక' అనుభూతి.

బండి కిటికీ బయట మారిపోతున్న దృశ్యాలను చూస్తూ కూర్చున్న ఆ మొదటి గంట నుంచే నా మనసులో ఏదో తాత్వికత ప్రారంభమైపోయింది. దక్షిణ భారతపు పరిచితమైన నేల, చెట్లు, గ్రామాలు, భాష ఇలా ఒక్కోటి వెనక్కి వెళ్ళిపోతుంటే మనసులో ఒక తెలియని అలౌకికానందం. రోజులు మారుతున్నాయి. స్టేషన్లు మారుతున్నాయి... భాషలు మారుతున్నాయి ... వాతావరణం కూడా మెల్లగా మారడం మొదలుపెట్టింది. మొదట గాలిలో చలి పెరిగింది. తర్వాత దూరంగా కనిపించే కొండలు దగ్గరవుతూనే వచ్చాయి. చివరికి పర్వతాలే ప్రపంచంలా కనిపించే ఒక ప్రాంతంలోకి అడుగుపెట్టినప్పుడు, నేను మరో లోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలిగింది. ఆ కొండల నిశ్చలత, ఆకాశం ఆ లోతు, గాలిలో ఉండే ఆ స్వచ్ఛత ఇవన్నీ కలిసి మనిషికి మాటలు తగ్గించి, అనుభూతులను అమాంతం పెంచేస్తాయి.
మేము ప్రయాణం చేస్తూ ఒక్కో ప్రదేశం దాటుతున్న కొద్దీ నాకు ప్రకృతి కొత్త రూపాల్లో దర్శనమిచ్చేది. కొన్ని చోట్ల నదులు రాళ్లను ఢీకొంటూ ఉరుకులు తీస్తూ ఉండేవి. వాటి శబ్దం కేవలం నీటి ప్రవాహం లా కాదు.. ఆది నుంచీ ఎవరో జపిస్తున్న మంత్రధ్వనిలా అనిపించేది. మరి కొన్ని చోట్ల పొగమంచు కొండల నడుమ అలా వాలిపోయి ఉండేది. దాన్ని చూస్తే, ప్రకృతి తన గుండెలో దాచుకున్న విశ్వరహస్యాలను అలా ముసుగులో దాచుకున్నట్టుండేది. ఉదయాన్నే తొలిసారి మంచుతో తడిసిన ఆకాశాన్ని చూస్తే, మన కళ్ల ముందే భూమి మరియు స్వర్గం కొద్దిసేపు కలిసిపోయినట్టనిపించేది.

ఉత్తర భారతం వైపు ప్రయాణం చేస్తూ నాకు బలంగా అనిపించిన విషయం అక్కడి ప్రజల జీవనశైలి. చలికి అలవాటు పడిన శరీరాలు, కొండల్ని ఇళ్ల ముందున్న మెట్లలా చూస్తూ నడిచే ఆ పాదాలు, తక్కువలో జీవిస్తూ కూడా తృప్తిగా కనిపించే ముఖాలు.. ఇవన్నీ మన జీవితం ఎంత అధికంగా భారమైపోయిందో నాకు బాగా గుర్తుచేశాయి. మనం నగరాల్లో పరుగులు తీసే ఆతురత అక్కడ కనిపించదు. అక్కడి నిశ్శబ్దంలో ఒక విధమైన స్థిరత్వం ఉంటుంది. అదే ఆ ప్రదేశాల ఆధ్యాత్మికతకు మొదటి అర్థం.

ఆ రోజు సూర్యోదయానికి ముందే నా ప్రయాణం కేదార్‌నాథ్ వైపు సాగింది.. ఆ దారి మాత్రం ఎప్పటికీ నా మదిలో నిలిచిపోయింది. నడవడం మొదలైన క్షణం నుంచే నాకు అర్థమైంది.. ఇది దర్శనానికి వెళ్తున్న దారి కాదు, ఇది పరీక్షకు వెళ్తున్న దారి. చలి, అలసట, ఎత్తు, ఊపిరి బరువు ఇలా ఒక్కొక్కటి మన శరీరానికి పరీక్ష పెడతాయి.. అప్పుడు అవే మనకు శత్రువులుగా మారుతాయి. కానీ అదే సమయంలో బుద్ది మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తుంది.. వద్దు ఇక చాలు వెళ్ళిపోదాం అంటూ.. కానీ మనసు మాత్రం సంకల్పంగా ముందుకు వెళ్ళమనే చెప్తుంది.. ఆ పర్వత దారుల్లో నడుస్తూ నేను నా గురించి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకున్నాను. ఎంతవరకు తట్టుకోగలనో, ఎంతవరకు భరించగలనో, ఎక్కడ అలసిపోతానో, ఎక్కడ మళ్లీ తిరిగి లేస్తానో ఇవన్నీ ఆ దారే నాకు నేర్పింది.

