Friday, March 9, 2018

SOCOTRA (The Mysterious Island) from Bobby... 17th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఎమ్మా నీ కేమనిపిస్తుంది అని ప్రసన్నకుమార్ భాటియా ఆ అమ్మాయిని ప్రశ్నిస్తాడు..

అయ్యో .. నాకేమి తెలియదండి.. నాకు బయటి ప్రపంచం గురించి తెలియదు… కాని ఈ కట్టడం నాకు కోవెలలా అనిపిస్తుంది అని చెప్తుంది..

కోవెల.. అంటూ అందరూ వెటకారంగా నవ్వడం ప్రారంభిస్తారు..

నవ్వకండి అని కోపంగా ప్రసన్నకుమార్ భాటియా అందరినీ వారిస్తాడు..

ఆమె చెప్పింది అక్షరాల నిజం .. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..

ఆ మాటతో ఆశ్చర్యపోయిన వారంతా ఎలా చెప్పగలిగారు అని ఆమెను ప్రశ్నిస్తారు..
ఏమి లేదు ఈ ప్రదేశం చూడటానికి చాలా ప్రశాంతంగా, చుట్టూరా విశాలంగా వుంది.. అదికాక సముద్రమట్టానికి చాలా ఎత్తులో వుంది..ఇక్కడనుంచి చూస్తే చూట్టూరా చాలా మైళ్ళు దూరంవరకు మొత్తం కనిపిస్తుంది.. కోవెలను ఇలానే నిర్మించేవారు నాటి రోజుల్లో .. అన్నిటికన్నా ముఖ్యం ఆ గోడలపై మన భారతదేశం యొక్క బ్రహ్మలిపి చెక్కబడి వుంది.. ఈ లిపి కేవలం పవిత్రమైన గోడలపైనే చెక్కుతారని శాస్త్రం చెప్తోంది.. కోవెల కన్నా పవిత్రత మరేమి ఉంటుంది .. ఇలా నాకు అనిపించింది అని ఆ అమ్మాయి సమాధానం ఇస్తుంది..

ఇవి విన్న వారంతా కళ్ళు అలానే పెద్దవి చేసి ఆమెనే చూస్తూ ఉండిపోయారు ..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
17th Part

మరి మీరెలా చెప్పగలిగారు అని మోహన్ ప్రసన్నకుమార్ భాటియాను ప్రశ్నిస్తాడు.. 

చెప్తాను అందరూ ఇలా రండి అని అక్కడ వున్న మరో గోడను చూపిస్తాడు. 

అది సూర్య, చంద్రుల గుర్తులతో అనంత విశ్వాన్ని చూపెడుతోంది.. ఇక్కడ చూసారా సూర్య, చంద్రుల మధ్యన ఈ రాతి గుట్ట ఆకారంలో ఈ నిర్మాణం వుంది.. 

పక్కన చూసారా అందరూ ఈ రాతిగుట్టను రెండు చేతులతో మ్రోక్కుతున్నట్లుగా ఒకరివెంట మరొకరు నిలబడి వున్నారు.. అదీకాక ఈ “SOCOTRA” దీవిలో కొన్ని శతాబ్ధాలకు మునుపు ఇక్కడ కనిపించే సూర్య, చంద్రులను మాత్రమే ఆరాధించేవారు అని చదివాను.. అందుకే ఇక్కడ విగ్రహాలు ఉండవు .. ప్రతిమలు ఉండవు అని సమాధానం ఇస్తాడు.. 

మాకు తెలియకుండా మీరు ఇక్కడి విషయాలన్నీ బాగా పుస్తకాల రూపంలో చదివి వచ్చారన్నమాట అని ఆకాష్ అంటాడు.. పిల్లల్ని తీసుకొని ఓ తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ పరిస్థితులన్నిటినీ తెలుసుకోవద్దూ ... అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఇంకా ఏం తెలుసు మీకు అని అడుగుతాడు మోహన్.. 

దీనికింద ఓ పెద్ద నేలమాలిగ వున్నట్లు చదివాను.. కాని అది అత్యంత ప్రమాదకరమైనది అని రాసుంది.. 

నేలమాలిగ … !!

అయితే తప్పకుండా అదేంటో తెలుసుకోవాలి… !!


ప్రమాదం అన్నారంటే తప్పకుండా అందులో ఏదో ఉండే ఉంటుంది ..అని మోహన్ అంటాడు.. 

అన్ని తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు.. కాని ఆ తెలుసుకునే ప్రయత్నం ప్రాణాలను బలితీసుకునేంతలా ఉండకూడదు అని నా అభిప్రాయం.. అని ప్రసన్నకుమార్ భాటియా అంటాడు.. 

క్షమించండి … అని మోహన్ సమాధానమిస్తాడు.. 

