Friday, March 30, 2018

సాహిత్యంలో స్త్రీ పాత్ర.. మరో కోణంలో నా చిరు వివరణ..


సాహిత్యంలో స్త్రీ పాత్ర.. మరో కోణంలో నా చిరు వివరణ.. 
***************************************


మన సాహిత్యం చాలా గొప్పది .. కానీ కొందరు కవుల వల్ల ఆ సాహిత్యం అంగడిలో ఆటవస్తువు అయింది.. అశ్లీలత, విశృంఖలత్వాన్ని వారు ప్రోత్సహించారు.. శృంగార రసాన్ని మితిమీరి చిందించారు.. అయినా వారు గొప్పవారే, వారి సాహిత్యం గొప్పదే.. ఎందుకో నాకైతే కొంచం ఎబ్బేట్టుగా అనిపించింది.. శృంగార వర్ణన చెయ్యడం నాకూ ఇష్టమే.. కానీ దానికి నాకంటూ హద్దులు ఉన్నాయి.. మనకు ఏదైనా ఇష్టం ఉంటే దాన్ని పదే పదే చేస్తూనే ఉంటే ఒకానొక సందర్భంలో దీనికోసమా మనం ఇంత ఇష్టాన్ని పెంచుకుంది అనే భావన తలెత్తుతుంది. అది జరగకుండా ఉండాలంటే ఏదైనా హద్దులలో వుండాలన్నది నా ఉద్దేశం.. మన ప్రాచీన సాహిత్య గ్రంధాలను చదివాక వాటిల్లో ముఖ్యమైనవి నచ్చినవి, నచ్చనివి రెండూ రాస్తున్నాను.. ఇకా చాలా రాయాలనుకున్నాను.. కానీ సమయమూ, సందర్భమూ రెండూ అనుకూలించలేదు.. నా వయస్సు వారు కాకపోయినా పెద్ద వయస్కుల వారు ఈ వ్యాసాన్ని తప్పక చదువుతారనే నమ్మకం ఉంది.. చదివి మీ అభిప్రాయాలు వెలిబుచ్చాలని కోరుకుంటూ.. __/\__


ప్రాచీన హిందూ సంస్కృతికి మూల పురుషుడైన మనువు సృష్టికి మూలవిరాట్టు అయిన స్త్రీని ఒక వ్యక్తిగా చూడలేకపోయాడు.. “అసత్యం అంత చెడ్డది స్త్రీ అని అంటాడు”.. మనువు వంటి బుద్ది తక్కువవాడు ఈ సృష్టిలో మరొకడు లేడనుకుంటాను .. హిందూ సంస్కృతికి మూల పురుషుడని చెప్పుకోవడం మన దురదృష్టకరం.. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్దాప్యంలో కొడుకుల సంరక్షణలో స్త్రీ ఉండాలే కాని స్వేచ్చా స్వతంత్రాలతో హాయిగా, ఆనందంగా, ఒక వ్యక్తిగా జీవించడానికి వీలులేదని శాసించాడు.. ఇంతకన్నా తెలివైన మూర్ఖుడు మన సమాజంలో వుండడనుకుంటాను .. మనువును ప్రాచీన హిందూ సంస్కృతికి ఆద్యుడు, ఆరాధ్యుడని చెప్పుకోవడం, మనుస్మృతిని భారతీయ ధర్మ శాస్త్రంగా కొనియాడటం మన జాతికే తగును.. 


మన గ్రంధాలు స్త్రీ లోని ఉత్తమ గుణాల్ని కీర్తిస్తూ, స్త్రీ ని గౌరవించాలని పేర్కొంటూ కట్టుబానిసలుగా తయారుచేసాయి.. 


