Tuesday, February 6, 2018

సమాజంలో అందరి పరిస్థితి మారుతుంది.. మెరుగుపడుతుంది ఒక్కరిది తప్ప..



సమాజంలో అందరి పరిస్థితి మారుతుంది.. మెరుగుపడుతుంది ఒక్కరిది తప్ప.. 

(దయచేసి కాస్త సమయం తీసుకొని ఈ ఆర్టికల్ చదివేందుకు ప్రయత్నించండి.. )

ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఇలా రాసివుంది.. ఇద్దరు అన్నదమ్ములు అట 1. సీతన్న, 2. వెంకన్న ఆస్తి అంతా ఇద్దరూ చెరిసగం చేసుకున్నారంట .. వారికి ఒక విధవ ఆడపడుచు వుంది అంతే కాదు వారు పంచుకున్న ఆస్తులు సమానంగా పోను ఒక ఎకరా పొలం మిగిలింది.. పొలమును మరియు విధవ ఆడపడుచు ఈ రెండిటిని కూడా ఇద్దరూ తీసుకోవాలి అనే నిర్ణయాన్ని నమోదు చేసి ఉంటాడు వారి తండ్రి వీలునామాలో.. పొలం కావాలని కొట్టు కుంటారేమో అని అందరూ అనుకున్నారు..కాని ఆశ్చర్యంగా వారు ఆమె కావాలని కొట్టుకున్నారు.. 
విషయం ఏంటంటే ?
పొలం మీద పంట మాత్రమే వస్తుంది.. ఆమెను ఇంటికి తీసుకువెళ్తే వారి ఖర్చు తగ్గుతుంది.. ఆడమనిషి కాబట్టి బ్రతికినంతకాలం మా కుటుంబానికి చాకిరీ చేస్తుంది .. పైగా అట్లు పోసి అమ్మి రాబడి కూడా తెచ్చి ఇస్తుంది అని సమాధానం చెప్పారంట.. వారి దూర దృష్టికి నిజంగానే నేను విస్తుపోయాను..


రక్షణ లేని ఆమెపై అందరికీ హక్కువుంటుంది.. అందరూ ఆమెను వాడుకోవాలని చూసేవాల్లే .. కాని ఆమె అభివృద్దిని కోరే వారే అరుదవుతారు.. ఆమె శ్రేయస్సు పై కాని, ఆమె ఇష్టాఇష్టాలపై గాని ఏ ఒక్కరికి శ్రద్ద వుండదు.. ఆఖరికి కన్న తల్లితండ్రులకు, రక్త సంబంధీకులకు కూడా భారం అవుతుంది ఈమె.. అత్త మామలు, అన్నదమ్ములు, వదినెలు ఆమెను వేరు పురుగుగా చూస్తారు.. బావలు, మరుదులు ఆమె వారసత్వాన్ని ఎలా భంగ పరుద్దామా అని ఆలోచిస్తారు.. చదువుకుందామా అంటే చదివించే నాధుడే వుండడు .. పోనీ పెళ్ళాడుదామా అంటే మళ్ళీ పెళ్ళా !!! అంటూ అసహ్యంగా చూస్తారు.. వయస్సు మళ్ళిన మగవారు సైతం కన్నెలనే కోరుతారు ..కాని భర్తృవిహీనలంటే అతి నీచంగా చూస్తారు.. వైధవ్యం ఆమె కోరుకున్న వరం కాదు అని అందరికీ తెలిసిన విషయమే కదా.. కావాలని తెచ్చుకున్న దోషం అంతకన్నా కాదు.. అది ఆమెపై అనుకోని ఆశ నిఘాతంగా వచ్చిపడ్డ మహోపద్రవం ... 


ఈ సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. మరెన్నో సమస్యలు తీరుతున్నాయి.. ఇంకెన్నో మరబోతున్నాయి.. కాని మారని సమస్య మన విధవరాండ్రదే ... వారి వేష భాషల్లో కొంచం మార్పు వచ్చినా జీవిత విధానంలో ఏ మార్పు రాకపోవటం శోచనీయం .. వారు ఇటు పుట్టింటి వారికి, అత్తింటి వారికి కూడా బరువే.. 
అది చాలక “తల చెడ్డ దానికి భోగభాగ్యాలెందుకు పడివుండక” అంటూ ఈసడిస్తుంది ఈ సమాజం.. 
“పూర్వ జన్మ పాప ఫలం వల్ల ఇలాంటి దశ వచ్చింది “ అంటారు తోటి స్త్రీలు.. 
“చేసుకున్నవారికి చేసుకున్నంత, అనుభవించక తప్పుతుందా ? 
ఏనాడో ఏ పచ్చని కాపురంలో నిప్పులు పోసి వుంటుంది అనుభవిస్తుంది మనమేం చేస్తాం “ అంటూ దెప్పిపొడుస్తారు తోబుట్టువులు.. 
“ నా పాప ఫలం” అంటాడు తండ్రి.. 
“ నా తలరాత వల్లనే దాన్ని కన్నాను కాని దాని అదృష్టాన్ని కనగలనా “ దానితో పాటు నేను అనుభవించక తప్పుతుందా అంటూ వాపోతుంది ఆమె తల్లి.. 


