Friday, September 30, 2016

వివాహబంధం...


వివాహబంధం అనేది చాలా పవిత్రమైన బంధం.. పూర్వకాలంలో ఐదురోజుల పెళ్ళిళ్ళు, మూడురోజుల పెళ్ళిళ్ళు చేసేవారు.. ఇప్పుడు ఒక్కరోజు పెళ్లికే ఎంతో ప్రయాస పడుతున్నారు.. ఒక్క గంటలో అన్నీ తతంగాలు జరిపేస్తున్నారు.. పురోహితుడు చెప్పే హిందూ వివాహ మంత్రాలలో ఎంతో అర్ధం దాగి ఉంది .. 

ముఖ్యంగా కన్యాదాన సమయంలో, కన్యాదాత వరునితో

“కన్యాం కనక సపన్నాం కనకాభరణభూషితాం దాస్యామి విప్లవేతుభ్యం బ్రహ్మలోక జిగీషియా” అని అంటారు... దానికర్ధం ఏమంటే – నేను బ్రహ్మలోకం సాధించడం కోసం, సువర్ణ ఆభరణములచే అలంకరింపబడ్డది అయిన కన్యను, విష్ణు స్వరూపుడైన నీకు ఇస్తున్నాను అని.. 

తరువాత 

“విశ్వంభరః సర్వభూతాః కన్యాం ఇమాం ప్రదాస్యామి పిత్రూణా తారణాయవై”

దీనిభావం ఏమంటే : నా పితురులు తరించుటకు ఈ కన్యను దానము చేస్తున్నాను. పంచభూతాలు, సమస్త దేవతలు, ఇందుకు సాక్షులు అంటూ 

“కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే, ప్రత్యాహం ప్రయచ్చామి ధర్మకామార్ధ సిద్ధయే” 

అలంకారాలతో కూడి సాధుశీలవతి అయిన ఈ కన్యను, ధర్మ కామార్ధ సిద్దికొరకై సుశీలుడు, బుద్ధిమంతుడు అగు నీకు దానము చేయుచున్నాను .. అంటూ వధువు, వరుల ముత్తాతలనుండి వాళ్ళ గోత్రాలతో ప్రవర చెప్తారు.. వరుని చేతిలో నీటిని ధారగా వదులుతూ, కన్యని వరుని చేతిలో ఉంచి మంత్రాలు వల్లిస్తారు.. వరుడు నాతి చరామి అంటాడు.. అనగా ఈమె మాటను నేను అతిక్రమించను అని అర్ధం.. 

సంస్కృత భాషలో ఎంతో అర్ధాలను పొదగబడిన ఈ వివాహబంధం విడాకుల వరకు వెళ్తున్నాయంటే మనకు ఏంటో ఆశ్చర్యమనిపిస్తుంది.. ఈ బంధాన్ని ఎప్పటికీ, నిర్లక్ష్యం చేయకూడదు.. 

దంపతులిద్దరూ కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ విశాలదృక్పథం కలిగి ఉండాలి.. భర్త తన అనురాగం భార్యకు పంచాలి.. అదేవిధంగా భార్యకూడా తన ప్రేమను భర్తకు అందిస్తూ కష్టసుఖాలు పంచుకుంటూ, క్షణిక ఉద్రేకాలకు లోనుగాకుండా, పరస్పర అవగాహనతో మసలుకోవాలి .. 

నా మనసు నిండా నీవే ఉన్నావు సుమా .. అని భర్త భార్యతో అంటే, ఆమె ఎంతో సంతోషించి తృప్తిగా తన సంతోషాన్ని మరో రూపంలో తెల్పుతుంది.. ఈ చిన్న మాటను అనడానికి భర్తకు అహం నేటి కాలం దంపతులలో.. వివాహ బంధాల్ని గౌరవించండి.. 

స్వస్తి ___/\___

Bobby Nani

1 comment:

  1. వివాహమంత్రాలు మీరు కాస్త తప్పుగా రాశారు ఈ వ్యాసంలో ...

    కన్యాదానం అప్పుడు వధువుతండ్రి

    "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషియా" అని అంటాడు...మీరు " దాస్యామి విప్లవేతుభ్యం బ్రహ్మలోక జిగీషియా " అని తప్పుగా ప్రకటించారు..

    అలాగే " “ విశ్వంభర స్సర్వభూతా స్సాక్షిణ్య స్సర్వదేవతాః | ఇమాం కన్యాం ప్రదాస్యామి పిత్రూణాం తారణాయవై ||

    కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే, ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్ధ సిద్ధయే || అని మంత్రం ఉంటుంది...మీరు ఇదికూడా పొరబడి తప్పుగా రాశారు..

    సరిచెయ్యగలరు :)

    ReplyDelete