Saturday, November 30, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 19th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఆ డ్రాగన్ వృక్షం కిందనే మోహన్ కాస్త గుంట త్రవ్వి మంట రాజేసాడు.. మీరు ఉండండి నేను ఒకటి చేస్తాను అంటూ ఆ అమ్మాయి ఓ పాత్ర పెట్టి నౌక నుంచి తీసుకొచ్చిన కొన్ని ఆహార పదార్ధాలతో ఆహారం తయారుచెయ్యడం ప్రారంభించింది…

ఓ ముప్పై నిమిషాల అనంతరం ఆ ఆహారాన్ని అందరూ కమ్మగా కడుపునిండా ఆరగించి అన్నీ సర్దుకొని బయలుదేరారు…

కొన్ని గంటల ప్రయాణం అనంతరం వారికి ఓ సమస్య వచ్చి పడింది…

తరువాత ఏంటో చూద్దాం పదండి..
19th Part
వారిని కొందరు ఆటవికులు చుట్టుముట్టారు.. ఏవో నోటితో విచిత్రమైన సైగలు చేస్తూ, కోపంగా చూస్తూ, వారందరినీ బలవంతంగా తీసుకు వెళ్తుండగా.. 


నౌకలోనుంచి వీరితో కలిసి వచ్చిన ఆ పిల్లాడు భయం భయంగా చూస్తూ.. అయ్య బాబోయ్ వీరికి దొరికామ మనం.. అంటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి... ఇక అందరం ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుందాం.. అని అంటాడు… 

ఏమైంది? ఎందుకు అలా అంటున్నావ్? అని 

మిగిలిన వారందరూ ప్రశ్నిస్తారు

ఎవరనుకుంటున్నారు వీళ్ళను ?? 

ఈ ప్రపంచంలో మనుషుల్లా ఉన్న వీరు మేము ఎప్పటికీ మనుషులం కాము అని భావిస్తూ.. వీరికి కనిపించిన మనుషుల్ని అత్యంత దారుణంగా వేటాడి వారిని చిత్రవధ చేసి చంపేయడం వారి అలవాటు.. అసలు మనిషంటేనే వీరికి గిట్టదు.,.. 

వీరు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రారు.. ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు కూడా అజ్ఞాతంగానే ఉంటారు.. 

వీరు ఎక్కడ ఉంటారు ?? 

ఎలా ఉంటారు? 

అనేది అందరికీ ఓ ప్రశ్నార్థకమే..!!

కొన్ని సంవత్సరాల క్రితం ఓ తుఫాను భీభత్సం చేస్తున్న సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు నౌకలో ఇటువైపుగా వెళ్తున్న మేము ఈ దీవికి తీరంవెంట పడివున్న ఓ వ్యక్తిని కనుగొన్నాము.. 

అతను తన రెండు చేతులు పైకి ఎత్తి మమ్మల్ని వేడుకుంటూ పడిపోయి ఉండడం గమనించాము.. మా కెప్టెన్ గారికి ఎందుకో తన పై జాలి కలిగి అతన్ని తీసుకొని రమ్మని మనుషులను పంపాడు.. వారు వెళ్ళి తీసుకు వస్తుండగానే అతడు మార్గమధ్యంలో మరణించాడు.. ఆ వ్యక్తి మరణించేటప్పుడు కొన్ని భయంకరమైన వాస్తవాలను వారికి చెప్పాడట.. అతని దేహాన్ని మా నౌకలోకి తీసుకు వచ్చిన తర్వాత అతని శరీరం చూసిన మా నౌక లోని వారంతా స్పృహ కోల్పోయి, తిన్నది బయటకు వచ్చేలా వాంతులు చేసుకున్నారని చెప్పారు… 



అతని శరీరం అంతా వందల, వేల సంఖ్యలో రంధ్రాలతో తూట్లు పడి ఉన్నాయని మధ్య మధ్యలో సూర్యచంద్రుల ఆకారంలో గాయాలు ఉన్నాయని వారు అన్నారు…

వారి తెగ పేరు "యక్షామ" అని వారి ఒంటిపై సూర్యచంద్రుల ఆకారపు గుర్తులు అంతటా ఉంటాయని వారు అన్నారు.. అలాగే వారు రాక్షస గబ్బిలాలను పూజిస్తారు అని చెప్పారు… యక్షామీలు చాలా పురాతనమైన వారు అని క్రీస్తుశకం 52 నుంచి వీరి మనుగడను కొనసాగిస్తున్నారని నౌకలో మాట్లాడుకుంటుంటే విన్నాను… అంతేకాదు వీరు ప్రపంచంలోకెల్లా అత్యంత నిపుణులైన మంత్రముగ్ధులట.. అందుకే వారి మనుగడ తెలుసుకోవడం అసాధ్యమని చెప్పారు.. 

