Thursday, February 8, 2018

“దాశరథి కృష్ణమాచార్య”



నిన్న నేను వ్రాసిన “నేనే చీకటైతే .. వెలుగు నా ప్రేయసి..” అనే శీర్షికలొ “దాశరథి గారంటే నాకు చాలా ఇష్టం..” అని నేను ఉదహరించిన విషయాన్ని గురించి కొందరు ఆత్మీయ మిత్రులు నాతో సంభాషించారు.. 
అసలు మీకు దాశరథి గారి గురించి ఏం తెలుసు?? వివరించండి ?? అంటూ కొందరు.. 
దాశరథి గారు ఎవరు ?? అంటూ మరికొందరు 
దాశరథి గారు రచించిన ఏ ఏ పుస్తకాలు మీరు చదివారు ??
మిమ్మల్ని ఆయనలా ప్రభావితం చేసిన రచనలు ఏవి ?? అంటూ అనేకానేక ప్రశ్నల వర్షం రాత్రంత్రా కురుస్తూనే ఉంది.. నేను మాత్రం ఆ వర్షంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వపు నృత్యం చేస్తూ గప్చిప్ గా ఊరుకున్నాను.. అక్కడ ఊరుకున్నది ఇక్కడ వివరణ ఇవ్వడానికేనని కొందరి మిత్రుల ప్రఘాడ విశ్వాసం... !!

వారి విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈ చిరు వివరణ ఇవ్వదలచాను.. 

“దాశరథి కృష్ణమాచార్య” తెలంగాణా బిడ్డ.. వరంగల్ లో జన్మించారు .. తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు.. దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని గర్వంగా ప్రకటించి ఉద్యమానికి ఊపును, ప్రేరణనందించిన మహాకవి దాశరథి... 

ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భావాలను అందుకోవడం, దర్శించడం అసాధ్యం.. ఉదాహరణకు కొన్ని చెప్తాను .. 
తెలంగాణా ఉద్యమ సమయంలో “పోలీసు స్టేషన్” నుంచి తప్పించుకుని పారిపోతున్నప్పుడు కూడా మంచినీళ్ళు అడిగితే ఆప్యాయంగా ముంతతో నీళ్ళు అందించిన రైతు పిల్ల వయ్యారం, ఆమె కళ్ళలోని అమాయకత నన్ను మైమరిపించాయని దాశరథి గారు చెప్పారు.. హృదిలో ఎన్ని ఆలోచనలు సుడులు తిరుగుతున్నా కూడా చూసిన ప్రతీ దానిలో సౌందర్యాన్ని కనుగొనడం ఆయనకే సాధ్యం.. అందరిలా కాకుండా విభిన్నమైన కోణంలో తన రచనలను గావించారు అందుకే ఆయన అందరిలా కాకుండా ప్రత్యేకమైన వారిగా నిలిచిపోయారు..

నిజామాబాదు జైల్లో కిటికీలోంచి చూస్తే బయటి మామిడి కొమ్మ చిగిర్చి, పూలు పూసున్న రీతిని చూస్తే లక్ష ఉగాదులు ఒక్కసారి హృదయంలో దూకినట్లుండేది అని ఆయన అన్నారు.. ప్రకృతి సౌందర్యం, ప్రణయ భావన తన విప్లవ భావాలకు ఆటంకం కాలేదంటాడు.. ఆయన రచించిన కావ్యాలన్నింటిలో భావకవిత్వం ఉంది.. 

దాశరథికి ఉషస్సులొ, వసంతంలో, శరత్తులో అన్నిటా ప్రేయసే కనిపిస్తుంది.. వసంత ఋతువుల్లో ముఖ్యంగా మనోహరమైన ప్రణయ భావాలను ఆయన రచించారు.. 

దాశరథి రచించిన కవితా ఖండికలలో “రాగబంధం” విశిష్టమైనది.. మహాంధ్ర మూర్తిని ఒక ప్రేయసిగా చేసుకొని, తనని ప్రియునిగా ఆరోపన చేసుకొని రచించిన కవిత “రాగబంధం”

నిజానికి దాశరథి గారికి తెలుగు రాష్ట్రాలు విడిపోవడం అస్సలు ఇష్టం లేదు.. అందుకే “మహాంధ్రోదయ గీతి” అని “సమైఖ్యాంధ్ర సౌభాగ్యగీతి” అని పదే పదే తన అభిమానాన్ని వ్యక్తీ కరిస్తూ ఉంటాయి.. 

తెలంగాణలో ఎటు చూసినా వేప మాకులు, పూల తోటలు, మామిడి తోటలు సంపంగి, సన్నజాజి తోపులు వంటివన్నీ నిరంతరం తెలంగాణా ప్రాంతమంతా వ్యాపించి హాసిస్తున్నట్లుగా, ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటాయి.. దాశరథికి ఇవంతా ఒక కొత్త సౌందర్యంలాగా కనిపించింది.. ఒక ప్రక్క తోటలకు నీళ్ళు పెట్టే మహిళలు, ఇంటి ముంగిట రంగ వల్లికలు, పూల గొబ్బిల్లు, కల్లాపి దృశ్యాలు ఇలా తెలంగాణా సుందరి ఎంత బాగా ఉందో అంటూ వర్ణించారు.. 