పురాణ సాహిత్యమంతా స్త్రీలు ఇష్టపూర్వకంగా బానిసత్వాన్ని వరించే పద్దతిని భోదించింది.. పాతివ్రత్యానికి, పవిత్రతకు, స్వామి భక్తికీ, నాటి స్త్రీ ప్రతీక అయింది.. నల దమయంతులు, సీతారాములు, సావిత్రీ, సత్యవతుల కథల్లో స్త్రీ భర్త యెడల విధేయతతో ప్రవర్తించాలని, త్యాగం చెయ్యాలని నాటి సాహిత్యం నిర్దేశించింది.. నాటినుంచి దమయంతి, సావిత్రి, సుమతి, అహల్య ఆదర్శ మహిళలుగా పొగుడుతున్నారు.. పతివ్రతగా మాత్రమే ఆనాటి స్త్రీ కి వ్యక్తిత్వముండేది.. అగ్నిలో దూకమంటే దూకింది.. భర్త ఆజ్ఞాపిస్తే కొడుకును చంపబడింది.. భర్తను వేశ్య వద్దకు మోసుకెళ్ళింది.. పంచభర్తృక అయింది పాంచాలి.. భర్త కోసం గ్రుడ్డిగా జీవించింది గాంధారి.. భర్త కామంకోసం శర్మిష్ట కన్యగా జీవితాంతం బ్రతికింది.. సతిగా నాటి స్త్రీ సహగమనం చేసింది.. ఇలా వందల వేల సంఖ్యలో పతివ్రతలుగా పేరుపొందిన ఆదర్శ మహిళలు ఉన్నారు.. అసలు స్త్రీ కి పతి సేవ తప్ప ఏ కోరికా ఉండరాదనే పవిత్ర ధర్మమైంది.. సతీ సహగమన కాలమునకు పూర్వము నుంచి నేటి వరకు నలిగేది, నలుగుతున్నది స్త్రీ మాత్రమే..


ప్రాచీనాంద్ర కావ్య సాహిత్యంలో స్త్రీ పతివ్రతగా, శీలవతిగా, గుణవతిగా చిత్రీకరించబడింది.. ప్రభంధ యుగం వచ్చేసరికి కవులు స్త్రీ ని ఆటవస్తువునిగా, అంగడి బొమ్మగా చిత్రించారు.. ఈ యుగం నాటి కవులు రాజుల్ని ఆశ్రయించి వారి అభిరుచులకు అనుగుణంగా అడుగులకు మడుగులొత్తుతూ తమ కావ్యాలను కడురమణీయంగా వ్రాశారు.. ఈ యుగంలో కవులందరూ ఇదే పని చేసారు.. ఎంతసేపూ రాజును, వాళ్ళ ప్రియురాళ్ళను గోరంతల్ని కొండంతగా చేసి భూతద్దంలో చూసి కీర్తిస్తూ అక్షర భజన చేయడమే వీరి పనిగా మారింది.. తమ రాజ్యాన్ని, తమ ప్రియ రాండ్రల్ని ప్రశంసలతో ఎత్తి ముంచెత్తిన వారికే కనకాంబరాలు ఇచ్చి గండపెండేరాలు తొడిగి ఘనంగా సత్కరించి గొప్ప కవులుగా పరిగణించారు.. స్త్రీ ని నఖశిఖ పర్యంతం అంగాంగ వర్ణనల్ని చేస్తూ అతిగా వర్ణిస్తూస్త్రీ ని శల్య పరీక్ష చెయ్యడానికి ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.. 


ప్రముఖ విమర్శాగ్రేశ్వరుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు ప్రబంధ సాహిత్యంలోని స్త్రీ గురించి వ్రాస్తూ ఇలా అన్నారు.. “నాయిక వివాహానంతరం ఆమె చెలికత్తెలైనా తమ చెలిని శోభనపు గది తలుపుల చెంత వదులుతారేమో కాని, కవి మాత్రం అరక్షణం కూడా ఆమెను వదలడానికి అంగీకరించడని” చెప్పారు.. ఇది నూటికి నూరుపాళ్ళు పచ్చి నిజం.. కవులకే స్వేచ్చా, స్వతంత్రాలు లేనప్పుడు స్త్రీ లకు ఎలా ఉంటుంది.. 