ఇక్కడ ఎన్నో తెగలవారు ఉన్నారు కానీ .. యక్షామ పేరు చెప్తే మిగిలిన వారందరూ వణికిపోతారు.. వీరి గురించి మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేరు.. వికృతంగా అఘోరాల వలె కనిపించే యక్షామీ లు చాలా పురాతనమైన వారు ప్రత్యేకమైన వారు అని చెప్తాడు… వారి ఒంటి మీద ఉన్న ఆ సూర్యచంద్రులు ఆకారాలను బట్టి నేను వీరిని కనుగొన్నాను అంటాడు ఆ పిల్లాడు.. 

అంటే మనల్ని కూడా అలా తూట్లు పెట్టి చంపేస్తారా !! 

వణుకుతూ అడుగుతుంది ఆ అమ్మాయి…!!

ఏదోఒక మార్గం వుండే ఉంటుంది.. ఎవ్వరూ భయపడకండి.. మా గురువు గారు ఇక్కడే ఉన్నారు అని అంటాడు మోహన్… 

అయినా వీరిని చూస్తుంటే మనల్ని కావాలనే తీసుకువెల్తున్నట్లు, మనకోసమే ఇక్కడకు వచ్చినట్లు కనిపిస్తున్నారు.. 

ఒకవేళ వీరు మనపై దాడి చెయ్యాలకునుంటే ఇంత ప్రశాంతంగా తీసుకువెల్తారా ?? 

అందుచేత మీరెవ్వరూ భయపడాల్సిన పనిలేదు.. అని ఆకాష్ అంటాడు.. 

వీరితో మనం మాట్లాడగలిగితే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు అంటాడు ఆకాష్.. 

నాన్నగారు మీరు పెద్దవారు మీరైతే బాగుంటుంది.. మీరే వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి అని చెప్తాడు.. 

నాన్న అంటే ఎంత ప్రేమరా నీకు ఇలాంటి విషయాల్లో మాత్రం ముందుకు తోస్తావ్.. ఇక తప్పదుగా అంటూ భయంగానే ముందుకు కదులుతాడు.. 

మాట్లాడాలని ఏదో చెప్పబోతూ వుండగా .. వారిలో ఒకరు తమ నడుము మొలకు చుట్టివున్న ఓ చిత్రపటాన్ని తీసి ఇస్తాడు.. ఆ చిత్రం ఇదివరకు విచిత్ర ఆకారములో గల ఆ అమ్మాయిది.. వెంటనే ఆమెను గుర్తుపట్టిన ప్రసన్నకుమార్ భాటియా అందరికీ చూపిస్తాడు.. ఇంతలో వారి తాత్కాలిక స్థావరం వచ్చింది.. అక్కడ ఓ అందమైన యౌవన మహిళ విచిత్ర వేషభూషణములో కనిపిస్తూ తనకన్నా ఎత్తునవున్న కర్రలాంటి ఆయుధాన్ని పట్టుకొని వుంది.. వారు వారి బాషలో ఆమెతో ఏవో మాట్లాడి వెళ్ళిపోయారు.. 

ఆమె రెప్పవేయకుండా వీరందిరినే తీక్షణంగా చూస్తూ వుంది.. 


వీరికి ఏం మాట్లాడాలో అర్ధం కాక అలానే మౌనంగా వుండిపోయారు.. మొదట మాట్లాడే సాహసం చెయ్యలేకపోయారు.. 

అలానే చూస్తున్న ఆమె దృష్టి ఆకాష్ మీద ఆగి .. 

కాసేపు ఆకాష్ ని చూస్తూ ఇలా రా అంటూ చేతితో సైగ చేసింది.. 

రెండడుగులు ముందుకు వచ్చి నిల్చున్నాడు ఆకాష్.. 

మీరు చూసిన చిత్రంలోని అమ్మాయి నా సోదరి..తనే మీకు ఆ నేలమాళిగలో కనిపించింది.. తనను కొందరు చిత్రవధ చేసారు.. తరువాత బంధించారు.. చివరికి తను చనిపోవడానికి కారణం కూడా అయ్యారు.. తను బాధపడటానికి ఓ కన్నీరు బొట్టును కూడా మిగల్చకుండా దారుణంగా చంపేసారు.. 

మీరు భయపడాల్సిన పనిలేదు.. 

యక్షామీలు భయంకరులే కాదు రాక్షసులు కూడానూ .. కానీ ఊరికే వారు ఎవ్వరికీ హాని తలపెట్టరు ..

వారిని ఇబ్బందిపెట్టినవారిని మాత్రం వారు అస్సలు వదలరు.. శతాబ్దాలనాటి మనుగడలో లేని శిక్షలను విచక్షణారహితంగా అమలుచేస్తారు.. ఇక్కడ నాయకుడు ఎవరూ వుండరు .. ఎవరికి వారే నాయకులు.. యక్షామీలలో ఆఖరి ఆడమంత్రముగ్ధిని నేనే.. నా పేరు “ఉవిధ” నా వయస్సు మీ ముత్తాత చిన్మయానంద్ భాటియా గారికన్నా ఎక్కువే.. అనగానే 

ప్రసన్నకుమార్ భాటియా ముందుకు వచ్చి మా తాతగారు మీకు తెలుసా ?? 