ఎన్నో గంటలు షుమారు 12,000 అడుగులు ఎక్కిన తరువాత దూరంగా మంచు కొండల మధ్య కేదార్‌నాథ్ క్షేత్రం తొలిసారి కనిపించిన ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను. అందరూ ఆ దేవాలయాన్ని చూసిన మరుక్షణమే కన్నీళ్లు ఎందుకు రాలుస్తారో అప్పుడు అర్థమైంది. అది కేవలం దేవాలయం కనిపించడం వల్ల కాదు. మన శ్రమకు, మన ఆశకు, మన ప్రార్థనకు ఒక రూపంలా కనిపించడం వల్ల. ఆ క్షణంలో శివుడు విగ్రహంలో కాకుండా వీచే గాలిలో కూడా ఆయన ఉన్నట్లుగా అనిపించింది.

కేదార్‌నాథ్‌లో నేను చూసింది అక్కడ మాటలు తగ్గిపోతాయి. మనసు తనంతట తానే మౌనమవుతుంది. ఆ మంచు పర్వతాల మధ్య నిలబడి ఉంటే మనిషి తనలోని తత్వాన్ని తప్పకుండా తనే గ్రహిస్తాడు. అదే ఆ క్షేత్ర మహిమ. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నాకు శివుడు అంటే కేవలం అభిషేకం, బిల్వదళం, మంత్రం లా కాకుండా ... భరించగలిగే నిశ్శబ్దం, నిలబెట్టే సహనం, మాటలకందని మహాశక్తిలా అనిపించాడు.
ఆ రోజు రాత్రి అక్కడే వుండి.. ప్రక్కరోజు వేకువనే దర్శనం చేసుకొని బద్రీనాథ్ వైపు ప్రయాణం సాగించాను.. కేదార్‌నాథ్ కఠిన తపస్సైతే, బద్రీనాథ్ ఒక మృదువైన ఆత్మశాంతి. ఆ ప్రాంతమంతా ఒక చల్లని ప్రశాంతతతో నిండి ఉంటుంది. అక్కడి గాలి తాకుడు కూడా ఓ స్పర్శ లా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే.. మన మనసులో చాలా రోజులుగా మోస్తున్న భారాన్ని అంతా ఒక్కసారిగా తగ్గించినట్టుంటుంది. బద్రీనాథ్ క్షేత్రం దగ్గరకు చేరుతున్నప్పుడు నాకు ఒక ఆలయం దగ్గరకు వెళ్తున్నట్టు కాకుండా, ఎంతోకాలం తర్వాత ఓ ఆశ్రమానికి చేరుతున్నట్టనిపించింది.

బద్రీనారాయణుడి దర్శనం నాకు చెప్పలేని ఓదార్పునిచ్చింది. ఎందుకో తెలియదు, అక్కడికి వెళ్లిన తర్వాత నా అంతరంగంలో ఎన్నాళ్లుగానో తిరుగుతున్న కొన్ని అలసటలు ఒక్కసారిగా సాంత్వన కలిగినట్లు అనిపించాయి.. శివక్షేత్రం నన్ను తన లోపలికి లాక్కున్నట్లు అనిపిస్తే.., బద్రీనాథ్ మెల్లగా ఆత్మీయంగా నన్ను అక్కున చేర్చుకున్నట్టు అనిపించింది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక దేవుడు గంభీరంగా మన ముందుంటే అది కేదార్‌నాథ్. ఒక దేవుడు మౌనంగా “వచ్చావా?” అని అడిగితే అది బద్రీనాథ్.

ఆ తరువాతి ప్రయాణం కాశీ వైపు సాగింది.. ఈ కాశీ అనుభవం మాత్రం పూర్తిగా వేరే దిశలో నన్ను ఆశ్చర్యపరిచింది. ఉత్తర యాత్రలో కాశీకి చేరుకునేలోపు నా మనసు ఇప్పటికే ఎన్నో అనుభవాలతో నిండిపోయింది. కానీ కాశీ లో అడుగుపెట్టిన వెంటనే మరో స్థాయిలో ఆలోచించడం మొదలైంది. ఆ నగరం గాలి కూడా వేరేలా ఉంటుంది. అక్కడి వీధులు అట్టడుగున కాలపు మూలాల్లో చిక్కుకున్నట్లు అనిపించాయి.. ఇరుకు సందుల్లో నడుస్తున్నప్పుడు, దేవాలయ ఘంటానాదం వినిపిస్తున్నప్పుడు, గంగాతీరానికి దిగుతున్నప్పుడు, మణికర్ణిక ఘాట్ లో మునకలేసినప్పుడు, హరిశ్చంద్ర ఘాట్ లో శవాల చితిమంటలను గంటలతరబడి చూస్తున్నప్పుడు మనిషి ఒక పాత నాగరికత నడుమ నడుస్తున్నాననే భావనకంటే, శాశ్వతత్వం ఎదుట నిల్చున్నాననే భావన కలిగింది.