తిమ్మన గారు స్త్రీ హృదయం ఎరిగిన వారు స్త్రీ సహజ గుణాలను, కోపతాపాలను, ఈర్ష్యాసూయలద్వేషాలను తిమ్మన గారు తప్ప మరెవ్వరూ వ్రాయలేరేమో.. తిమ్మన గారు స్త్రీ పక్షపాతి.. తెలుగువారికి అత్యంత ప్రియమైన నాయిక సత్యభామను మొదటిసారిగా కావ్య రంగ ప్రవేశం చేయించిన కీర్తి తిమ్మన గారికే దక్కుతుంది.. పురాణంలోని సత్యభామకంటే కావ్యంలోని సత్యభామే రమ్యాతి రమ్యంగా చిత్రించబడింది.. స్త్రీ సహజ గుణాలను కాచి, వడపోచిన సంపూర్ణ స్త్రీ మూర్తి సత్య భామ.. సత్యలో సహజ సౌందర్యం, సహజమైన స్త్రీ మనస్తత్వం, రసిక ప్రియత్వం, కొంటె చిలిపితనం కొట్టి వచ్చేటట్లు కనబడతాయి.. ఆత్మాభిమానం పేరుతో అడుగడుగునా అలకపాన్పు ఎక్కుతూ అనుకున్న పని సాధించిన నారీ శిరోమణి సత్యభామ.. 


చేమకూర వెంకట కవి గారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఉలూచి, చిత్రాంగద, సుభద్రలు మువ్వురు నాయికలు కామశాస్త్ర సూత్రాలకు ప్రతీకలని చెప్పవచ్చు.. విచారకరం ఏంటంటే స్త్రీ లు రాసిన కావ్యాలలోనే ఎక్కువ శృంగారం చోటు చేసుకోవడం ఉదాహరణకు ముద్దుపళని, రాధికా స్వాంతనంలో పచ్చి శృంగారం పరాకాష్టకు చేరుతుంది.. 


శీలవతి, గుణవతి, సంస్కారవతి అయినా స్త్రీ ని వేమన గారు పవిత్ర భావనతో చూశారు.. దుశ్యీల వతుల్ని, గయ్యాళితనాన్ని దుయ్యపట్టడంలో ఏ మాత్రం వెనుకంజ వెయ్యలేదు.. సుగుణవంతురాలు భార్య ఉన్నప్పుడు గృహమే స్వర్గసీమగా ఆదర్శ దంపత్యసుఖాన్ని అందించు ఇల్లాలే ఇంటికి జ్యోతిగా భావించాడు వేమన .. 


ఆంద్ర సాహిత్యంలో స్త్రీ జనోద్దరణకు మొట్టమొదట దీక్షా కంకణం కట్టుకొన్న మహోన్నత మూర్తి కందుకూరి గారు.. వారు స్త్రీ అభివృద్దిని కాంక్షిస్తూ ప్రత్యేకంగా స్త్రీ లకోసం పత్రికలు స్థాపించారు.. “సత్యవతీ చరిత్ర” నవలను స్త్రీల కోసం వ్రాశారు .. “స్త్రీలను పురుషులతో సమానంగా గౌరవించుచున్నంత కాలమును మనదేశమెంతో యున్నత స్థితి యందే యుండినది .. అట్లు గౌరవించుట మాని విద్య చెప్పించుట వదిలి వారిని దాసీజనుల వలె జూడ మొదలుపెట్టిన తరువాతనే మనదేశమున కిట్టి దౌర్భాగ్యదశ యారంభమైనది” అని కందుకూరి వారు వాపోయేవారు.. 


తల్లి కడుపులో తప్ప స్త్రీ కి రక్షణ, విలువ లేదని ఆవేదన వ్యక్తం చేసారు కొల్లూరి వారు.. ఈరోజుల్లో ఆ గర్భంలో కూడా స్త్రీ కి రక్షణ లేకుండా పోయింది.. 


తమ స్వార్ధ ప్రయోజనాల కోసం స్త్రీ అందచందాలను, ఒంపు సొంపుల్ని, సోయగాల్ని. హొయల్ని వ్యాపారాభివృద్ది నిమిత్తం వాడుకోవడం మగజాతిని మరింతగా దిగజారుస్తుంది.. 


స్త్రీ సనాతన మూఢాచార సంప్రదాయ ముసుగులో నత్త నడక నడుస్తోంది.. పురుషునితో సమానంగా స్త్రీ ఏనాడైతే ముందుకు నడుస్తుందో ఆనాడే దేశం బాగుపడుతుంది. ఇందుకు అన్నీ వర్గాల వారు ముఖ్యంగా నాయకులు ముందుకు రాగలగాలి .. 
స్త్రీ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి,, 
స్త్రీ మాతృ మూర్తియే కాదు.. మానవతా మూర్తి కూడా.. 
అర్ధం చేసుకోండి.. __/\__

Written by : Bobby Nani
 

No comments:

Post a Comment