ఎవరమ్మా మీరు అని ప్రశ్నిస్తాడు.. 

భూత, భవిష్యత్, వర్తమానాన్ని నేను దర్శించగలను.. 

ఇకపోతే మీ తాత గారు మాకెంతో సాయం చేసి మాలో ఒకరైనారు.. 

మా యక్షామీలలో మగవారికి మంత్రవిద్య తెలియదు.. ఆడవారే వారి మార్గనిర్దేశకాలు.

ఈ దీవిలో ఎన్నో ఏళ్ళనుంచి స్త్రీ ఆక్రందన ఆ సముద్ర కెరటాల శబ్దం కన్నా భీకరంగా వినిపిస్తోంది..

వారు దాన్ని ఆపాలని ఎంతో శ్రమించారు.. నిజంగా చిన్మయానంద్ భాటియా గారు ఓ గొప్ప వ్యక్తి .. 

నేడు వారు లేకపోయినా వారి సంకల్పమే ఇంకా పోరాడుతుంది మీ రూపంలో.. !!

మీరేమంటున్నారో నాకు అర్ధం కావట్లేదు అండి అంటూ ప్రసన్నకుమార్ భాటియా అనగానే …

నాతోపాటు రండి ఇక్కడ ఎక్కువసేపు వుండకూడదు .. మీకు అన్నీ విషయాలు తెలుస్తాయి.. అంటూ ముందుకు కదుల్తుంది.. 

ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా ఆమె వెనుకనే వెళ్తారు.. 

ఇప్పుడు వారు ఉన్నచోటు నుంచి వారు వెళ్ళాలనుకున్న చోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.. రెండు పెద్ద పెద్ద కొండల మధ్యన ఎవరో కోసినట్లు వుండే సన్నని ద్వారము అది చూసి అందరూ సంతోషపడుతుండగా .. ఇది సంతోష పడాల్సిన విషయం కాదు.. చాలా క్రూరమైన మానవ మృగాలు సంచరించే చోటు ఇదే.. నా సోదరిని పోగొట్టుకున్న ప్రదేశం ఇదే..ఈ అమ్మాయిని కనుక వారు చూస్తే ఇక అంతే చూసిన రోజే తనకు చివరిది అవుతుంది అని అంటుంది ఆమె.. త్వరగా ఇటు రండి అని ఓ కొండచరియ ప్రక్కన గల రహస్య నేలమాలిగ లోనికి తీసుకెళ్తుంది.. 


ఇప్పడు అడగండి మీరేమడగాలి అనుకుంటున్నారో.. 

అసలిక్కడ ఏం జరుగుతుంది ?

మా ముత్తాత గారు వీలునామాలో ఇంత రహస్యంగా రాసి మమ్మల్ని ఇక్కడదాకా ఎందుకు రప్పించారు ??

వారి ఉద్దేశం ఏంటి ?

అసలు మీరెవరు ? మా బాష మీరెలా మాట్లాడగలుగుతున్నారు ?

మీకు మేమంతా ఎలా తెలుసు ?

ఆడవారిని ఇక్కడ ఏం చేస్తున్నారు ?


అసలు ఆ కన్నీటి ఆకారం గల గుర్తు ఏంటి ? ఎక్కడ చూసినా అదే ఉంటోంది ..

చకచకా ప్రశ్నలు సంధిస్తాడు లోకేష్.. 

మీ ప్రతీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను అని .. ఇలా మొదలుపెడుతుంది.. 

కొన్నిసంవత్సరాలకు ముందు ఈ చోటంతా మా యక్షామీల నివాస స్థావరం.. మాలో అందరూ మూడు వందలనుంచి అయిదు వందల ఏళ్ళ దాకా జీవిస్తారు.. ఈ రహస్యం మాకు తప్ప మరెవ్వరికీ తెలియదు.. దీనికి కారణం మా ఆడవారిలో వున్న “మంత్రదములు”. ఇవి ఒక తరమునుంచి మరు తరమునకు మర్మముగా అందించబడుతూ వస్తున్నవి.. వాటివల్లనే మా సంతతి ఇంత రహస్యముగా జీవించుచున్నది.. అంతే కాదు మేము సూర్య, చంద్రుల తేజస్సునుంచి శక్తిని పొందుతాము.. నక్షత్రాలే మా దిక్కులు, మాలో చనిపోయినవారిని ఒక్కో నక్షత్ర్రంగా భావిస్తాము.. ఇలా మనుగడ సాగిస్తూ వున్న మా స్థావరంలోకి అనుకోకుండా ఒకరోజు ..

To be continued …

Written by : BOBBY

No comments:

Post a Comment