అలానే రాయలసీమలో కూడా ప్రాంతం చిన్నదైనా (కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం) నాలుగు ప్రాంతాలలో కలిసి ఒక రాయలసీమ ప్రాంతాన్ని ఆనాటి రాయల వైభవాన్నే పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది.. అందుచేత లేపాక్షిలో ఆనాటి కట్టడాలు, పెనుగొండలోని గగన మహలు దృశ్యాలు, తిమ్మరుసు నాటిన స్తంభం, జైన దేవాలయాలు, తిమ్మరుసు సమాధి, అప్పటి కవితా పుటలను అన్నిటినీ స్మరిస్తే ఒక రాయలసీమ. అందుచేత ఇక్కడ కూడా నదులు, వంకలు, వాగులు, సెలయేళ్ళు ప్రత్యేకించి పంట పైరులు అడుగడుగునా అందాలను విరజిమ్మే పూలతోటలు, కొబ్బరి తోటలు, గున్నమావి గుబుర్లు, చీనీ తోటలు, వేప చెట్ల విలాసాలు, ఓహో.. ఎన్నెన్ని రాయలసీమ సౌందర్యం, పరమ రమ్యంగా అనిపిస్తుంది.. అందుచేత ఏ కవైనా ఆకర్షింప బడటం ఆశ్చర్యమేమీ కాదు.. దాశరథి గారు ఇలాంటి రాయలసీమ సౌందర్యాన్ని బాహిరంగా సందర్శించారు.. 

ఇక పోతే నా కోస్తా ప్రాంత సౌందర్యం గురించి చెప్పనక్కరలేదు.. ఆధునిక కవులు పేర్కొన్నట్లు ఈ మహాంధ్ర దేశానికి మరకత మణి ఏదంటే ఒక్క కొనసీమే.. ఇంక గోదావరి, కృష్ణ, పెన్నా, తూర్పు వైపైతే మంజీర, వంశధార, ప్రాణహిత నదులు ఎటు చూసినా పొటమరించే వరి మళ్ళు, మైళ్ళ తరబడి విస్తరించిన దోస తోటలు, కొబ్బరి తోపులు, మామిడి చెట్ల సౌందర్యం చెప్పనలవి కాదు.. వేప చెట్ల సౌందర్యాన్ని అయితే దాశరథి గారు విజృంభించి వర్ణిస్తాడు.. 

అంతే కాకుండా కోస్తా ప్రాంతం కళాకారులెందరికో నిలయం.. సంగీత సాహిత్యాలకు ఆలవాలం.. నదీ నదాలకు ఆ ప్రాంతమే ఆటపట్టు.. ఇలా పేర్కొంటూ పోతే కోస్తా ప్రాంత సుందరి నిస్సందేహంగా చిరు యవ్వని.. అందుచేత సాధారణ ప్రజలకు సైతం ఆకర్షణ కలిగిస్తుంది.. ఇక దాశరథి గారికి కోనసీమ ప్రాంతమంటే గుండెల్లో సందడి.. ఆ ప్రాంత సుందరిని వర్ణిస్తే కాని హాయి ఉండదని ఆయన పేర్కొన్నారు.. 

ఇక పోతే ఆయన రచనలు గురించి.. “మహాంధ్రోదయము” లో చాలావరకు దేశీయాభిమానం, ప్రకృతి, తెలంగాణా విముక్తి ఇలాంటివే కనిపిస్తాయి తప్ప ప్రత్యేకంగా వర్ణించబడిన ప్రణయ ఘట్టం కానరాదు.. 

చాలామంది కవులు ప్రకృతిని కేవలం ప్రకృతి గానే వర్ణించారు.. అలాంటి సందర్భంలో సామాన్య మానవులకు అలాంటి కవులకు చెప్పుకోదగ్గ తేడా కనిపించదు.. దృశ్య వస్తువు వీలైనంత వరకు అంతర్నేత్రముతో చూడగానే అది పలు విధాలుగా కనిపించాలి.. ఆ నది ఒక కాంతగా అతని కవితా నేత్రానికి కనిపించింది.. 
“ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర!
ఎవరి కజ్జల భాష్పధారవే ! మంజీర !
నీవు పారి దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృత భాండాలు”

విశ్వనాథకు “కిన్నెర” ఎలా రవళిస్తుందో అలానే దాశరథిగారికి “మంజీర” ప్రవహిస్తున్నంత వరకు మంజీర రవళి మ్రోగుతూనే ఉంటుంది.. మంజీర నదిని, నారీమణిగా, సాధ్వుమూర్తిగా, ప్రేమ భావంగా, పరోపకారిణిగా ఇలా రకరకాలుగా ఉల్లేఖిస్తూ వర్ణించాడు..

అలాగే “పౌష లక్ష్మి” అన్న ఖండికలో సంక్రాంతి సంబరాలు అద్బుతంగా వర్ణించారు.. 
“మధురి” అన్న ఖండికలో ఉగాదిని తన ప్రేయసిగా వర్ణించారు.. 
దాశరథి గారి దృష్టిలో ఆ లేత గాలే నాట్యం చేసే ప్రియురాలు.. జీరాడే చీర అని చెప్పడం వల్ల ఆకులు రాలే దృశ్యం స్పురిస్తుంది.. పక్షుల కిల కిల రావాలను శాంత వసంత బాష గా మునుపే చెప్పారు... ఇలా దాశరథి కి అనిపించే ప్రతీ దృశ్యం కూడా ప్రణయ దృశ్యంగా కనిపిస్తుంది అని అనడంలో సందేహం లేదు.. 
ఇలా ఒకటా రెండా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. !!

మిత్రుల కోరిక మేరకు ముఖ్యమైన విషయాలను రాయడం జరిగింది.. అది కాస్త ఇలా ఇంత పెద్దదిగా అయిపోయింది.. అందుకు క్షంతవ్యుడను.. __/\__

Written by : Bobby Nani

No comments:

Post a Comment