నాకు చాలా దాహంగా వుంది అని ఆ అమ్మాయి ఆకాష్ ని అడుగుతుంది .. వారు తెచ్చుకున్న నీరు చాలా తక్కువ మోతాదులో వుంది..అందులోనుంచి కాస్త నీరు ఆమె నోటిలోకి పోస్తున్నాడు ఆకాష్.. 

ఆమె రెండు దోర పెదవులను దూరంగా చేసి తలపైకెత్తి నీరు త్రాగుతున్న దృశ్యం ఆకాష్ నవనాడులలో నూతన స్పందనలను కలిగిస్తున్నాయి.. పెదవి కొసల నుంచి జాలువారిన నీటి బిందువులు ఆమె గవుదము నుంచిగా మెడమీదకు చేరుకొని అక్కడనుంచి క్రిందగా పయనించి హృదయ వేదికపైకి చేరుకొని కనుమరుగౌతున్నాయి .. shhhh.. ఈ క్షణం ఆ నీటి బొట్టులా మారినా నా జన్మ ధన్యమే కదా అని అనుకుంటూ .. వెళ్లి ప్రక్కన కూర్చుంటాడు.. సుకుమారంగా ఆమె తన పారాణి హస్తములతో అధరములకంటిన నీటి బిందువులను పమిట కొంగుతో తుడ్చుకుంటూ చకోరిలా ఆకాష్ వైపే చూస్తూ సమ్మోహన బాణాలను వడి వడిగా సంధిస్తోంది.. 

వీరిద్దరి చూపులకు తాళలేక ప్రసన్నకుమార్ భాటియా కాసేపు అందరం ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం … మళ్ళి మనకు ఇలా విశ్రాంతి దొరుకుతుందో లేదో.. అని అంటాడు… 

అలా అనడమే ఆలస్యం.. అందరూ తమతమ వస్తువులను ప్రక్కనపెట్టి కాసేపు నడుము వాలుస్తారు.. అలానే మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు మోహన్.. ఇంతకుముందు మోహన్ కి వచ్చిన కల మళ్ళి పునరావృతం అవుతుంది.. “అఘోరా” మళ్ళి కనిపిస్తూ .. నాకు చాలా సమీపానికి వచ్చావ్ … పైన ఏముందని కూర్చుని వున్నావ్.. పాతాళానికి రా.. నేనిక్కడే వున్నాను.. నీ ఊపిరి నాకు తగుల్తోంది.. నాలో నూతన ఆనందాన్ని ఉసిగొల్పుతోంది.. అని అంటాడు… ఉలిక్కిపడి మేల్కొన్న మోహన్ ను ఏమైంది అంతలా భయపడ్డావ్ అని అడుగుతాడు ప్రసన్నకుమార్ భాటియా.. 


నా…నా ....కు.. నాకు.. నాకు మళ్ళి ఆ …ఆ .. కల వచ్చింది.. మా గురువు గారు నాకేదో చెప్తున్నారు.. అర్ధం కావట్లేదు.. అని వణుకుతున్న తన స్వరంతో సమాధానమిస్తాడు.. ఆయనేమన్నారు అని అడుగుతాడు … నా ఊపిరి ఆయనకు తగుల్తుందంట .. పాతాళానికి రమ్మన్నారు అని చెప్తాడు.. పాతాళం ఇక్కడ ఎక్కడ వుంది… ఊపిరి తగలడం ఏంటి నాకేమి అర్ధం కావట్లేదు అని చిన్నోడైన సంతోష్ అంటాడు.. ఆ .. గుర్తొచ్చింది.. ఆయన మరొకటి కూడా అన్నారు.. పైన కూర్చుని ఏం చేస్తావ్.. పాతాళానికి రా నేనక్కడే వున్నాను.. అని అన్నారు.. అంటే నాకిందనే వున్నారనే గా అర్ధం.. ఇక్కడ నేల మాలిగ కూడా ఉందని మీరేగా చెప్పారు .. అయితే నేను వెంటనే అక్కడకు వెళ్ళాలి అని మోహన్ అంటాడు.. సరే నీతో పాటు మేమూ వస్తాం పదా.. అని ప్రసన్నకుమార్ భాటియా అంటాడు.. ఇక అందరూ వారి వారి సామాగ్రిని సర్దుకొని నేల మాలిగ లోనికి దారి కోసం వెతుకులాట ప్రారంభిస్తారు.. 