నెత్తిమీద గుడ్డ ఆ దేముడే తొలగించినప్పుడు, నుదుటి వ్రాత అలా రాసినప్పుడు అనుభవించక తప్పుతుందా.. ఇలా అందరికీ లోకువై, అందరిచేతా ఈసడింపబడుతూ ఎడారిలాంటి జీవితాన్ని సాగిస్తుంది ఆ అభాగ్యురాలు.. 


ఏ నేరం లేకుండా, ఏ తప్పూ చెయ్యకుండా శిక్ష అనుభవించేది ఎవరయ్యా అంటే విధవాడబడుచు అని రూఢీగా చెప్పవచ్చు.. 
అంతే కాదు ఒక చెంప జీవితంలో తీరని నష్టాన్ని పొంది బ్రతుకులో భారంతో గడుపుతున్న ఆమెపై జాలిలేక పోగా దయ, కరుణ చూపకపోగా దెప్పిపొడవటంలో న్యాయమేమిటో అర్ధం కావట్లేదు.. అందరికీ చాకిరీ చేస్తూ అందరికీ లోకువగా బ్రతకటమే ఆమె జీవిత ధ్యేయం, పరమావధి అవుతుంది.. 


ఇక పిల్లలున్న తల్లి, ఆస్తిలేని తల్లి, ఉద్యోగార్హత లేని తల్లి అయితే ఆమె కష్టాలు చెప్పలేనివిగా వుంటాయి.. ఇంటిపని, పిల్లల పని, వారి పోషణా భారం అనంతంగా వుంటుంది.. వారి చదువు, ఆరోగ్యం లాంటివి అనుక్షణం ఆమెను వేదిస్తూనే వుంటాయి.. అష్ట కష్టాలు పడి పెంచిన ఆ పిల్లలు పెద్దవారయ్యాక పెళ్లి అయ్యాక ఆమెకు ఇంత తిండీ, గుడ్డా కూడా ఇవ్వరు.. తండ్రి ఆస్తికి మాత్రం వారసులు అవుతారు.. 


“విడో” కాగానే ఆమె పరిస్థితులు తారుమారు అవుతాయి.. కొన్ని విధులు, బాధ్యతలు ఆమెకై కేటాయించబడతాయి .. ఎదురువస్తే “అపశకునం” అంటారు.. శుభకార్యాలలో పాల్గొనరాదు అంటారు.. తన బిడ్డ పెళ్లి కూడా తను దూరంగా వుండి చూడాలి.. ఇలా ఎన్నో ఎన్నెన్నో..


ఇవన్నీ మనసులో పెట్టుకొని వారికోసం ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ వున్నాను.. 
స్త్రీలకు కేటాయించిన ఉద్యోగాల్లో వితంతువులకు యాభై శాతం కేటాయిస్తే బాగుండు.. 
అలాగే వృత్తి, విద్యల్లో వారికి ముందుగా అవకాశం కల్పించాలి.. 
వయోపరిమితిని అధిగమించి వారికి ప్రత్యేక సదుపాయాలు కలిగించాలి.. 
యువకులు, విద్యార్ధులు చైతన్య వంతులై అలాంటి వారికి వివాహం చేసేందుకు ముందుకు రావాలి.. 
తోటి స్త్రీలు వారిని ఉద్దరించడానికి తోడ్పడాలి.. 
అలా సర్వులూ వారికి చేయూత నిచ్చిన నాడే వారు స్వతంత్రులు కాగలరు..


ఎన్ని చేసినా, మరిన్ని చేసినా వితంతువులు సైతం తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుకోవడానికి సర్వవిధాలా ప్రయత్నించాలి.. ఆనాడే వారి సమస్యలు సమసి పోగలవు..


ఒక్కరి హృదిలో అయినా ఈ ఆలోచన వస్తే బాగుండు..


స్వస్తి __/\__

Written by : Bobby Nani

No comments:

Post a Comment