కాశీ ఘాట్‌లు నా మనసులో చాలా లోతైన ముద్రలు వేశాయి. గంగను చూస్తే కాలం ప్రవహిస్తున్నట్టనిపించింది. ఒకవైపు దీపారాధన, మరోవైపు దహన సంస్కారాలు, ఇంకోవైపు జపంలో మునిగిన సన్యాసుల జీవితం, మరణం, భక్తి, విరక్తి అన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే చోటు ఈ భూమి మీద ఒక్క కాశీ మాత్రమే. అక్కడ నిలబడిన తర్వాత నాకు చాలా స్పష్టంగా అనిపించిన విషయం ఏమిటంటే, మనిషి చాలా విషయాలను అవసరానికి మించి పట్టుకుంటాడు. చివరికి గంగ తీరం చెబుతుంది తీసుకెళ్లేది ఏమీ లేదు, మిగిలేది చేసిన సాధన, మోసిన భావం, పలికిన ప్రార్థన అని.
తల్లి గర్భంలో ఉన్న తొమ్మిది నెలలకు గాను తొమ్మిది రోజులు కాశీ లోనే నేను ఉన్నాను. కాశీ విశ్వనాథుడి దర్శనం నాకు ఒక శాసనంలా అనిపించింది. శివుడు ఇక్కడ పర్వత నిశ్శబ్దంలో లేడు; ఇక్కడ ఆయన జన జీవితం మధ్యలో ఉన్నాడు. జనసందోహంలో ఉన్నాడు. ఘంటానాదంలో ఉన్నాడు. అగ్నిలో ఉన్నాడు. గంగలో ఉన్నాడు. మరణాన్ని భయంగా కాకుండా, మార్గమై అంగీకరించే బలం ఆ నగరంలో నాకు బలంగా కనిపించింది. అందుకే కాశీ కేవలం పుణ్యక్షేత్రం కాదు.. అది జీవితానికి మరియు అంతిమ సత్యానికి మధ్య నిలిచిన నగరం.

ఇలా రాసుకుంటూ వెళ్తే పేజీలకు పేజీలు నిండి పోర్లుతాయి.. అందుచేత ఇంకా ఎంతో చెప్పాలని వున్నా.. ఇక్కడితో కష్టంగా ముగిస్తున్నాను.. మీకు నిజంగా ఆసక్తి కనుక ఉంటే .. తదుపరి భాగం లో సమయాన్ని చూసుకొని మిగిలిన విషయాలు వివరిస్తాను.. అఘోరాలతో గడిపిన కొన్ని గంటలు.. సన్యాసులతో ముచ్చిటించిన ముచ్చట్లు.. శవాల మధ్య నేర్చుకున్న నిజాలు.. ఇరుకు దారుల్లో నేను చూసిన అద్భుతాలు.. సాయంత్రం అయితే గంగాహారతి దగ్గర జరిపే అందమైన అలంకరణాలు.. నెలవంకలా పారుతున్నగంగా ప్రవాహం.. ఇలా ఎన్నో మీతో పంచుకోవాలని ఉంది.. ఇక్కడితో ముగిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి..

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

ప్రకృతే పరమాత్మ ....


ఆకు మీద ఆగిన మంచుబిందువులో
అనంతాకాశపు ప్రతిబింబం దాగి ఉంటే,
అణువణువులో పరమాత్మ లేడని
ఎవరు చెప్పగలరు?

పంచభూత పుటములపై పరబ్రహ్మ రాసిన
మౌన మంత్రాక్షరాల సమాహారమే ప్రకృతి!
దానిని కళ్లతో దర్శించువారికి సౌందర్యం మాత్రమే కనిపిస్తుంది!
హృదయంతో ఆలకించువారికి దైవత్వమే అనుభవమవుతుంది!

ఉదయించే సూర్యుడిలో అగ్ని కాదు ఆది జ్యోతి ఉంది.
పారే నదిలో నీరు కాదు నాదబ్రహ్మ ఉంది.
విరిసే పుష్పంలో వర్ణం కాదు దైవత్వం ఉంది.
గాలి తాకిడిలో చలనం కాదు కనిపించని కరుణ ఉంది.

భూమి గర్భమున జన్మించే ప్రతి విత్తులో
పునర్జన్మ రహస్యము నిద్రిస్తుంది.
శిలపై జారే ప్రతి జలరేఖలో
కాలం తన మౌనగాథను చెక్కుకుంటుంది.
పర్వత శిఖరాల నిశ్చలతలో
తపస్సులో మునిగిన యుగాల ధ్యానం మెరిసిపోతుంది.
సముద్ర తరంగాల ఉప్పెనలో
అంతరంగాన్నే ఆలపించే ఆది నాదం విరుస్తుంది.

మేఘగర్భంలో మెరిపించే మెరుపు
విశ్వచైతన్యము ఓ క్షణం తన నేత్రాలు విప్పిన దివ్యస్ఫురణ.
ఉరిమే గర్జన
మౌనంలో మునిగిన మనసులను మేల్కొలిపే
ప్రకృతి ఉచ్చరించిన ఆకాశ వేదమంత్రం.

వెన్నెలలో జారే ఆ శీతకాంతి
అలసిన లోకమంతా నెమ్మదిగా నిమురుతున్న
పరమకరుణామూర్తి హస్తస్పర్శ.
వానచినుకులో తడిసే నేల వాసన
సృష్టి తన మూలస్మృతిని తలచుకుని
పులకరించిన గర్భగానం.

అరణ్యపు నీడలోనూ
అగ్నిజ్వాల అంచునా
మంచుతునక నిశ్చలతలోనూ
విప్లవ వర్షధార దారుణతలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు!