అందరూ ఎంతో సేపటినుంచి వెతుకుతూనే వున్నారు కాని వారెవరికీ కిందకు వెళ్ళే మార్గం దొరకలేదు.. ఇక అందరూ అలసి ఆ పెద్ద రాయిపై కూర్చుంటారు.. అలా అందరూ కూర్చుని ఆలోచిస్తూ వుండగా.. కళాఖండాలను నిశితంగా పరిశీలిస్తుంది ఆమె.. అది గమనించిన ప్రసన్నకుమార్ భాటియా… 

అమ్మా… అంతలా చూస్తున్నారు మీకేమైనా అర్ధం అయిందా అని అడుగుతాడు … అర్ధం అయిందో లేదో తెలియదు కాని ఆ కలాఖండంలో అందరూ ఈ రాతిని మొక్కుతున్నట్లుగా వుంది.. బహుశా ఈ రాయిలోనే ఏదో విషయం దాగుంది అని చెప్తుంది.. 

ఆ మాట చెప్పిన వెంటనే అందరూ ఒక్కసారిగా ఆ రాయిమీద నుంచి లేచి నిల్చుంటారు.. ఆకాష్, మోహన్ లు ఆ రాయికి దగ్గరగా వెళ్ళి నిశితంగా పరిశీలిస్తున్నారు.. దాన్ని ప్రక్కకు జరపడానికి, కదపడానికి చాలా ప్రయత్నిస్తున్నారు .. కాని ఇసుమంత కూడా అది కదల్లేదు … మళ్ళి వారికి నిరాశే ఎదురైంది.. 

కొన్ని క్షణాలు అందరిలో మౌనం … 

అప్పుడే ఆకాష్ లేచి నిల్చొని నాకు ఒక ఆలోచన వచ్చింది..అని అంటాడు.. మన చుట్టూ ప్రక్కల రకరకాల కలాఖండాలతో కొన్ని చెక్కి వున్నారు… కొన్ని శిధిలమై వున్నాయి.. కొన్ని విరిగి పడి వున్నాయి.. వాటి అన్నిటినీ మనం సేకరించి పరిశీలిస్తే తప్పకుండా ఈ నేలమాలిగ గురించి ఏదో ఒక దానిలో ప్రస్తావించి ఉంటారు.. మనం తెలుసుకోవచ్చు.. మన ముందు వున్నది ఇది ఒక్కటే దారి అని చెప్తాడు.. 

ఆకాష్ మాటలు వారికి నచ్చి అందరూ వెంటనే పని మొదలు పెడతారు… ఇలా కొన్ని గంటలు వెతుకుతూనే వుంటారు.. మెల్లిగా చీకటి పడటం మొదలైంది.. ఈ రాత్రికి ఇక్కడే వుండాలని వారు భావిస్తారు.. 

మంటకు కావాల్సిన వంట చెరుకు సమకూర్చుకుంటారు.. మంచి చోటు చూసి మంట వెయ్యడం మొదలు పెడతారు.. అందరూ మంటకు దూరంగా కూర్చుని మాట్లాడుకుంటూ వుండగా.. చిన్నోడు అయిన సంతోష్ తగ్గుతున్న చిన్న మంటను గమనించి మరిన్ని పుల్లలు వేస్తాడు.. టప టపమనే శబ్దంతో మంట కాస్త పెద్దదిగా ఒక్క క్షణం మండి తగ్గుతుంది.. ఆ ఒక్క క్షణంలో వారు ఉంటున్న రాతిగుట్టలో ఎన్నో రాతలు, బొమ్మలు పసిడికాంతులతో ఒక్కసారిగా వెలిగి ఆరిపోయాయి. 

ఆశ్చర్యచికితుడైన సంతోష్ .. వెంటనే .. మీరు ఇది గమనించారా అని అంటాడు.. 

నిజానికి ఎవ్వరూ ఆ పసిడికాంతులను చూడలేదు.. 

ఏమైంది రా అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

నాన్నా .. నేను ఇక్కడ ఎండు పుల్లల్ని వెలిగించగానే ఇక్కడ మన చుట్టూ వున్న రాళ్ళపై యేవో కాంతులు కనిపించాయి.. అంటూ చాలా ఆశ్చర్యంగా తన రెండు కళ్ళూ పెద్దవిగా చేసి చెప్పాడు.. 

అందరూ సంతోష్ కి దగ్గరగా వచ్చి.. నిజమా.. ఏది మళ్ళి మంట పెద్దదిగా వెయ్యి అని మోహన్ అంటాడు… 

ఈ సారి మరిన్నిపుల్లలు వెయ్యగానే ఆ రాతి గుట్ట మొత్తం పసిడికాంతులతో నిండిపోయింది.. చుట్టూరా ఏవేవో రాతలు, ఆకారాలు, గుర్తులు, బొమ్మలు ఇలా ఎన్నో… అందరూ ఆశ్చర్యపోయి నోర్లు ఎల్లబెట్టి చూస్తూ వుండిపోయారు.. అలానే మంటను మండిస్తూనే వుండు సంతోష్ .. మనకు కావలసినవి తప్పక ఇక్కడ ఉంటాయి అని అంటాడు మోహన్… 

ఇదంతా చూస్తున్న ప్రసన్నకుమార్ భాటియాకు ఒక్క విషయం అర్ధం అయ్యి ఇలా అంటారు.. 