కానరాని దేవుడని వెదికే మనిషి
తాను నడుస్తున్న నేలని
ఒకసారి గమనించినా సరిపోతుంది కదా!
ప్రతి రేణువూ ఒక యుగసాక్షి,
ప్రతి శ్వాసా ఒక దివ్య అనుగ్రహం,
ప్రతి హృదయస్పందన ఒక అజరామర నాదం.

మనం దేవాలయ గర్భగుడిలో నిలబడి
ఘంటానాదం వినగానే భక్తితో తలవంచుతాము.
కానీ ఉదయాన్నే పక్షుల గానంలో
ఆ దేవనాదం నీకు వినిపించట్లేదా?
దీపారాధనలో మెరుస్తున్న జ్యోతి ముందు
నీ మనసు కరిగిపోతుంది కదా!
అదే జ్యోతి సూర్యకిరణమై
ప్రతి ఉదయం నీ గుమ్మం ముందుకే రావట్లేదా!

ప్రకృతిని ప్రేమించుట అంటే
పూలను, పర్వతాలను, వర్షాలను ఇష్టపడటమే కాదు
సృష్టిలో విస్తరించిన ఆ పరమ చైతన్యాన్ని అర్ధం చేసుకోవడం
ప్రకృతిని కాపాడుట అంటే చెట్లను మాత్రమే రక్షించుట కాదు
మన అస్తిత్వమునకు మూలమైన దైవశ్వాసను కాపాడటం
ప్రకృతిని ఆలకించుట అంటే శబ్దాలను వినడం కాదు
నిశ్శబ్దముగా పలికే పరమాత్మను గ్రహించడం

అణువులో అనంతం ఉంది,
చినుకులో సముద్రం దాగుంది,
పువ్వులో పరిమళముంది
మనసులో మహాశక్తి దాగుంది
దాన్ని తెలుసుకున్న క్షణం నుంచే
ఈ ప్రపంచం సాధారణ దృశ్యంలా కాదు
ప్రతి దిక్కూ ప్రత్యేకంగా కనిపిస్తుంది
ప్రతి క్షణమూ ఓ దివ్యానుభూతిగా మారుతుంది
ప్రతి శ్వాస ఓ ప్రార్థనగా మారుతుంది.

ప్రకృతి అనేది బయట కనిపించే సౌందర్యం కాదు
పరమాత్మ తనను తాను
పంచభూతాల రూపంలో
మనకందించిన
నిత్య నిశ్శబ్ద మహాకావ్యం!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Tuesday, March 31, 2026

మదన పంచమి చినుకులు... (అలౌకిక కేశధూమ ప్రణయ కావ్యం)


 ఇందులో ఏ ఒక్క పదములో అశ్లీలత, అసభ్యత ఉండదు. అందుచేత ప్రతీ ఒక్కరు చదవచ్చు..భావ ప్రాధాన్యత ఇందులో ముఖ్యంగా మీకు బాగా కనపడుతుంది.. ఇందులో ఎక్కువగా శబ్దాలంకారాలు, ఘ్రాణానుభూతి, దృశ్య చిత్రణ, తాత్వికత, భావుకత & నాద శిల్పం తో పాటు స్వల్ప వర్ణన, ప్రణయం, రసధ్వని, అలకార శోభ, ఇలా అన్నిటినీ పేర్చి వచనాన్ని, భావాన్ని, సంస్కృత మాధుర్యాన్ని చిల్కరింపుగా గ్రాంధిక సరళిలో కలగలిపి ఈ 'మదన పంచమి చినుకులు'. రాసాను.


అగరు ధూపపు ధూమ రేఖల మాటున.. తడి కురుల నుండి రాలే ఒక్కో జలబిందువు, ఒక అమర కావ్యంలోని అక్షరమైతే.. ఆ సుందర దృశ్యమే ఈ 'మదన పంచమి చినుకులు'. ఇది ఆత్మీయ అనురాగ పరిమళాలతో రాసిన ఓ 'అలౌకిక' మంత్రము!" చదివి మీరే చెప్పాలి మరి..

మదన పంచమి చినుకులు
(అలౌకిక కేశధూమ ప్రణయ కావ్యం)
***************************

అగరు ధూపము వేయు ఓ సుప్రభాత వేళ
తడి కురులకు సాంబ్రాణి పట్టించు సమయాన!

నల్లని కేశారణ్యంలో చిక్కుకున్న ఆ తెల్లని పొగమంచు
కైలాస శిఖరాగ్రాన విహరించే మేఘమాలికలవోలె!
అరవిరిసిన కనురెప్పల మాటున
ధూపపు సెగకు ఎర్రబడిన నీ నయన పద్మాలు,
పుడమిపై ఉదయించిన రెండు సూర్య బింబాలై మెరవగ!
నీలాల కురుల నుండి రాలు ఒక్కో జలబిందువు
నీ దేహపు కాంతికి మదన పంచమి చినుకులై మెరిసెడి వేళ..
అగరు ధూపము లిడు ఆ పరిమళం, నీ తనువంతా
ఓ అదృశ్య కవచమై పరిచెడి వేళ..

మొగ్గ పువ్వై విచ్చుకును
ఆ రేకుల మధ్య దాగిన మకరందపు తడివోలె,
తేనె తుట్టె నుండి జాలువారే పుట్టతేనే తీపి వోలె!
మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వెలుగు..
నీ దేహపు జవ్వాజి గంధంతో
మేళవించిన మధుర శోభన వోలె!

నీ కంఠము నుండి జాలువారే ఆ పంచమ రాగము,
ధూపపు ధూమముతో కలిసి గాలిలో రాసే
ఓ అద్భుత ప్రణయ కావ్యమే కదా!

ఆ అగరు వాసన..
ఆ చెక్కిళ్లపై ఉన్న కస్తూరి గంధం,
రెండూ మేళవించి మదిలో రేపే
ఓ అనిర్వచనీయ పరవశాన్ని ఏ కవి వర్ణించగలడు?

నువ్వు కురులు విదిలిస్తే చాలే..
రాలిన ఆ ధూపపు పరిమళం,
అనంత విశ్వమంతా వ్యాపిస్తుంది!
నీవు కదిలితే చాలే..
ఆ కేశ ధూపపు సుగంధం వెనుక,
నా మనసొక అదృశ్య నీడలా సాగుతుంది!

పుష్పగర్భమున నిదురించే పుప్పొడి చందనమా..
ఏమని వర్ణించనే నిను!
చంద్రచూడామణి వెన్నెలల చీరకొంగుల రీతిగ..
మన్మథ మాధవీలతల పరిమళ నిట్టూర్పుల రీతిగ..
పున్నాగ పూర్ణిమా శ్వాసల సుగంధాల రీతిగ..
అనురాగ అమృతాంశు తారక మెరుపుల రీతిగ..
మధురిమా మంజీరనాదాల చూపు వంపుల రీతిగ..
కోమల కదంబరసాల పలుకు చినుకుల రీతిగ..
సుగంధ సంధ్యారాగపు జడపాయల రీతిగ..
విరహ వేణువుల వెన్నెల గీతాల రీతిగ..
రసకేలి రేణువుల రాగవెలుగుల రీతిగ..
సౌందర్య సుధామేఘాల తేనెతుంపర్ల రీతిగ..
చిరునవ్వు చంద్రికల చందన వీచికల రీతిగ..
మౌన మధుకలశపు ఆర్తి పరిమళాల రీతిగ..
హృదయ హంసగమనపు తామర వెలుగుల రీతిగ..

క్షీరములో దాగిన నవనీత సోయగమా..
మరేమని సముద్భూషించనె నిను!
మదన మల్లికామోదపు చూపు రేఖలు గలుగగా..
రమణీయ రాగమాలికల వొంపు తళుకులు అమరగా..
నవనీత నిశీధి కాంతుల నేత్ర ద్వారాలు తెరువగా..
పంచమ స్వరముల పొదిగిన పెదవి తీరాలు సొగసుగా..
అలకాంజలి జారిన ఆత్మీయ జ్యోత్స్నలు నిలువగా..
శృంగార శశిలేఖల సన్నని వర్ణరాగాలు విరియగా..
సుమసౌరభ నిదురించిన కేశపాశ గర్భాలు తెరువగా..
వీణావిరహిణి వణుకు తాకిన హృదయ కంపనలు వెలుగగా..
మందార మృదులిమల తనువుగర్భ రాగాలు పలుకగా..
అలౌకిక అనురాగాంబరపు నవ్య నీడలు మెరువగా..

రమణీయ రాగవెలుగు స్త్రీ తత్వ సౌమ్యరాగమై,
మధువులో మునిగిపోయిన మధుర పరిమళమై,
లయల కెరటాలపై జముకు జముకు లేస్తూ,
ఝుంఝూమారుత ఝర్ఘరీయధ్వనులై నర్తించు
నీ పాదపద్మాల సౌందర్య వీక్షణం ఓ క్షణమైనా చాలదటే!
నా విభ్రమ నేత్రాలు జ్ఞాపకరత్నాలై మెరిసేందుకు!

ఏమని ముగించను?
నీ పై పలికిన ప్రతి ఉపమానమూ
నీ లోని నిండైన స్త్రీ తత్వపు నీడ మాత్రమే.
నీ పై రాసిన ప్రతి పదమూ
నీ అనురాగ ఆరాధనలో కరిగిన ఓ అక్షరమే!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Monday, March 30, 2026

శతాబ్దపు గర్జన ...


 ఆవేశపూరితమైన ఓ విప్లవ రచన చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో .. “అక్షరం”, “కావ్యం”, “యుద్ధం”, “రక్తం”, “సత్యం”, “చీకటి”, “సూర్యోదయం”, “శబ్దం”, “శతాబ్దం” అనే చిన్న చిన్న పదాలను కూడా గంభీరమైన భావాలుగా గర్జించేలా మలిచాను. రచయితలు అందరూ వారి వారి రచనలను ఎంతో అత్యద్భుతంగా రాస్తున్నారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే వారికి నా నమస్సులు.. వారి అంత కాకపోయినా మన రచయితల కోసం రాసిన ఈ “శతాబ్దపు గర్జన” మీకు నచ్చుతుందని ఆశిస్తూ.. మీ సమాధానాలకోసం వేచి చూస్తున్నాను.


శతాబ్దపు గర్జన
*************

కాలపు గర్భంలో నిశ్శబ్దం పేలిన శబ్దం.. నా అక్షరం!
అన్యాయపు పునాదులపై నేను ప్రకటించిన యుద్ధం.. నా కావ్యం!