ఇక్కడ వున్న కళాఖండాలు చాలా అద్బుతంగా రూపొందించినవి .. సృష్టి ఆవిర్భావం మొదలు, అంతం అయ్యే వరకు ఈ కళాఖండాల రూపంలో ఆనాటి పండితులు పొందుపరిచారు.. ఆనాటి వారల మేధోసంపత్తి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది...అని అంటూవుండగానే.. ఆ పసిడి కాంతులలో వారికి సమీపమున ఉన్నటువంటి రాతిగుట్ట కనిపిస్తుంది.. ఆ రాతిగుట్టపై సూర్యుని అరుణవర్ణ కిరణాలు పడుతున్నట్లుగా ఉంది.. అది చూచిన వారందరికీ విషయం అర్ధం అవుతుంది… 


చూసారా సూర్య కిరణాలు ఆ రాతిగుట్టపై పడి ఏదో నిఘూడ అర్ధాన్ని మనకు చెప్తున్నట్లు ఉన్నాయి.. అని మోహన్ అంటాడు .. 

బాగా గమనించు మోహన్ .. ఆ సూర్య కిరణాలు నేరుగా ఆ రాతిగుట్టపై పడట్లేదు.. ఒక 7 అడుగుల మనిషి నిలుచుకున్న దానికన్నా కాస్త ఎత్తునుంచి ఆ కిరణాలు రాతిగుట్టపై పడుతున్నాయి.. ఇది అసాధ్యం.. దాదాపుగా 3 డిగ్రీల కోణంలో ఉండొచ్చు.. ఈ కోణంలో కిరణాలు పడటం ఎలా సాధ్యం అని ప్రసన్న కుమార్ భాటియా అంటారు.. 

ఎందుకు సాధ్యం కాదు నాన్న గారు.. మీరన్నట్లు 7 అడుగుల మనిషి కన్నా కాస్త ఎత్తు.. 3 డిగ్రీల కోణం రెండూ షుమారుగా ఓ తొమ్మిది అడుగుల ఎత్తునుంచి పడుతుండొచ్చు .. అంటే సూర్య కిరణాలు ఏటవాలుగా ఒక తొమ్మిది అడుగుల బింబం మీద పడి అక్కడనుంచి నేరుగా ఈ రాతిగుట్టపై ప్రతిబింబంగా పడుతున్నాయోమో .. ఆలోచించండి.. అని ఆకాష్ అంటాడు.. 

చాలా గొప్పగా చెప్పావ్ ఆకాష్ అని మోహన్ అంటూ.. ఇక్కడ మనం మరోటి కూడా ఆలోచించాలి .. ఆ ఏటవాలు సూర్య కిరణాలు ఏ సమయంలో ఆ బింబం పై పడుతున్నాయో మనం కనిపెట్టాలి.. అంతే కాదు.. ఎంత సమయం ఆ బింబంపై ఉంటాయో కూడా చూడాలి.. ఇదంతా మనకు తెలియాలంటే ముందు మన చుట్టూ 9 అడుగుల ఎత్తులో వున్న ప్రతీ చోటును మనం వెతకాల్సి ఉంటుంది.. వెంటనే మొదలు పెడదాం రండి అంటూ మోహన్ అంటాడు.. 

అనుకున్నదే తడువుగా అందరూ వెతకనారంభించారు.. చూట్టూ గోడలపై తలోదిక్కూ వెతుకుతున్నారు..కానీ ఫలితం శూన్యం.. ఎక్కడా చిన్న ఆచూకీ కూడా దొరకలేదు... నిరాశా, నిస్పృహల మధ్యన, నిద్రాభంగంతో, అలసిన నయనాలతో తలోదిక్కున అందరూ సతికిలపడ్డారు.. 

మెల మెల్లగా తెల్లవారుతోంది… అందరిలో అసహనం తాండవిస్తోంది…. అనవసరంగా మనమంతా ఇక్కడకు వచ్చామేమో అనే ఒత్తిడి వారిలో తారాస్థాయికి చేరుకుంది.. ఆ సమయంలో వారి ఆలోచనా ధోరణి మొద్దుబారిపోయింది.. గత కొన్ని రోజులుగా నిద్ర, ఆహారం లేని కారణంగా, అలసిన దేహంతో చెయ్యి కూడా కదుపలేని స్థితిలో వారు ఉన్నారు.. 

To be continued …

Written by : BOBBY

4 comments:

  1. చాలా కాలం విరామం తర్వాత కధ లో మరొక భాగం రాసారు. తరువాత భాగం ఇంకెన్నాళ్ళకు?

    ReplyDelete