గడిచిన ప్రతి దశాబ్దం ఒక సాక్షి..
మనుషుల ముసుగుల వెనుక దాగిన కుళ్ళిన నిజాలకి!
రాబోయే ప్రతి శతాబ్దం ఒక వేదిక..
నా కలం విదిల్చిన రక్తం రాసే అక్షర సత్యాలకి!

నన్ను మౌనంలో బంధించాలనుకున్న ప్రతి సంకెళ్లు
నా పదాల అగ్నిలో తామే కరిగిన క్షణాలే నా చరిత్ర!
నా గొంతు ఒక మనిషిదే కావచ్చు..
కానీ దానిలో గర్జించేది యుగాలుగా నలిగిన జనసమూహాల నిశ్వాస!

నేను రాసేది కవిత కాదు
గాయపడిన గుండెల గొంతుకి దొరికిన ప్రతీకారం!
నేను పలికేది పదం కాదు
దోపిడీ గోడలపై విసిరిన అగ్నిముద్ర!

చీకటి తమ రాజ్యమని గర్వించినవారికి
నా అక్షరం సూర్యోదయం ముందు వినిపించే తొలి హెచ్చరిక!
మోసాన్ని ధర్మమని ముద్రించిన వక్రబుద్ధులకు
నా కావ్యం సత్యమై గర్జించి నిలిచిన ఓ సాక్ష్యం!

వాళ్లు కట్టిన సింహాసనాలన్నీ
బలహీనుల ఎముకలతోనే మోపినవని నాకు తెలుసు!
వాళ్లు ధరించిన విజయాలన్నీ
ఎన్నో అనాథ రోదనలని మూసిన బంగారు ముసుగులని నాకు తెలుసు!

అందుకే
నా కలాన్ని, సిరాతో రాయట్లేదు
మానవ వేదనల మరిగిన రక్తంతోనే
లిఖిస్తున్నాను!
నన్ను కవి అనొద్దు..
నేను కాలం గొంతులో ఇరుక్కుపోయిన అరుపుకి ప్రతిరూపం!
నన్ను రచయిత అనొద్దు..
నేను రాబోయే తరాల రక్తనాళాల్లో దాచిన తిరుగుబాటు జ్వాలకి మరోపేరు!

నా ప్రతి వాక్యం వెనుక ఒక వేదన ఉంది..
నా ప్రతి విరామం వెనుక ఒక విప్లవం ఉంది..
నా ప్రతి అక్షరం వెనుక ఒక అంతిమ నిర్ణయం ఉంది..
కూలిన గుడిసెల పొగలోనూ,
తుడిచిపెట్టిన బతుకుల బూడిదలోనూ,
కనిపించకుండా పోయిన నిజాల సమాధులలోనూ
నా క్షరం అక్షరమై ఉదయిస్తూనే ఉంటుంది!

ఒకప్పటి రచయితల ప్రస్థానం మళ్ళి మొదలైన రోజు
సింహాసనాలన్నీ కంపిస్తాయి..
చీకటి చట్టాలన్నీ చిరుగుతాయి..
మానవత్వం మళ్లీ తన రక్తంతో తానే తన బావుటా ఎగురవేస్తుంది!
ఆ రోజు
నా కావ్యం కేవలం చదవబడదు..
జీవించబడుతుంది!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Saturday, March 28, 2026

మజిలీ..


జీవితంలో అంత్యంత గొప్ప జ్ఞాపకాలను మనం పోగేసుకునేది ఒక్క స్కూల్ డేస్ లలోనే..అలాంటి రోజుల్లో ఇలాంటి ఒక గొప్ప మజిలీ తప్పకుండా ఏదో ఒకటి వుండే ఉంటుంది.
ఇది చదవగానే మీకు మొదట గుర్తొచ్చే మీ స్నేహితుడే మీ నిజమైన స్నేహితుడు .. చదివాక మీకు అలా ఎవరన్నా గుర్తొస్తే తప్పక చెప్తారు కదూ..

మజిలీ..
******

ఓయ్ నేస్తమా..
నీకు గుర్తున్నాయా? ఆ రోజులు ..
ఒకప్పటి మన ప్రపంచం అంతా
మన ఇంటి గుమ్మం నుంచి
స్కూల్ కి చేరుకునే దారి లోనే ఉండేది!

నీకు గుర్తుందా?
ఉదయపు చలి చర్మంపై ముల్లులా గుచ్చుకుంటుంటే..
అమ్మ బలవంతంగా స్నానం చేయించి,
కొబ్బరి నూనె తలనిండా రాసి బడికి పంపిన వేళలు!

భుజాన వేలాడే ఆ పుస్తకాల సంచి..
మెడకు వేలాడే నీళ్ల బాటిల్,
చేతిలో పలక,
బ్యాగులో, మూలలు చినిగిన పుస్తకాలు..
చొక్కా జేబులో దాచుకున్న,
చిన్న పెన్సిల్ ముక్క..
అవి సామాన్య వస్తువులు కావు,
ప్రపంచాన్ని తొలిసారి అక్షరాల రూపంలో
తాకబోతున్న బాల్యపు సన్నాహకాలు!

స్నేహితుల అరుపులు..
అవి సాధారణ పిలుపుల్లా కాకుండా
మనసు సంతోషంతో నిండిపోయే పలకరింపుల్లా ఉండేవి!
ఉదయం మేల్కొన్న మన ఊరి గాలిలో
కాలం అల్లిన అల్లరి జ్ఞాపకాలు ఎన్నో దాగుండేవి!

నీకు గుర్తుందా?
ఒకరి పుస్తకాల సంచి మరొకరం లాక్కోవడం
హోంవర్క్ చేశావా? అని అడిగి
సమాధానం వినకముందే నవ్వేయడం,
దారిమధ్యలో ఎక్కడో ఆగి
చింతచెట్టు పైకి ఆశగా చూడడం,
సెలవు గంట గురించి
స్కూల్ కు వెళ్లేముందే కలలు కనడం..
ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటే,
బంగారమో, ముత్యమో కాదు...
మళ్లీ ఎప్పటికీ దొరకని
తిరిగిరాని మన కాలపు మజిలీలు!

గుర్తుందా?
వర్షం పడితే..
మనం వెళ్ళే దారి ఒక అద్భుత లోకమయ్యేది!
చిన్న చిన్న నీటి గుంటలు..
మన పడవలకు సముద్రాలయ్యేవి!
బురద అంటిన నిక్కరు,
తడిసిన చెప్పులు..
అమ్మ తిడుతుందని తెలిసినా,
ఆ వాన చినుకులతో సాగించిన మన స్నేహం..
ప్రస్తుతం మనం ఏసీ గదుల్లో
పొందే సౌకర్యం కంటే అది కోటి రెట్లు మిన్నకదా!

దారి మధ్యలో ఉన్న పాత బావి..
ఎన్ని రహస్యాలకు అది నిలవో!
స్కూలు ఎగ్గొట్టి చెట్ల కింద గడిపిన క్షణాలు,
స్నేహితులతో పంచుకున్న
ఆ 'ఒక్క' చాక్లెట్ ముక్క!
ఇప్పుడు లక్షలు ఖర్చు చేసినా
దొరకని అలౌకిక ఆనందం!

కాలం ఎంత వేగంగా గడిచిందో కదా..
మనం పెద్దవాళ్లమైపోయాం,
కానీ ఆ దారి మాత్రం ఇంకా మన మనసులో..
ఒక చెరగని సంతకంలా అలాగే ఉండిపోయింది!

ఒక్కసారి కళ్లు మూసుకుంటే..
ఇప్పటికీ ఆ స్కూలు గంట వినబడుతోంది,
ఆ మట్టి బాట పలకరిస్తోంది.. కానీ..
ఆ దారిలో నడిచే మన స్నేహితులు మాత్రం,
కాలపు ప్రవాహంలో ఎక్కడెక్కడో
ముసుగులు వేసుకున్న లోకంలో కలిసిపోయారు!

చిన్ననాటి ఈ జ్ఞాపకం
తిరిగి వెళ్లలేని కాలానికి
గుండె రాసుకున్న
అంతులేని ఓ చిరునామా!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
 

Thursday, March 26, 2026

నిశీధి కావ్యం...

 


సూరీడు నిదురోయే వేళ..
విశ్వం తన అసలైన ముఖాన్ని ఆవిష్కరిస్తుంది!
నల్లని కంబళి కప్పుకున్న పుడమి,
నక్షత్రాల ముత్యాలను తన శిగలో తురుముకుంది!
దూరంగా వినిపించే తుమ్మెద ఝంకారం..
నిశ్శబ్దపు వీణపై పలికిన ఆఖరి రాగంలా ఉంది!

ఆకాశమనే అనంతమైన నల్లని క్యాన్వాస్ పై,
చందమామ ఒక వెండి సిరా చుక్కలా రాలి,
వెన్నెలనే అక్షరాలతో రాత్రి కావ్యాన్ని మౌనంగా రచిస్తోంది!

మెరుస్తున్న ఆ తారకలు..
కాలపురుషుడి పాదాలకు తగిలిన మెరుపు మువ్వల్లా,
విశ్వపు నిశ్శబ్ద నృత్యంలో
లయబద్ధంగా నాట్యం చేస్తున్నాయి!

కొండకోనల మధ్య పారుతున్న ఆ సెలయేరును చూడు..
చీకటనే కారుమబ్బును చీల్చుకుంటూ
ఎంత సౌమ్యంగా పారుతోందో!
గాలికి ఊగుతున్న ఆ నిశ్శబ్ద అరణ్యాన్ని చూడు..
తనలోని రహస్యాలన్నీ బయటకు చెప్పలేక,
చీకటి పుస్తకంలో దాక్కున్న పురాతన శ్లోకాల్లా
ఎలా గుసగుసలాడుతోందో!

ప్రతి పువ్వురేకుపై వాలిన ఆ మంచు బిందువును చూడు..
ఆకాశం రాల్చిన ఓ ఆనంద బాష్పంలా ఎంత హుందాగా వుందో!
అర్థరాత్రి వేళ వినిపించే ఆ గూబ అరుపు చూడు
నిద్రపోతున్న లోకాన్ని మేల్కొలిపే,
ఒక అతీంద్రియ హెచ్చరికలా ధ్వనిస్తోందో!


ఈ నిశీధిలో..
ప్రకృతి తన ముసుగును తొలగించి,
ఒక నగ్న సత్యంలా మన ముందు నిలబడుతుంది!
దాన్ని మనం మనసుతో చూడగలగాలంతే!

ఇంటి ముంగిట నిలబడి చీకటినంతా చూస్తుంటే
రాత్రి అనేది భయానకంగా కనిపించొచ్చు, కానీ
రోజంతా అలసిపోయిన లోకానికి
ప్రకృతి పరచిన నిశీధి .. ఓ నిశ్శబ్దపు ఓదార్పు!
సృష్టి తనను తాను పునర్నిర్మించుకుంటున్న,
ఒక మహా మౌన దర్పణం!

పగలు.. మనిషి ముఖాన్ని చూపిస్తే,
రాత్రి .. అతని మనసును చూపిస్తుంది.
పగలు దాచిన బాధలు,
నవ్వుల్లో మునిగిన ఒంటరితనాలు,
మాటల మధ్య చనిపోని కలలు
ఇవన్నీ
రాత్రి ఒడిలోనే
తమ నిజస్వరూపాలతో మేల్కొంటాయి!
అందుకే
సూరీడు నిద్రపోయిన వేళ
ప్రకృతి నిద్రించదు...
తను మరింత మెలకువగా ఉంటుంది.
ప్రతి ఆకు పై తనదైన ఓ జ్ఞాపక సంతకం చేస్తుంది!

కళ్ళతో కాదబ్బా..
ఈ హడావిడి జీవితాన్ని కాస్త పక్కన పెట్టి..
మనసుతో చూడు..
నువ్వు చూసే ప్రతీ ఫ్రేమ్ లో ఓ అందం!
నువ్వు ఆస్వాదించే ప్రతీ శ్వాసలో ఓ అద్బుతం దాగుంటుంది!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Wednesday, March 25, 2026

బామ్మ ...


ఇంటి ముంగిట నిలిచిన
పాత తులసిచెట్టు ఆమె!

ఎన్ని వసంతాలు గడిచాయో,
ఎన్ని అవరోధాలను దాటిందో
ఆమె చర్మపు ముడతలే చెబుతాయి!

మన ఇంటికి ఇంకా ఊపిరి మిగిలి వుందంటే
అది ఆమె వల్లే అనిపించే
ఒక మౌనపు ఆశీర్వాదమే బామ్మ!

ఆమె చేతులు చూశావా ఎప్పుడైనా?
కాలం ఎన్నిసార్లు వాటి మీద నడిచి వెళ్లిందో,
ఆ రేఖలు చెబుతాయి!
కానీ చిత్రమేమిటంటే
ఆ చేతులు వణికినా
వాటిలోని మమత మాత్రం
ఎప్పుడూ వణకదు!

అల్మారాలో
అపురూపంగా దాచుకున్న పాత పుస్తకంలా..
ఆమె మౌనం ఎన్నో రహస్యాలను మోస్తుంటుంది.
మనం పరుగు తీస్తున్న ఈ యాంత్రిక లోకంలో..
ఆమె మాత్రం, ఒక నిలకడైన సముద్రంలా,
మన ఆవేదనలన్నింటినీ
తన ఒడి అనే రేవులో నిశ్శబ్దంగా సేదతీరుస్తుంటుంది!

ఆమె కథలు చెప్పడం మొదలెడితే
రాత్రి కూడా కన్ను ఆర్పకుండా వింటుంది.
ఆమె చెప్పే కథల్లో..
కేవలం రాజులు, రాణులు ఉండరు,
కనుమరుగైపోతున్న మానవీయత ఉంటుంది!
ఆమె నవ్వు..
శిశిరంలో రాలిన ఆకులా సున్నితంగా ఉన్నా,
అందులో ఒక వసంతపు ఓదార్పు
ఎప్పుడూ దాగే ఉంటుంది!

ఆమె ఎక్కువగా చదవకపోవచ్చు,
ప్రపంచమంతా చూడలేకపోవచ్చు,
కానీ మనుషుల్ని మాత్రం చాలా లోతుగా చదివేస్తుంది!
ఎవరూ చెప్పకపోయినా
మన బాధను ముందే గుర్తించే కళ్లవి!
ఏమైంది రా? అని అడిగే ముందు నుంచే
మన మౌనంలోని బాధను మొదట చూసే కళ్లవి!

ఆమె మందలింపుల్లో కూడా ప్రేమే ఎక్కువ..
“జాగ్రత్త” అన్న ఓ మాటలో,
చాలా జీవితం దాగి ఉంటుంది!
“తిన్నావా?” అన్న ప్రశ్నలో,
ఆమె ఆత్మంతా దాగి ఉంటుంది!
మనకి అవి చిన్న మాటల్లా అనిపించొచ్చు,
కానీ నిజానికి
ఆ ప్రశ్నలే మనల్ని మనుషులుగా నిలబెట్టే
చివరి మజిలీలు!

ఆమె
మరణం వైపు సాగుతున్న
ఒక ముగింపు కాదు!
మన మూలాల నుండి చిగురిస్తున్న
ఒక అమరత్వపు సంతకం!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==